Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విశాఖ వన్డేలో భారత్ ఏకపక్ష విజయం
- శిఖర్ ధావన్ అజేయ శతక విన్యాసం శిఖర్ వందనం
- చాహల్, కుల్దీప్ మణికట్టు మాయాజాలం
- 2-1తో వన్డే సిరీస్ కైవసం
పరుగుల వేటలో ఒత్తిడి లేదు. షాట్ల ఎంపికలో బెరుకు లేదు. అసలు ఉత్కంఠకు తావే లేదు. శిఖర్ ధావన్ (100 నాటౌట్, 85 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్లు), శ్రేయాష్ అయ్యర్ (65, 63 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) వీరవిహారం చేయటంతో టీమ్ ఇండియా 216 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. స్పిన్కు అనుకూలించిన పిచ్పై ధావన్, అయ్యర్ మెరుపులతో విశాఖ వన్డే ఏకపక్షమైంది.
శ్రీలంక ఇన్నింగ్స్.. ఉపుల్ తరంగ మెరుపులతో ఆ జట్టు 160/2తో దూసుకెళ్తోంది. దీంతో భారత్ భారీ స్కోరు ఛేదించక తప్పకదేమో అనే భావన. కానీ మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్, చాహల్లు చెరో మూడు వికెట్లతో మ్యాచ్ను మలుపు తిప్పారు. లంకను 215 పరుగులకే కుప్పకూల్చి బ్యాట్స్మెన్ పని తేలిక చేశారు. విశాఖ విజయంతో వన్డే సిరీస్ 2-1తో టీమ్ ఇండియా వశమైంది. టీమ్ ఇండియాకు వన్డేల్లో ఇది వరుసగా ఎనిమిదో సిరీస్ విజయం.
విశాఖ నుంచి నవతెలంగాణ క్రీడాప్రతినిధి
తీరంలో మరోమారు టీమ్ ఇండియాదే విజయం. వరుసగా రెండో సిరీస్లో 0-1తో వెనుకంజలో నిలిచినా.. టీమ్ ఇండియా సిరీస్ విజయానికి ఎటువంటి అడ్డు లేకుండా పోయింది. శిఖర్ ధావన్ (100 నాటౌట్, 85 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్లు) అజేయ శతకానికి తోడు యువ ఆటగాడు శ్రేయాష్ అయ్యర్ (65, 63 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగటంతో విశాఖ వన్డేలో టీమ్ ఇండియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ధావన్, అయ్యర్ విజృంభించగా 32.1 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని ఛేదించింది. అంతకముందు మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ (3/42), యుజ్వెంద్ర చాహల్ (3/46) మాయాజాలంతో శ్రీలంక 215 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టు ఓపెనర్ ఉపుల్ తరంగ (95, 82 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్లు), సమరివిక్రమ (42, 57 బంతుల్లో 5 ఫోర్లు) రాణించారు. శిఖర్ ధావన్ 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్', కుల్దీప్ యాదవ్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డులను దక్కించుకున్నారు.
శివమెత్తిన శిఖర్, అదరగొట్టిన అయ్యర్ : స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ ఆరంభంలోనే కెప్టెన్ రోహిత్ (7) వికెట్ కోల్పోయింది. స్పిన్కు సహకరిస్తున్న పిచ్పై లంక తొలి నుంచే స్పిన్నర్ ధనంజయను బరిలోకి దింపింది. అతడి బౌలింగ్లో రోహిత్ భారీ సిక్సర్ బాదినా.. అతడికే వికెట్ కోల్పోయాడు. అప్పటికీ భారత్ స్కోరు 14/1. ఈ సమయంలో ధావన్తో జట్టుకట్టిన శ్రేయాష్ అయ్యర్ (65) దుమ్మురేపాడు. రెండు వైపులా ధావన్, అయ్యర్ వీరంగంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. అర డజను ఫోర్లు, ఓ సిక్సర్తో అయ్యర్ 44 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేయగా, ధావన్ ఫిఫ్టీ మార్క్ను 46 బంతుల్లో అందుకున్నాడు. అర్ధ సెంచరీ తర్వాత అయ్యర్ నిష్క్రమించినా.. ధావన్ జోరు తగ్గలేదు. ఎంతో తేలికగా భారీ షాట్లు కొట్టిన ధావన్ విశాఖలో శతకబాదాడు. దినేశ్ కార్తీక్ (26 నాటౌట్, 31 బంతుల్లో 3 ఫోర్లు) ఆఖర్లో ఆకట్టుకున్నాడు. 84 బంతుల్లో సెంచరీ సాధించిన ధావన్.. భారత్కు అలవోక విజయాన్ని అందించాడు. పిచ్ స్పిన్కు సహకరించినా.. ధావన్ స్పిన్నర్లను వదిలిపెట్టలేదు. ధావన్ దూకుడు ముందు శ్రీలంక బౌలర్లు తేలిపోయారు. ధనంజయ బంతిని బౌండరీకి తరలించిన కార్తీక్ లాంఛనాన్ని పూర్తి చేశాడు.
