Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చీఫ్ కోచ్ పదవి రాకపోవటంపై వీరూ
న్యూఢిల్లీ : టీమ్ ఇండియా డ్యాషింగ్ ఓపెనర్ వీరెందర్ సెహ్వాగ్ తొలిసారి చీఫ్ కోచ్ పదవి రాకపోవటంపై స్పందించాడు. అనిల్ కుంబ్లే అర్థాంతరంగా తప్పుకోవటంతో చీఫ్ కోచ్ రేసులో నిలిచాడు. కానీ కెప్టెన్ విరాట్ కోహ్లి మనోభిష్టం మేరకు రవిశాస్త్రి చీఫ్ కోచ్గా నియమితులయ్యాడు. ఓ టీవీ షోలో మాట్లాడుతూ, చీఫ్ కోచ్గా ఎంపిక కాకపోవటంపై వెనుకున్న రహస్యాన్ని వెల్లడించాడు. ' చీఫ్ కోచ్ను ఎంపిక చేసే అధికారమున్న వారితో నాకు ఎలాంటి పలుకుబడి లేదు. అందుకే నేను చీఫ్ కోచ్ పదవికి ఎంపిక కాలేదు' అని వీరూ వ్యాఖ్యానించాడు. భారత జట్టుకు కోచ్ కావాలని ఎన్నడూ అనుకోలేదు. కానీ బోర్డు కార్యదర్శి అమితాబ్ చౌదరి, జనరల్ మేనేజర్ ఎం.వి శ్రీధర్లు నన్ను కోచ్గా ఉండాలని కోరారు. అంతకుముందే రవిశాస్త్రితో మాట్లాడాను. ఇప్పటికే ఓసారి దరఖాస్తు చేసి తప్పుచేశాను, మళ్లీ అలాంటి తప్పు చేయనని అతడు నాతో అన్నాడు. దీంతో జట్టుకు నా అవసరం ఉందని బోర్డు వర్గాలు భావించటంతో కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నాను. నా అంతటగా నేను రేసులో ఉండేవాడిని కాదు. భవిష్యత్లో మరోసారి కోచ్ పదవికి దరఖాస్తు చేయబోను. కెప్టెన్ విరాట్ కోహ్లితోనూ నేను మాట్లాడాను. అతడు సైతం దరఖాస్తుకు సుముఖత వ్యక్తం చేశాడు. కానీ రవిశాస్త్రి దరఖాస్తు చేసినట్లయితే, అసలు నేను పోటీలోనే ఉండేవాడిని కాదు' అని సెహ్వాగ్ అన్నాడు. తొలుత గడువు లోగా శాస్త్రి దరఖాస్తు చేయలేదు, కానీ బోర్డు మరోసారి దరఖాస్తులు ఆహ్వానించగా అప్పుడు రవి రేసులోకి వచ్చిన సంగతి తెలిసిందే. బీసీసీఐ చీఫ్ కోచ్ పదవి వరించాలంటే అధికార వర్గాలతో లోగుట్టు వ్యవహారం ఉంటేనే సాధ్యమని వీరూ చెప్పకనే చెప్పేశాడు.