Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈడెన్లో సత్తా చాటిన భారత పేసర్లు
- సఫారీ సన్నాహకంలో ముందడుగు
ఆశ్చర్యకరంగా స్వదేశీ టెస్టులో టీమ్ ఇండియా తొలిసారి పూర్తిగా పచ్చికతో కూడిన పిచ్ను కోరుకున్నది. ఉపఖండంలో స్పిన్నర్ల అండ లేకుండా టెస్టుల్లో ఆధిపత్యం చలాయించలేని భారత్, ఈడెన్లో మాత్రం సంప్రదాయానికి మంగళం పాడింది.
ఇద్దరు అగ్రశ్రేణి స్పిన్నర్లు అందుబాటులో ఉన్నా.. పేసర్లతో పని పూర్తి చేసింది!. ఈడెన్ పచ్చిక పిచ్పై తొలుత ఇబ్బంది పడినా, పేసర్ల ప్రతిభతో ఆనందపడింది. సఫారీ పర్యటనలో కోహ్లిసేన పరిస్థితి ఏమిటి? అనుకుంటున్న తరుణంలో ఈడెన్లో పేసర్ల ప్రదర్శన నూతనోత్సాహం నింపుతోంది.
శ్రీనివాస్ దాస్ మంతటి
శ్రీలంకతో టెస్టు సిరీస్.. కాబట్టి ఫలితం ఊహించదగినదే!. ఈడెన్ టెస్టు ఆరంభానికి అభిమానులు, విశ్లేషకులలో నెలకొన్న అభిప్రాయమిది. అది నిజమే, కానీ సిరీస్లో పచ్చిక పిచ్లతో వచ్చిన కోహ్లిసేన.. ఆసక్తితో పాటు ఉత్కంఠనూ కొనసాగిస్తోంది. ఈడెన్లో తొలి రోజే వికెట్ల మోత, శ్రీలంక సీమర్ల జోరుతో కోహ్లిసేన కుదేల్. దీంతో పచ్చికతో కూడిన భిన్న పరిస్థితుల్లో టీమ్ ఇండియా తేలిపోతుందనే నిట్టూర్పు. శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 122 పరుగుల విలువైన ఆధిక్యం సాధించటం దీనికి ఆజ్యం పోసింది. కానీ ఏమాత్రం అవకాశం లేని చోట, గెలుపు దారి కనుకొన్న కోహ్లిసేన.. ఈడెన్లో గొప్పగా పుంజుకున్నది. బ్యాట్తో కోహ్లి శతక విన్యాసం.. బంతితో భువనేశ్వర్, మహ్మద్ షమిల విశ్వరూపం ఈడెన్ను ఒక్కసారిగా ఆతిథ్య జట్టు వైపునకు తీసుకొచ్చింది. ఆఖర్లో భువనేశ్వర్, మహ్మద్ షమి బౌలింగ్ ప్రదర్శన స్వదేశంలో టీమ్ ఇండియాకు చరిత్రాత్మకం అనొచ్చు. ఈడెన్ కోహ్లిసేనకు సిరీస్లో ఆధిక్యం ఇవ్వకలేపోయినా.. రానున్న దక్షిణాఫ్రికా పర్యటనకు అవసరమైన ఆత్మవిశ్వాసం అందించగల్గింది. ఈ స్ఫూర్తి టెస్టు విజయానికి మించిన ప్రేరణ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
వైవిధ్యతతో కూడిన బృందం : రానున్న రెండేండ్లలో టీమ్ ఇండియా ఎక్కువగా విదేశాల్లో పర్యటించనున్నది. జనవరిలో దక్షిణాఫ్రికా వెళ్లనున్న కోహ్లిసేన.. వేసవి అనంతరం ఇంగ్లాండ్ బయల్దేరనున్నది. అక్కడ టెస్టులు నెగ్గాలన్నా, నెం.1 హోదా నిలుపుకోవాలన్నా 20 వికెట్లు కూల్చగల పేసర్లు అవసరం. టీమ్ ఇండియాకు గతంలో ఎన్నడూ లేని విధంగా వైవిధ్యతతో కూడిన పేస్ బృందం ఉంది. భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమి, ఉమేశ్ యాదవ్ సహా ఇషాంత్ శర్మలు