Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండో రోజు ఆట 21 ఓవర్లే ొరహానె, అశ్విన్ నిష్క్రమణ
- పుజారా స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్
- భారత్ ప్రస్తుతం 74/5
- శ్రీలంకతో తొలి టెస్టు
ఈడెన్లో ఎటువంటి మార్పు లేదు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు రెండో రోజూ కొనసాగగా, టీమ్ ఇండియా వైఫల్యానికి అడ్డుకట్ట పడలేదు. తొలి రోజు 11.5 ఓవర్ల ఆట సాగగా, రెండో రోజు 21 ఓవర్ల ఆటే వీలు పడింది. ఎడతెరపి లేని వర్షంతో ఆటను నిలిపివేశారు.
శ్రీలంక సీమర్ల దూకుడు కొనసాగినా, భారత్ నుంచి పుజారా ఆపద్బాంధవుడి పాత్ర పోషిస్తున్నాడు. అర్ధ శతకానికి మూడు పరుగులు దూరంలో నిలిచిన చటేశ్వర్ అజేయంగా క్రీజులో ఉన్నాడు. రహానె, అశ్విన్లను కోల్పోయిన ఆతిథ్య జట్టు 74/5తో పీకల్లోతు కష్టాల్లో పడింది. నేడు పూర్తి ఆటకు వీలుండటంతో పుజారాతో టెయిలెండర్ల ప్రదర్శన భారత్కు కీలకం కానున్నది.
నవతెలంగాణ-కోల్కత
వరుసగా రెండో రోజు ఈడెన్లో ఆటకు తీవ్ర ఆటంకం. రెండో రోజు కనీసం రెండు సెషన్ల ఆటైనా వీలుపడుతుందని ఆశిస్తే, నిరాశే ఎదురైంది. ఉదయం సెషన్లోనే ఆడిన 21 ఓవర్లతోనే రెండో రోజు ఆటకు తెరపడింది. లంచ్ విరామానికి ముందే వచ్చేసిన వరుణుడు.. మధ్యాహ్నాం మరింత విజృంభించాడు. దీంతో తర్వాతి రెండు సెషన్లలో ఒక్క బంతీ పడకుండానే ఆటను నిలిపివేశారు. రెండో రోజును నిలిపివేస్తున్నట్టు అంపైర్లు మధ్యాహ్నాం 2.30 గంటలకు ప్రకటించారు. నేడు వర్షం ముప్పు బహు స్వల్పంగా ఉండటంతో.. కనీసం 80 ఓవర్ల ఆటైనా సాగుతుందని అంచనా.! ఇక టీమ్ ఇండియా టెస్టు స్పెషలిస్ట్ చటేశ్వర్ పుజారా (47 నాటౌట్, 102 బంతుల్లో 9 ఫోర్లు) అజేయ ఇన్నింగ్స్తో భారత్ను ఆదుకున్నాడు. దశున్ శనక మీడియం పేస్తో రెండు వికెట్లు కూల్చి, కోహ్లిసేనను మరింత ఇబ్బందుల్లోకి నెట్టాడు. రాణిస్తాడని ఆశలు పెట్టుకున్న అజింక్య రహానె (4) పెవిలియన్ చేరగా, అశ్విన్ (4) సైతం ఎంతోసేపు క్రీజులో నిలువలేదు. ప్రస్తుతం 74/5తో నిలిచిన భారత్ 32.5 ఓవర్లలోనే ఐదు వికెట్లు చేజార్చుకున్నది. పుజారా (47)కు తోడు వృద్దిమాన్ సాహా (6) అజేయంగా క్రీజులో ఉన్నాడు. నేటి ఆటలో పుజారాకు సాహా సహకారం అందిస్తే, భారత్ గౌరవప్రద స్కోరు చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది.
లంకదే పైచేయి! : శీతల పరిస్థితులు, పిచ్పై పచ్చికకు తోడు ఉదయం సెషన్లో గాలిని సైతం సద్వినియోగం చేసుకున్న శ్రీలంక సీమర్లు భారత్ను మరింత దెబ్బ కొట్టగలిగారు. ఓ ఎండ్లో స్పెషలిస్ట్ పేసర్లు లక్మల్, గమగె బంతులేయగా.. మరో ఎండ్ నుంచి పేస్ ఆల్రౌండర్ దశున్ శనక బౌలింగ్ చేశాడు. ఆకట్టుకునే మీడియం పేస్ బంతులతో శనక రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. రహానె, అశ్విన్లకు ఫుల్ లెంగ్త్ బంతులు సంధించిన శనక.. వారి పొరపాట్లను సొమ్ముచేసుకున్నాడు. కీలక రహానె సహా టెయిల్లో పరుగులు చేయగల అశ్విన్ను వెనక్కి పంపించాడు. అప్పటికీ భారత్ స్కోరు 50/5.
మరో ఎండ్లో కండ్లుచెదిరే డిఫెన్సివ్ షాట్లతో నిలిచిన పుజారా.. లంక సీమర్లను గౌరవించాడు. 102 బంతులాడినా, కేవలం గతి తప్పిన బంతుల్లోనే పరుగులు పిండుకున్నాడు. పిచ్ పరిస్థితులు, బౌలర్ లెంగ్త్ను గొప్పగా చదివేసిన పుజారా.. సౌకర్యవంతంగా కనిపించాడు. ఆఖర్లో కరుణరత్నె బౌలింగ్లో 12 పరుగులు చేసిన పుజారా.. అర్ధ సెంచరీకీ మరో మూడు పరుగుల దూరంలో నిలిచాడు. అశ్విన్ నిష్క్రమణతో క్రీజులోకి వచ్చిన వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా (6) వికెట్ కాపాడుకున్నాడు. తొలి రోజు హీరో సురంగ లక్మల్ రెండో రోజు వికెట్లేమీ తీయలేదు. కానీ ఐదు పరుగులు మాత్రం ఇచ్చుకున్నాడు. గమగె సైతం వరుసగా రెండో రోజు వికెట్ పడగొట్టలేదు. పిచ్ పేస్కు అనుకూలిస్తుండటంతో స్పిన్నర్ రంగన హెరాత్ బంతి అందుకోలేదు.
భారత్ తొలి ఇన్నింగ్స్ : లోకేశ్ రాహుల్ (సి) డిక్వెల్లా (బి) లక్మల్ 0, శిఖర్ ధావన్ (బి) లక్మల్ 8, చటేశ్వర్ పుజారా బ్యాటింగ్ 47, విరాట్ కోహ్లి (ఎల్బీ) లక్మల్ 0, అజింక్య రహానె (సి) డిక్వెల్లా (బి) శనక 4, రవిచంద్రన్ అశ్విన్ (సి) కరుణరత్నె (బి) శనక 6, వృద్దిమాన్ సాహా బ్యాటింగ్ 6, ఎక్స్ట్రాలు : 05, మొత్తం : (32.5 ఓవర్లలో 5 వికెట్లకు) 74.
వికెట్ల పతనం : 1-0, 2-13, 3-17, 4-30, 5-50.
బౌలింగ్ : సురంగ లక్మల్ 11-9-5-3, లహిరు గమగె 11.5-3-24-0, దశున్ శనక 8-2-23-2, కరుణరత్నె 2-0-17-0.