Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భువి, ఉమేశ్ మెరిసినా.. మాథ్యూస్, తిరిమానె అర్ధ సెంచరీలు
- తొలి ఇన్నింగ్స్లో శ్రీలంక 165/4
- భారత్ తొలి ఇన్నింగ్స్ 172 ఆలౌట్
- ఈడెన్ టెస్టు మూడో రోజు
ఈడెన్ టెస్టు మూడోరోజూ శ్రీలంక వైపే మొగ్గింది. మాథ్యూస్ (52), తిరిమానె (51) అర్ధ సెంచరీలతో లంకేయులు తొలి ఇన్నింగ్స్ ముందంజపై కన్నేశారు. స్వింగ్తో భువి, సీమ్తో ఉమేశ్ మెరిసినా.. నాల్గే వికెట్లు కోల్పోయిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్కు మరో ఏడు పరుగుల దూరంలోనే నిలిచింది. పుజారా (52) ఒంటరి పోరాటానికి తోడు సాహా (29), జడేజా (22), జడేజా (24) రాణించటంతో తొలి ఇన్నింగ్స్లో భారత్ 172 పరుగులు చేయగల్గింది.
నవతెలంగాణ-కోల్కత
ఈడెన్లో తొలి రెండు రోజుల అతి శీతల పరిస్థితులు, పిచ్పై పచ్చిక ఆతిథ్య జట్టును ఇరకాటంలో పెట్టి లంక సీమర్లకు దన్నుగా నిలువగా, మూడో రోజు సూర్యతాపంతో పిచ్ కాస్త బ్యాటింగ్ సహకరించగా.. ఇదీ లంకేయులకే ఉపయోగపడింది!. లహిరు తిరిమానె (51, 94 బంతుల్లో 8 ఫోర్లు), ఎంజెలో మాథ్యూస్ (52, 94 బంతుల్లో 8 ఫోర్లు) మూడో వికెట్కు 99 పరుగులు జోడించి.. శ్రీలంకను ఆధిక్యం దిశగా నడిపారు. భువనేశ్వర్ స్వింగ్కు సమరవిక్రమ (23), కరుణరత్నె (8) ఆరంభంలోనే వికెట్లు కోల్పోయారు. 34/2తో శ్రీలంక ఒత్తిడిలో పడింది. కానీ తిరిమానె, మాథ్యూస్ భారత్ను అడ్డుకున్నారు. ఆఖర్లో సీమ్తో మెరిసిన ఉమేశ్ యాదవ్ రెండు వికెట్లతో మూడో రోజు భారత్ను మ్యాచ్లో నిలిపాడు. కెప్టెన్ చండిమాల్ (13), వికెట్ కీపర్ డిక్వెల్లా (14) అజేయంగా క్రీజులో కొనసాగుతున్నారు. తొలి ఇన్నింగ్స్లో ఓవర్నైట్ స్కోరు 74/5తో మొదలెట్టిన భారత్ పుజారా (52, 117 బంతుల్లో 10 ఫోర్లు)ను ఆరంభంలోనే కోల్పోయింది. లోయర్ ఆర్డర్ సాయంతో 172 పరుగులు చేసింది. మూడో రోజు వరుణుడి ఆటంకం తప్పినా, ఆఖరి సెషన్లో సూర్యుడు దెబ్బకొట్టాడు. వెలుతురు లేమితో 4 గంటలకే ఆటను నిలిపివేశారు. నేడు ఉదయం 9.15 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. ఉదయం సెషన్ సీమర్లకు అనుకూలించనుండటంతో.. వీలైనన్ని వికెట్లు కూల్చాలని భారత్ ఎదురుచూస్తోంది!.