మణికట్టు మాయ : టాస్ నెగ్గిన టీమ్ ఇండియా ఛేదనకే మొగ్గుచూపింది. సిరీస్లో తొలిసారి తొలుత బ్యాటింగ్ చేసిన లంకకు ఆశించిన ఆరంభం దక్కలేదు. ఓపెనర్ గుణతిలక (13)ను బుమ్రా నాల్గో ఓవర్లో వెనక్కి పంపాడు. కానీ సూపర్ ఫామ్లో ఉన్న మరో ఓపెనర్ ఉపుల్ తరంగ (95, 82 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్లు) రెండో వికెట్కు భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. మూడో స్థానంలో వచ్చిన సమరవిక్రమ (45) నుంచి తరంగకు మంచి సహకారం లభించింది. పది ఫోర్లతో 36 బంతుల్లోనే అర్ధ సెంచరీ బాదిన తరంగ.. లంకను భారీ స్కోరు దిశగా తీసుకెళ్లాడు. తరంగ మెరుపులతో లంక ఇన్నింగ్స్ దర్జాగా సాగుతున్నది. కానీ మణికట్టు మాయగాడు యుజ్వెంద్ర చాహల్ తొలుత సమరవిక్రమను సాగనంపాడు. మరో మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తను వేసిన ఓ ఓవర్లో ఏకంగా రెండు వికెట్లు కూల్చాడు. తరంగ, డిక్వెల్లా (8)ను వరుసగా అవుట్ చేశాడు కుల్దీప్. తరంగ నిష్క్రమణకు ముందు 160/2తో పటిష్టంగా కనిపించిన శ్రీలంక.. తర్వాత చిన్నబోయింది. స్పిన్నర్లు చాహల్, కుల్దీప్లు లంక మిడిల్ ఆర్డర్ను కకావికలం చేశారు. మాథ్యూస్ (17), పెరీరా (6), పతిరణ (7), అఖిల ధనంజయ (1), లక్మల్ (1)లను మనోళ్లు ఎంతోసేపు క్రీజులో నిలువనీయలేదు. 30 ఓవర్ల పాటు శ్రీలంక మెరుగ్గా ఆడినా.. తర్వాత మన స్పిన్నర్లు మ్యాచ్ను చేతుల్లోకి తీసుకున్నారు. శ్రీలంకను 215 పరుగులకే ఆలౌట్ చేశారు.
శ్రీలంక ఇన్నింగ్స్ : గుణతిలక (సి) రోహిత్ (బి) బుమ్రా 13, ఉపుల్ తరంగ (స్టంప్డ్) ధోని (బి) కుల్దీప్ 95, సమరవిక్రమ (సి) ధావన్ (బి) చాహల్ 42, మాథ్యూస్ (బి) చాహల్ 17, డిక్వెల్లా (సి) అయ్యర్ (బి) కుల్దీప్ 8, గుణరత్నె (సి) ధోని (బి) భువనేశ్వర్ 17, పెరీరా (ఎల్బీ) చాహల్ 6, పతిరణ (సి) చాహల్ (బి) పాండ్య 7, ధనంజయ (బి) కుల్దీప్ 1, లక్మల్ (ఎల్బీ) పాండ్య 1, ఫెర్నాండో నాటౌట్ 0, ఎక్స్ట్రాలు : 08, మొత్తం : (44.5 ఓవర్లలో ఆలౌట్) 215.
బౌలింగ్ : భువనేశ్వర్ 6.5-0-35-1, బుమ్రా 8-1-39-1, హార్దిక్ పాండ్య 10-1-49-1, కుల్దీప్ యాదవ్ 10-0-42-3, యుజ్వెంద్ర చాహల్ 10-3-46-3.
భారత్ ఇన్నింగ్స్ : రోహిత్ శర్మ (బి) అఖిల ధనంజయ 7, శిఖర్ ధావన్ నాటౌట్ 100, శ్రేయాష్ అయ్యర్ (సి) లక్మల్ (బి) పెరీరా 65, దినేశ్ కార్తీక్ నాటౌట్ 26, ఎక్స్ట్రాలు : 21, మొత్తం : (32.1 ఓవర్లలో 2 వికెట్లకు) 219.
బౌలింగ్ : లక్మల్ 5-2-20-0, ధనంజయ 7.1-0-53-1, మాథ్యూస్ 3-0-30-0, పతిరణ 4-0-33-0, ఫెర్నాండో 3-0-10-0, పెరీరా 5-0-25-1, గుణరత్నె 4-0-30-0, గుణతిలక 1-0-12-0.