Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాక్ బోర్డు చైర్మెన్ నజమ్ సేథీ
లాహోర్ : 2009లో శ్రీలంక క్రికెట్ జట్టుపై ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్లో అంతర్జాతీయ క్రికెట్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇన్నేండ్లలో ఏ అంతర్జాతీయ జట్టు కూడా పాక్లో పర్యటించేందుకు ముందుకు రాలేదు. దీంతో తటస్థ వేదికల్లోనే పాక్ క్రికెట్ ప్రయాణం సాగించాల్సిన వచ్చింది. ప్రస్తుతం వరల్డ్ ఎలెవన్ జట్టుతో ఆడుతున్న పాక్ జట్టులో ఏకంగా తొమ్మిది మందికి సొంతగడ్డపై అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడిన అనుభవం లేదంటేనే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. సైనిక పహారాతో ప్రపంచ ఎలెవన్తో మూడు మ్యాచుల టీ20 సిరీస్కు ఆతిథ్యమిస్తున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. తొలి మ్యాచ్ విజయవంతం కావటంతో సంతోషంగా కనిపిస్తోంది. రానున్న మరో రెండు సంవత్సరాలలో సైతం వరల్డ్ ఎలెవన్తో సిరీస్ నిర్వహించనున్నామని పీసీబీ చైర్మెన్ నజమ్ సేథీ పేర్కొన్నారు. ' పీఎస్ఎల్ ఫైనల్స్ ఇక్కడ నిర్వహించి తొలి అడుగు వేశాం. ఇప్పుడు వరల్డ్ ఎలెవన్ జట్టు వచ్చింది. రానున్న మాసాల్లో శ్రీలంక, వెస్టిండీస్ బోర్డులు సైతం పాక్లో ఆడేందుకు అంగీకరించాయి. మరో రెండు ఏండ్లు వరల్డ్ ఎలెవన్ జట్టుతో పాక్లో సిరీస్ నిర్వహించాలని అనుకుంటున్నాం. తద్వారా పాక్ గడ్డపై సురక్షితమే అని చెప్పదలుచుకున్నాం. రానున్న కాలంలో ఒకట్రెండు పెద్ద జట్లు భారత పర్యటనకు వస్తాయని ఆశిస్తున్నాం' అని నజమ్ సేథీ అన్నారు.
అమ్మో అంత ధరలా? : సుమారు దశాబ్దకాలం తర్వాత పాక్ గడ్డపై అంతర్జాతీయ క్రికెట్ పునరుద్ధరణకు అడుగు పడింది. దీంతో పాక్ క్రికెట్ అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. పెద్ద యెత్తున్న గడాఫీ స్టేడియానికి పోటెతుత్తున్న అభిమానులు.. అంతర్జాతీయ క్రికెట్కు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. కానీ సహజంగా పాక్లో మ్యాచ్ టిక్కెట్ల ధరలు రూ. 500 నుంచి మొదలయ్యేవి. కానీ ప్రస్తుతం టికెట్ ప్రారంభ ధర రూ. 2500. దీంతో సగటు అభిమానులు ఇంత మొత్తంలో వెచ్చించలేక ఇబ్బంది పడుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్ మళ్లీ వచ్చిందనే ఆనందం , టికెట్ ధరలు ఆకాశానికి అంటితున్నాయే అనే బాధ అభిమానుల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది!.