Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐపీఎల్ 14 ప్లే ఆఫ్స్ రేసు ఆసక్తికరం
దుబాయ్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్లే ఆఫ్స్ రేసు ఆసక్తికరంగా మారింది. చెన్నై సూపర్కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూర్లు టాప్-4లో మూడు స్థానాలు కైవసం చేసుకున్నాయి. టాప్-2లో నిలిచేందుకు ఈ మూడు జట్ల నడుమ మరో పోటీ నడుస్తున్నా, టాప్-4లో నాల్గో స్థానం కోసం ఏకంగా నాలుగు జట్లు పోటీ పడుతున్నాయి. సన్రైజర్స్ హైదరాబాద్ మాత్రమే ఇప్పటి వరకు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. పంజాబ్ కింగ్స్ ఆశలు సైతం దాదాపు ఆవిరైనా.. సాంకేతికంగా ఆ జట్టు ఇంకా ప్లే ఆఫ్స్ రేసులోనే కొనసాగుతోంది.
టాప్-4లో మిగిలిన ఓ స్థానం రేసులో కోల్కత నైట్రైడర్స్ హాట్ ఫేవరేట్. 13 మ్యాచుల్లో మోర్గాన్సేన 12 పాయింట్లు సాధించింది. నెట్ రన్రేట్ 0.294 గొప్పగా ఉంది. చివరి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై విజయం సాధిస్తే ఎటువంటి సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా ప్లే ఆఫ్స్ బెర్త్ సొంతం చేసుకోనుంది. రాయల్స్ చేతిలో నైట్రైడర్స్ ఓడితే.. సమీకరణాలు రక్తి కట్టనున్నాయి. 12 మ్యాచుల్లో 10 పాయింట్లు సాధించిన రాయల్స్కు సైతం మంచి అవకాశం ఉంది. లీగ్ దశలో ఆడాల్సిన చివరి రెండు మ్యాచుల్లో కోల్కత, ముంబయిలతో తలపడాల్సి ఉంది. ప్లే ఆఫ్స్ దారిలో ఈ రెండు జట్లే రాయల్స్కు అడ్డు. ముఖాముఖి మ్యాచుల్లో ఈ రెండు జట్లను ఓడిస్తే 14 పాయింట్లతో రాజస్థాన్ టాప్-4లో నిలువనుంది. ముంబయి ఇండియన్స్ 12 మ్యాచుల్లో పది పాయింట్లతో ఉంది. ఈ జట్టు చివరి రెండు మ్యాచుల్లో గెలుపొందినా అవకాశాలు తక్కువ. రాయల్స్తో మ్యాచ్లో కోల్కత ఓటమి చెందితేనే ముంబయికి వాస్తవిక అవకాశాలు ఉంటాయి. కోల్కత, ముంబయి, రాజస్థాన్లు 12 పాయింట్లతో సమవుజ్జీలుగా నిలిచినా.. మెరుగైన నెట్ రన్రేట్తో కోల్కత ముందంజ వేయనుంది. దీంతో రాయల్స్, ముంబయికి విజయంతో పాటు నెట్ రన్రేట్ను మెరుగు పరిచే భారీ విజయాలు అవసరం. పంజాబ్ కింగ్స్ చివరి మ్యాచ్లో సూపర్కింగ్స్పై గెలుపొంది 12 పాయింట్లు సాధించినా.. ఆ జట్టు నెట్ రన్రేట్ ప్రకారం టాప్-4లో నిలువటం అసాధ్యమనే చెప్పాలి.