ఒకరితో ఒకరు భిన్న శైలితో బంతులేసే సీమర్లు. ఈ విషయం ఈడెన్లోనే రుజువైంది. గతంలో సీమ్ పిచ్లపై మెరిసే భువి, ఇప్పుడు రాటుదేలాడు. అననుకూల పరిస్థితుల్లోనూ వికెట్ల వేట సాగిస్తున్నాడు. ఈడెన్ టెస్టులో పేసర్లు 17 వికెట్లు కూల్చటం అసాధారణం. శ్రీలంకను 75/7తో కుదేల్ చేసిన కోహ్లిసేన.. మరో 20.3 ఓవర్ల ఆటను వెలుతురు లేమితో కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్లో దారుణ భంగపాటుకు తోడు రెండో ఇన్నింగ్స్లో వరుస వికెట్లు కోహ్లిసేనను ఎక్కడా కుంగదీయలేదు. పచ్చికతో పిచ్లపై ఆట సాగుతున్న కొద్ది పరుగులు చేసేందుకు సహకరిస్తుంది. కానీ స్పిన్ ట్రాక్పై మ్యాచ్ సాగేకొద్దీ పరుగులు రావటం గగనమే. అలాంటిది, నాల్గో ఇన్నింగ్స్లో ఆఖరి రోజు రివర్స్ స్వింగ్, వ్యూహాత్మక బంతులతో రెచ్చిపోయిన పేసర్లు అద్భుత విజయం వాకిట నిలిచారు.
2015లో శ్రీలంక పర్యటన నుంచి మహ్మద్ షమి 14 టెస్టుల్లో 24.22 సగటుతో 45 వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్ కుమార్ ఆడిన ఏడు టెస్టుల్లోనే 17.75 సగటుతో 24 వికెట్లు కూల్చాడు. ఉమేశ్ యాదవ్ 22 టెస్టుల్లో 54 తీయగా, ఇషాంత్ 15 టెస్టుల్లో 31 వికెట్లు తీసుకున్నాడు. టీమ్ ఇండియాది పచ్చిక పిచ్పై ప్రత్యర్థిని ముచ్చెమటలు పట్టించే ఫాస్ట్ బౌలర్ల బృందం కాకపోవచ్చు. కానీ వైవిధ్యతతో బంతులేసి, ప్రత్యర్థికి ముకుతాడు వేయటంలో అత్యంత సమర్థులు. ఈ బౌలింగ్ బృందానికి కనీసం నాలుగేండ్ల అంతర్జాతీయ క్రికెట్ అనుభవం సైతం ఉన్నది. సుదీర్ఘ స్పెల్స్ పాటు తీవ్రత తగ్గకుండా బౌలింగ్ చేయగలరు. దీంతో గతంలో మాదిరి విదేశీ పర్యటనల్లో మన పరిస్థితి ఏమిటో అనే బెంగ అక్కర్లేదు .పచ్చిక పిచ్ పరిస్థితులను అక్కడే ఆకలింపు చేసుకుంటున్న కోహ్లిసేన.. విదేశీ పర్యటనల్లో ఆతిథ్య జట్టుకు ఇదివరకు ఉన్నట్టు పచ్చిక ప్రయోజనాన్ని లాగేసుకోనున్నది. దీంతో జనవరిలో జరిగే దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ టీమ్ ఇండియాకే కాదు సఫారీలకు సైతం కఠిన పరీక్షే కానున్నది.
విదేశాల్లో టీమ్ ఇండియా ఈడెన్ వంటి ప్రదర్శన చేస్తే పరిస్థితి ఎలాగుంటుందో ఊహించు? అని విరాట్ నాతో అన్నాడు. అక్కడైనా ఆరంభంలోనే రెండు, మూడు వికెట్లు కూల్చగల్గితే ప్రత్యర్థి కోలుకోవటం సులభం కాదు'
- భువనేశ్వర్ కుమార్
రానున్న రెండేండ్లలో విదేశాల్లో పర్యటించాల్సి ఉన్నది. కాబట్టి మా సన్నద్ధత సైతం ఆ కోణంలో ఉంటుంది. అక్కడ ఎదురయ్యే పిచ్లను పోలిన వికెట్లపైనే ఆడేందుకు మొగ్గుచూపుతాం. ఇది మా అందరికీ సవాల్'
- కెఎల్ రాహుల్