Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్ట్రేలియాతో తొలి మూడు
- వన్డేల నుంచి తప్పుకున్న ఓపెనర్
- భార్య అనారోగ్యంతో అనివార్య నిర్ణయం
న్యూఢిల్లీ : ఆస్ట్రేలియాతో తొలి మూడు వన్డేలకు టీమ్ ఇండియా మెరుపు ఓపెనర్ శిఖర్ ధావన్ దూరమయ్యాడు. చాంపియన్స్ ట్రోఫీలో అనూహ్యంగా చోటు దక్కించుకున్న శిఖర్ ధావన్ అప్పట్నుంచి భీకర ఫామ్లో కొనసాగుతున్నాడు. చాంపియన్స్ ట్రోఫీలోనే కాకుండా కరీబియన్ పర్యటన, శ్రీలంక టూర్లోనూ గబ్బర్ గర్జించాడు. కానీ ధావన్ భార్య అనారోగ్యంతో ఇబ్బంది పడుతుండటంతో అతడు తొలి మూడు వన్డేల నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ గురువారం వెల్లడించింది. శ్రీలంక పర్యటనలో ఉండగా, తల్లి తీవ్ర అస్వస్థతతో ఉన్న కారణంగా అర్థాంతరంగా లంక టూర్ నుంచి న్యూఢిల్లీకి చేరుకున్న శిఖర్ ధావన్.. అప్పుడు ఆఖరి వన్డేతో పాటు ఏకైక టీ20లోనూ పాల్గొనలేదు. తాజాగా ఆసీస్తో తొలి మూడు వన్డేలకు సతీమణి అనారోగ్యం కారణంగా దూరమవటం గమనార్హం. ధావన్ తప్పుకున్నా.. అతడి స్థానంలో మరేవరిని సెలక్టర్లు ఎంపిక చేయలేదు. జట్టులో ఇప్పటికే అజింక్య రహానె, లోకేశ్ రాహుల్లు ఉండటంతో వీరిద్దరిలో ఒకరు రోహిత్ శర్మకు తోడుగా వెళ్లనున్నారు. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా తొలి వన్డే ఈ ఆదివారం చెన్నై చెపాక్ స్టేడియంలో జరుగనున్న విషయం తెలిసిందే.
అరోన్ ఫించ్ ఔట్!
ఆస్ట్రేలియా డ్యాషింగ్ ఓపెనర్ అరోన్ ఫించ్ తొలి వన్డేకు దూరం కానున్నాడు!. కాలి కండరాల నొప్పితో బాధపడుతున్న ఫించ్ గురువారం ప్రాక్టీస్కు సైతం హాజరు కాలేదు. తొలి వన్డే సమయానికి ఫించ్ మ్యాచ్ ఫిట్నెస్ సాధించే పరిస్థితి లేనట్లు తెలుస్తోంది. దీంతో చెన్నై సమరానికి ఫించ్ దూరమైనట్టే భావించాల్సి ఉంటుందని సమాచారం. ఏకైక వార్మప్ మ్యాచ్లో అదరగొట్టిన కంగారూలు చెపాక్ స్టేడియంలో గురువారం ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు.