Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దక్షిణాఫ్రికాకు 0-2తో ఫ్రీడం సిరీస్ కోల్పోయిన భారత్
- రెండో టెస్టులో 135 పరుగుల తేడాతో పరాజయం
- భారత బ్యాట్స్మెన్ ఘోర వైఫల్యం
- నిప్పులు చెరిగిన సౌతాఫ్రికా బౌలర్ ఎంగిడి
ఛేదించగలిగే లక్ష్యమే అయినా చేతులెత్తేశారు. బౌలర్లు రాణించినా బ్యాట్స్మెన్ నిలకడ సాధించలేదు. కనీసం డ్రా అయ్యే అవకాశమున్న తరుణంలో వికెట్లు కాపాడుకోలేకపోయారు. రోహిత్ శర్మ (47) పోరాటానికి మరో ఎండ్లో సహకారం కరువైంది. సౌతాఫ్రికా అరంగేట్ర బౌలర్ ఎంగిడి చెలరేగటంతో రెండో టెస్టులోనూ విజయం అంచులదాకా వచ్చిన భారత,్ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. సెంచూరియన్ టెస్టులో 135 పరుగుల తేడాతో ఓడిన టీమ్ ఇండియా.. మూడు మ్యాచుల ఫ్రీడం సీరీస్ను 0-2తో కోల్పోయింది. ఈ ఒటమితో కోహ్లి సేన తొమ్మిది సిరీస్ విజయాల జైత్రయాత్రకు బ్రేక్ పడింది.
నవతెలంగాణ-సెంచూరియన్
అనకున్నదే జరిగింది. ఫ్రీడం సిరీస్ భారత్ చేజారింది. సొంతగడ్డపై వరుస సిరీస్ విజయాలతో అదరగొట్టిన కోహ్లి సేన.. సఫారీ గడ్డపై మూడు మ్యాచుల టెస్టు సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే కోల్పోయింది. బౌలర్లు రాణించినా, బ్యాట్స్మెన్ వైఫల్యంతో సెంచూరియన్ టెస్టులో 135 పరుగుల తేడాతో ఘోరపరాజయం చవిచూసింది. తొలి ఇన్నింగ్స్లో ఆదుకున్న సారథి కోహ్లి రెండో ఇన్నింగ్స్లో నిరాశపరిచాడు. ఆఖరు రోజున రోహిత్ శర్మ (47) పోరాడినా ఫలితం లేకపోయింది. దక్షిణాఫ్రికా ఆరంగేట్ర యువ పేసర్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లుంగిసాని ఎంగిడి (6/30) నిప్పులు చెరిగాడు. అతనికి తోడు రబాడ (3/47) చెలరేగటంతో 287 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 151 పరుగులకే కుప్పకూలింది. భారత్, దక్షిణాఫ్రికాల మధ్య ఆఖరుదైన మూడో టెస్టు ఈ నెల 24 నుంచి జోహన్నస్బర్గ్లోని న్యూ వాండరర్స్ మైదానంలో జరుగనున్నది.
రోహిత్ పోరాటం: చేయాల్సిన పరుగులు 252. చేతిలోనేడు వికెట్లున్నాయి. ఆఖరు రోజు ఆట ఆరంభించిన కొద్దిసేపటికే భారత్ రెండు కీలక వికెట్లు కోల్పోయింది. టెస్టు స్పెషలిస్టుగా పేరొందిన చటేశ్వర్ పుజారా (19) రనౌట్ అయ్యాడు. 27వ ఓవర్.. ఫిలాండర్ వేసిన తొలి బంతికి పార్థివ్ పటేల్ బౌండరీ దిశగా తరలించాడు. రెండు పరుగులు రాబట్టారు. పుజారా అనవసరంగా మూడో పరుగు కోసం ప్రయత్నించాడు. ఎంగిడి దగ్గర నుంచి బంతిని అందుకున్న డివిలియర్స్ వేగంగా డికాక్కు బంతిని పాస్ చేశాడు. మెరుపు వేగంతో కదులుతూ వికెట్లను గిరాటేశాడు డికాక్. పుజారా రనౌట్ కాకపోయుంటే పరిస్థితి మరోలా ఉండేదేమో!. మూడు ఓవర్ల వ్యవధిలో వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ (19) సైతం క్రీజును వీడాడు. రబాడ బంతిని ఎదుర్కొన్న పార్థివ్ దాన్ని గాల్లోకి లేపాడు. బౌండరీ వద్ద కాచుకున్న మోర్నీ మోర్కెల్ బంతిని ఒడిసి పట్టాడు. 65 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన భారత్ ఒత్తిడిలో కూరుకుపోయింది. ఈ దశలో రోహిత్ శర్మ (47, 74 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్్) భారత శిబిరంలో ఆశలు చిగురించాయి. రోహిత్కు తోడుగా యువ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య ఉండటంతో భారత్ కనీసం మ్యాచ్ డ్రా చేసుకునేలా కనిపించింది. అయితే తొలి ఇన్నింగ్స్ మాదిరిగానే హార్దిక్ (6) చెత్తగా ఔటయ్యాడు. ఆచితూచి ఆడాల్సిన సమయంలో ఎంగిడి సంధించిన చెత్త బంతిని ఆడబోయి కీపర్ డికాక్కు క్యాచ్ ఇచ్చాడు. అదే జోరులో ఎంగిడి రవిచంద్రన్ అశ్విన్ (3)ను పెవిలియన్ బాట పట్టించాడు. ఈ దశలో షమి (28, 24 బంతుల్లో 5 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. అయితే రబాడా బౌలింగ్లో రోహిత్ డివిలియర్స్ చేతిలో క్యాచౌట్ కాగా.. అతన్ని వెంబడిస్తూ, ఓవర్ వ్యవధిలో షమి మోర్నీ మోర్కెల్కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. ఎంగిడి బౌలింగ్లో జశ్ప్రీత్ బుమ్రా రెండు పరుగులు చేసి అవుటయ్యాడు. ఇషాంత్ శర్మ (4) నాటౌట్గా నిలిచాడు.
ఎంగిడి దూకుడు: స్టెయిన్కు గాయం అవటంతో జట్టులో చోటు దక్కించుకున్న కుర్రాడు లుంగిసాని ఎంగిడి. సెంచూరియన్ అతని సొంత మైదానం. తొలి ఇన్నింగ్స్లో పార్థివ్ పటేల్ వికెట్ పడగొట్టిన ఎంగిడి రెండో ఇన్నింగ్స్లో రచ్చరచ్చ చేశాడు. లైన్ అండ్ లెంగ్త్తో బంతులేస్తూ భారత బ్యాట్స్మెన్ను ముప్పుతిప్పలు పెట్టాడు. వైవిధ్యమైన బంతులతో భారత మేటి బ్యాట్స్మెన్ను సునాయసంగా పెవీలియన్ బాట పట్టించాడు. రెండో ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్య, అశ్విన్, షమి, బుమ్రాలను బలిగొన్నాడు. వరుసగా చివరి నాల్గు వికెట్లను పడగొట్టడం విశేషం. అరంగేట్రంలోనే ఐదు వికెట్లకు పైగా తీసిన ఆరో దక్షిణాఫ్రికా పేసర్గా నిలిచాడు. ఆరంగేట్ర మ్యాచ్లోనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోవటం ఎంగిడి సాధించిన మరో ఘనత.
పుజారా చెత్త రికార్డు : ఒకే టెస్టులో రెండు సార్లు రనౌటయిన తొలి భారత ఆటగాడిగా పుజారా అరుదైన చెత్త రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్లో రెండుసార్లు రనౌట్ అయిన 25వ ఆటగాడిగా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్లో పరుగులేమీ చేయకుండా రనౌట్ అయిన పుజారా. రెండో ఇన్నింగ్స్లో అనవసరంగా అదనపు పరుగు కోసం ప్రయత్నించి వికెట్ పోగొట్టుకున్నాడు. పుజారా క్రీజు మధ్యలో అత్యంత నెమ్మదిగా కదిలాడని అంపైర్ కామెంట్ చేయగా సోషల్ మీడియాలో ఇప్పుడది వైరల్గా మారింది.
సఫారీలకు జరిమానా
భారత్తో జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా జట్టుకు స్లో ఓవర్రేట్ కారణంగా జరిమానా విధించారు. కెప్టెన్కు డుప్లెసిస్కు మ్యాచ్ ఫీజులో 40 శాతం. మిగిలిన ఆటగాళ్లకు 20 శాతం కోత విధించారు.
స్కోర్ వివరాలు
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ : 335/10
భారత్ తొలి ఇన్నింగ్స్ : 307/10
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ : ఏడెన్ మార్క్రం ఎల్బి (బి) బుమ్రా 1, డీన్ ఎల్గార్ (సి) రాహుల్ (బి) షమి 61, హషీం ఆమ్లా ఎల్బి (బి) బుమ్రా 1, ఏబీ డివిలియర్స్్ (సి) పార్థివ్ పటేల్ (బి) షమి 80, డుప్లెసిస్ (సి,బి) బుమ్రా 48, క్వింటన్ డికాక్ (సి) పార్థివ్ పటేల్ (బి) షమి 12, వెర్నన్ ఫిలాండర్ (సి) విజరు (బి) ఇషాంత్ 26, కేశవ్ మహరాజ్ (సి) పార్థివ్ పటేల్ (బి) ఇషాంత్ 6, కగిసో రబాడా (సి) కోహ్లి (బి) షమి 4, మోర్నీ మోర్కెల్ నాటౌట్ 10, లుంగిని ఎంగిడి (సి) విజరు (బి) అశ్విన్ 1, ఎక్స్ట్రాలు 8, మొత్తం : (91.3 ఓవర్లలో 10 వికెట్లకు) 258.
బౌలింగ్ : రవిచంద్రన్ అశ్విన్ 29.3-6-78-1, జశ్ప్రీత్ బుమ్రా 20-3-70-3, ఇషాంత్ శర్మ 17-3-40-2, మహమ్మద్ షమి 16-3-49-4, హార్దిక్ పాండ్య 9-1-14-0.
భారత్ రెండో ఇన్నింగ్స్ : మురళీ విజరు (బి) రబాడా 9, లోకేష్ రాహుల్ (సి) మహరాజ్ (బి) ఎంగిడి 4, చటేశ్వర్ పుజారా రనౌట్ (డివిలియర్స్/డికాక్) 19, విరాట్ కోహ్లి ఎల్బి (బి) ఎంగిడి 5, పార్థివ్ పటేల్ (సి) మోర్నీ మోర్కెల్ (బి) రబాడా 19, రోహిత్ శర్మ (సి) డివిలియర్స్ (బి) రబాడా 47, హార్దిక్ పాండ్య (సి) డికాక్ (బి) ఎంగిడి 6, రవిచంద్రన్ అశ్విన్ (సి) డికాక్ (బి) ఎంగిడి 3, మహమ్మద్ షమి (సి) మోర్నీ మోర్కెల్ (బి) ఎంగిడి 28, ఇషాంత్ శర్మ నాటౌట్ 4, జశ్ప్రీత్ బుమ్రా (సి) ఫిలాండర్ (బి) ఎంగిడి 2, ఎక్స్ట్రాలు 5, మొత్తం : (50.2 ఓవర్లలో 10 వికెట్లకు) 151.
బౌలింగ్ : వెర్నన్ ఫిలాండర్ 10-3-25-0, కగిసో రబాడా 14-3-47-3, లుంగిసాని ఎంగిడి 12.2-3-39-6, మోర్నీ మోర్కెల్ 8-3-10-0, కేశవ్ మహరాజ్ 6-1-26-0.
మేం మంచి భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయాం. బౌలర్లు వారి బాధ్యతను సమర్థవంతంగా నెరవేర్చారు. బ్యాటింగ్ వైఫల్యమే ఓటమికి కారణం.'
-కోహ్లి, టీమ్ ఇండియా కెప్టెన్
గత ఐదు రోజులుగా చాలా కష్టపడ్డాం. మ్యాచ్లో అధికభాగం ఆధిపత్యం చలాయించగలిగాం. ఎంగిడి ప్రదర్శన అద్భుతం. అతను జట్టులో ఉన్నందుకు గర్వంగా ఉంది'
- డుప్లెసిస్, దక్షిణాఫ్రికా కెప్టెన్