తిరిమానె, మాథ్యూస్ షో : శ్రీలంక ఇన్నింగ్స్ను నిలబెట్టిన తిరిమానె (51), మాథ్యూస్ (52) బ్యాటింగ్కు అనుకూలంగా మారిన పరిస్థితులను చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. బంతుల్ని, బాడీకి దగ్గరగా ఆడిన వీరిద్దరూ ఎంపిక చేసుకున్న బంతుల్నే బాదారు. వికెట్లకు ఇరువైపులా స్వింగ్ అయిన బంతుల్ని ఏమాత్రం పట్టించుకోలేదు. కేవలం ఫుల్ లెంగ్త్ బంతుల ద్వారానే డ్రైవ్లతో పరుగులు రాబట్టారు. చెరో ఎనిమిది ఫోర్లు బాదిన తిరిమానె, మాథ్యూస్లు మూడో వికెట్కు 99 పరుగులు జోడించారు. మూడో సెషన్లో వీరిద్దరని ఉమేశ్ యాదవ్ వెనక్కి పంపటంతో భారత్ ఊపిరి పీల్చుకున్నది. రెండో సెషన్లో తిరిమానె ఇచ్చిన సులభమైన క్యాచ్ను తొలి స్లిప్స్లో ధావన్ నేలపాలు చేశాడు. కానీ తక్కువ ఎత్తులో వచ్చిన మరో క్యాచ్ను కోహ్లి జారవిడచలేదు. మాథ్యూస్ సహనాన్ని పరీక్షించిన ఉమేశ్ కొద్దిసేపటికే అతడినీ పెవిలియన్ చేర్చాడు. తర్వాత వచ్చిన చండిమాల్ (13) ఆడిన 33 బంతుల్లో గండం గట్టెక్కాడు. డిక్వెల్లా (14) సైతం ఇబ్బంది పడ్డాడు. వెలుతురు సహకారం లభించి ఉంటే మూడో రోజు మరో రెండు వికెట్లు భారత్కు దక్కేవే!. తొలుత ఓపెనర్ సమరవిక్రమ (23) మూడు ఫోర్లతో ధాటిగా ఆడాడు. కానీ భువి అతడిని ఎంతో సేపు ఆడనీయలేదు.
తోక సాయంతో.. : హెరాత్ బంతిని బౌండరీ తరలించి అర్ధ సెంచరీ పూర్తి చేసిన పుజారా (52) తన స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్లో పొరపాటుకు తావిచ్చాడు. బాడీకీ, బ్యాట్కు గ్యాప్ ఇచ్చిన పుజారా.. డిఫెన్స్ ఛేదించే అవకాశం గమగెకు ఇచ్చాడు. సొంత మైదానంలో సాహా (29, 83 బంతుల్లో 6 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. జడేజా (22, 37 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), మహ్మద్ షమి (24, 22 బంతుల్లో 3 ఫోర్లు) ధనాధన్ అనిపించారు. సాహా, జడేజాలు ఏడో వికెట్కు 48 పరుగులు జోడించి.. ఇన్నింగ్స్ను వంద మార్క్ దాటించగా, ఆఖర్లో షమి చెలరేగి విలువైన పరుగులు రాబట్టాడు.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్ : రాహుల్ (సి) డిక్వెల్లా (బి) లక్మల్ 0, ధావన్ (బి) లక్మల్ 8, పుజారా (బి) గమగె 52, కోహ్లి (ఎల్బీ) లక్మల్ 0, రహానె (సి) డిక్వెల్లా (బి) శనక 4, అశ్విన్ (సి) కరుణరత్నె (బి) శనక 4, సాహా (సి) మాథ్యూస్ (బి) పెరీరా 29, జడేజా (ఎల్బీ) పెరీరా 22, భువనేశ్వర్ (సి) డిక్వెల్లా (బి) లక్మల్ 13, షమి (సి) శనక (బి) గమగె 24, ఉమేశ్ నాటౌట్ 6, ఎక్స్ట్రాలు : 10, మొత్తం : (59.3 ఓవర్లలో ఆలౌట్) 172.
బౌలింగ్ : లక్మల్ 19-12-26-4, గమగె 17.3- 5-59-2, శనక 12-4-36-2, కరుణరత్నె 2-0-17-0, హెరాత్ 2-0-5-0, పెరీరా 7-1-19-2.
శ్రీలంక తొలి ఇన్నింగ్స్ : సమరవిక్రమ (సి) సాహా (బి) భువనేశ్వర్ 23, కరుణరత్నె (ఎల్బీ) భువనేశ్వర్ 8, తిరిమానె (సి) కోహ్లి (బి) ఉమేశ్ 51, మాథ్యూస్ (సి) రాహుల్ (బి) ఉమేశ్ 52, చండిమాల్ బ్యాటింగ్ 13, డిక్వెల్లా బ్యాటింగ్ 14, ఎక్స్ట్రాలు : 04, మొత్తం :(45.4 ఓవర్లలో 4 వికెట్లకు) 165.
బౌలింగ్ : భువనేశ్వర్ 14.4-2-49-2, మహ్మద్ షమి 13.5-5-53-0, ఉమేశ్ యాదవ్ 13-1-50-2, అశ్విన్ 4-0-9-0, కోహ్లి 0.1-0-0-0.