Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బెంగళూర్పై ఏకపక్ష విజయం
- సెమీఫైనల్లోకి ప్రవేశం
- ముగిసిన లీగ్ దశ పోరు
- నేటి నుంచి సెమీఫైనల్స్
- ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్-3
సెమీస్లో ఎవరు ఎవరితో..
హైదరాబాద్× ఢిల్లీ (శుక్రవారం)
బెంగళూరు × అహ్మదాబాద్ (శనివారం)
నవతెలంగాణ క్రీడాప్రతినిధి-గచ్చిబౌలి
ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్(పీబీఎల్)లో హైదరాబాద్ టాప్ లేపింది. పీబీఎల్ ఆఖరి లీగ్ మ్యాచ్లో బెంగళూర్ బ్లాస్టర్స్పై ఏకపక్ష విజయం సాధించిన హంటర్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం సాధించింది. కరొలినా మారిన్, చాంగ్ వీ ఫెంగ్, సాయి ప్రణీత్ వరుస విజయాలు హైదరాబాద్ను విజేతగా నిలిపాయి. ఈ మ్యాచ్కు ముందు 14 పాయింట్లతో నాల్గో స్థానంలో నిలిచిన హైదరాబాద్ ఇప్పుడు అగ్రస్థానానికి చేరుకున్నది. హైదరాబాద్ హంటర్స్తో పాటు అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్, బెంగళూర్ బ్లాస్టర్స్, ఢిల్లీ డాషర్స్లు సెమీఫైనల్స్కు చేరుకున్నాయి. నేటి నుంచి పీబీఎల్ తుది అంకం షురూ కానున్నది. నేడు, రేపు సెమీఫైనల్స్ జరుగనుండగా, ఆదివారం ఫైనల్ పోరు ఉంటుంది.
హంటర్స్ అదిరెన్ : బెంగళూర్పై హైదరాబాద్ ఐదు మ్యాచుల్లో గెలుపుఢంకా మోగించింది. తొలుత మిక్స్డ్ డబుల్స్లో మను అత్రి, సిక్కి రెడ్డి (బెంగళూర్) జోడీని సాత్విక్ సాయిరాజ్, బెర్నాడెట్ జోడీ మూడు సెట్ల పోరులో ఓడించింది. 15-6, 14-15, 15-9తో హంటర్స్ విజయం సాధించింది. మెన్స్ సింగిల్స్ తొలి మ్యాచ్లో సాయి ప్రణీత్ విజయాన్ని అందించాడు. చాంగ్ వీ ఫెంగ్పై 10-15, 15-7, 15-14తో సాయిప్రణీత్ పైచేయి సాధించాడు. మహిళల సింగిల్స్లో కరొలినా మారిన్ అదరగొట్టింది. 15-9, 15-7తో క్రిస్టీ గిల్మర్ను చిత్తుగా ఓడించింది. సూపర్ స్మాష్లు, నెట్ డ్రాప్స్తో మారిన్ చెలరేగింది. మెన్స్ సింగిల్స్ రెండో మ్యాచ్లో లీ హ్యూన్ 15-11, 11-15, 15-11తో సుభాంకర్ దే (బెంగళూర్)పై విజయం సాధించాడు. టాప్ షట్లర్ హ్యూన్తో నువ్వా నేనా అన్నట్టు తలపడిన సుభాంకర్ సూపర్ ఆటతో ఆకట్టుకున్నాడు. మెన్స్ డబుల్స్లో మార్కిస్ కిడో, సియోంగ్లు 15-10, 11-15, 15-7తో మాథియస్, కిమ్ సా రంగ్లపై గెలుపొందారు. హైదరాబాద్ రెండో మెన్స్ సింగిల్స్ మ్యాచ్ను ట్రంప్గా ఎంచుకుని నెగ్గగా, మెన్స్ డబుల్స్ను ట్రంప్గా ఎంచుకున్న బెంగళూర్ పరాజయం పాలైంది. దీంతో హైదరాబాద్ ఐదు మ్యాచుల్లోనూ గెలిచి ఆరు పాయింట్లు సాధించింది. ట్రంప్ మ్యాచ్లోనూ ఒడిన బెంగళూర్ రుణాత్మక పాయింట్తో ముగించింది.