Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెరిసిన మారిన్, సాయిప్రణీత్
- సెమీస్లో ఢిల్లీపై 3-0తో మెరుపు విజయం
- ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్-3
నవతెలంగాణ క్రీడాప్రతినిధి-గచ్చిబౌలి
హైదరాబాద్ హంటర్స్ అదరగొట్టింది. పీబీఎల్ టైటిల్కు అడుగు దూరంలో నిలిచింది. స్టార్ షట్లర్లు కరొలినా మారిన్, బి. సాయిప్రణీత్లు దుమ్మురేపటంతో హైదరాబాద్ హంటర్స్ తొలిసారి పీబీఎల్లో టైటిల్ పోరుకు చేరుకున్నది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం ఢిల్లీ డాషర్స్తో జరిగిన సెమీఫైనల్స్ పోరులో హైదరాబాద్ ఏకపక్ష విజయం సాధించింది. తన ట్రంప్ మ్యాచ్లో విజయం సహా ఢిల్లీ ట్రంప్ మ్యాచ్లో వారిని ఓడించిన హైదరాబాద్ మరో రెండు మ్యాచులుండగానే ఫైనల్లోకి ప్రవేశించింది. అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్, బెంగళూర్ బ్లాస్టర్స్ మధ్య రెండో సెమీఫైనల్స్ నేడు జరుగనున్నది. ఈ మ్యాచ్లో విజేత ఆదివారం నాడు టైటిల్ పోరులో హైదరాబాద్ హంటర్స్తో అమీతుమీ తేల్చుకోనున్నది.
సెమీఫైనల్లో ఢిల్లీ డాషర్స్ మెరుపు విజయంతో శుభారంభం చేసింది. కానీ తర్వాత వరుసగా ట్రంప్ మ్యాచుల్లో గెలుపొందిన హైదరాబాద్ కథను మార్చేసింది. ఢిల్లీ ఆశలకు తెరవేసింది. తొలుత మిక్స్డ్ డబుల్స్లో హైదరాబాద్ పరాజయం పాలైంది. బెర్నాడెట్, సాత్విక్సాయిరాజ్ రాంకీ రెడ్డి జోడీ 15-13, 10-15, 10-15తో అశ్విని పొన్నప్ప, ఇవనోవ్ వ్లాదిమర్ (ఢిల్లీ) చేతిలో పోరాడి ఓడారు. మూడు గేముల మ్యాచ్లో తొలుత హంటర్స్ ముందంజ వేసినా.. చివరి రెండు సెట్లలో మెరిసిన ఢిల్లీ మ్యాచ్ను సొంతం చేసుకున్నది. మెన్స్ సింగిల్స్లో సాయిప్రణీత్ గెలుపు హంటర్స్ విజయానికి బాటలు వేసింది. ఈ మ్యాచ్ను ఢిల్లీ డాషర్స్ ట్రంప్గా ఎంచుకున్నది. కానీ తియాన్ హౌవారుపై సాయిప్రణీత్ వరుస గేముల్లో గెలుపొందాడు. 15-9, 15-8తో సాయిప్రణీత్ దుమ్మురేపాడు. దీంతో ఢిల్లీ తొలి విజయంతో సాధించిన ఒక్క పాయింట్నూ కోల్పోగా, హైదరాబాద్ 1-0తో ముందంజ వేసింది. అగ్రశ్రేణి షట్లర్ కరొలినా మారిన్ బరిలోకి దిగిన మహిళల సింగిల్స్తో హైదరాబాద్ ఫైనల్స్ ప్రవేశం ఖాయమైంది. సంగ్ జీ హ్యూన్పై మారిన్ 12-15, 15-10, 15-9తో విజయం సాధించింది. తొలి గేమ్లో సంగ్ జీ హ్యూన్ ముందంజ వేసినా... తర్వాతి గేముల్లో మారిన్ సత్తా చాటింది. ఈ మ్యాచ్ హైదరాబాద్కు ట్రంప్ కావటంతో హంటర్స్కు రెండు పాయింట్లు లభించాయి. దీంతో హైదరాబాద్ 3-0తో విజయం సాధించింది. మరో రెండు మ్యాచుల్లో ఢిల్లీ నెగ్గినా 2-3తో ఓటమి ఖాయం కనుక ఆ మ్యాచుల అవసరం లేకుండానే హంటర్స్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.