Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : బంగ్లాదేశ్పై వరుసగా రెండు వన్డేలతో పాటు సిరీస్ను కోల్పోవడంతో బారత క్రికెట్ జట్టుపై దేశమంతా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ధోనికి మద్దతుగా నిలిచాడు. 'ధోని గొప్ప నాయకుడు. వన్డేల్లో జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. రికార్డులు నెలకొల్పాడు. అతనికి ఆలోచించుకోవడానికి కొంచెం సమయమివ్వండి' అని వెల్లడించారు. రెండో వన్డే అనంతరం ధోని విలేకరులతో మాట్లాడుతూ కెప్టెన్సీ నుంచి వైదొలగడానికి సిద్ధం అంటూ మాట్లాడిన తర్వాత అతనికి పలువురు మాజీ క్రికెటర్లు కూడా మద్దతుగా నిలిచారు. గంగులీ మాట్లాడుతూ 'మ్యాచ్ ఓడిపోయిన అనంతరం ధోని ఉద్యేగంలో అలా మాట్లాడాడు. అతడు చాలా అప్సెట్ అయ్యాడు. అతని మాటలను ఎవరూ సీరియస్గా తీసుకోవలసిన అవసరం లేదు. వన్డేల్లో ధోనికి చాలా మంచి రికార్డు ఉంది. అతనికి కొంచెం గౌరవం ఇవ్వండి.అలాగే ఓటమిపై అందరూ కూర్చుని మాట్లాడుకోవాలి' అని వెల్లడించారు. వచ్చే ఏడాది జరిగే టి20 వరల్డ్ కప్ వరకు ధోని కెప్టెన్గా కొనసాగాలా అని అడిగిన ప్రశ్నకు గంగూలీ స్పందిస్తూ అది ఓ ఒక్కరి నిర్ణయమో కాదన్నాడు. 'అటువంటివి ఒక్కరాత్రిలో తీసుకునేవి కావు. ప్రస్తుతం ఈ సిరీస్ ముగియనివ్వండి' అని బదులిచ్చాడు.