Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెరిసిన కరుణ్ నాయర్
- ప్రాక్టీస్లో కివీస్పై బోర్డు ఎలెవెన్ గెలుపు
నవతెలంగాణ-ముంబయి
సీనియర్ జట్టు నుంచి ఉద్వాసనకు గురైన కర్ణాటక యువ బ్యాట్స్మన్ లోకేశ్ రాహుల్ ఫామ్ నిరూపించుకున్నాడు. ఆఖరు నిమిషంలో కివీస్తో వార్మప్ మ్యాచ్కు ఎంపికైన లోకేశ్ రాహుల్ అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. మరో కర్ణాటక ఆటగాడు కరుణ్ నాయర్ (78, 64 బంతుల్లో 12 ఫోర్లు) సైతం అర్ధ సెంచరీతో రాణించగా రాహుల్ (68, 75 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) ఓపెనర్గా అదరగొట్టాడు. మరో ఓపెనర్ పృథ్వీ షా (66, 80 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) సైతం రాణించటంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియన్ బోర్డు ప్రెసిడెంట్ ఎలెవెన్ జట్టు 295 పరుగుల భారీ స్కోరు సాధించింది. బౌలర్లు జయదేవ్ ఉనద్కత్ (3/62), నదీమ్ (3/41) మెరవటంతో న్యూజిలాండ్ 265 పరుగులకే కుప్పకూలింది. దీంతో బోర్డు జట్టు 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండో వార్మప్ మ్యాచ్ బ్రబౌర్న్ స్టేడియంలోనే గురువారం జరుగనున్నది.
టాస్ నెగ్గిన కివీస్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నది. ఓపెనర్లు పృథ్వీ షా (66), రాహుల్ (68)లు అర్ధ సెంచరీలతో కదంతొక్కటంతో తొలి వికెట్కే 147 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదైంది. మూడోస్థానంలో వచ్చిన కరుణ్ నాయర్ (78) సైతం రాణించటంతో కివీస్ కష్టాలు మరింత పెరిగాయి. టాప్-3 బ్యాట్స్మెనే ఇన్నింగ్స్లో సింహభాగం పరుగులు బాదేశారు. కానీ యువ ఆటగాళ్లు రిషబ్ పంత్ (15), శ్రేయాష్ అయ్యర్ (17) అంచనాలను అందుకోలేదు. లోయర్ ఆర్డర్లోనూ ఎవ్వరూ చెప్పుకోదగిన పరుగులు చేయలేదు. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయిన బోర్డు జట్టు 295 పరుగులు చేసింది. ఇక ఛేదనలో కివీస్ సరైన ఆరంభం దక్కలేదు. గప్టిల్ (22), మున్రో (26)లు త్వరగానే నిష్క్రమించారు. కెప్టెన్ కానె విలియమ్సన్ (47, 49 బంతుల్లో 7 ఫోర్లు)కు తోడు లాథమ్ (59, 63 బంతుల్లో 7 ఫోర్లు) మిడిల్ ఆర్డర్లో పోరాటం చేశారు. కానీ భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు కూల్చి విలువైన భాగస్వామ్యాలు నమోదు కానీయలేదు. పేస్తో ఉనద్కత్, స్పిన్తో నదీమ్లు చెరో మూడు వికెట్లతో కివీస్ను కుప్పకూల్చారు.