Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ సహా వన్డే, టెస్టు జట్ల సారథ్యం
- ఐసీసీ అవార్డుల్లో భారత కెప్టెన్ జోరు
- టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా స్మిత్
విరాట్ కోహ్లి మరో అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో 900 రేటింగ్ పాయింట్లు సాధించిన రెండో భారత క్రికెటర్గా నిలిచాడు. 1979లో తన 50వ టెస్టులో 221 పరుగులు చేసిన సునీల్ గవాస్కర్ 916 రేటింగ్ పాయింట్లకు చేరుకున్నాడు. తాజాగా సెంచూరియన్లో 153 పరుగుల విలువైన ఇన్నింగ్స్ నమోదు చేసిన విరాట్ కోహ్లి 900 రేటింగ్ పాయింట్లతో ర్యాంకింగ్స్లో రెండో స్థానంలో ఉన్నాడు. ఆసీస్ సారథి స్మిత్ 947 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. జో రూట్ (881), కేన్ విలియమ్సన్ (855), డెవిడ్ వార్నర్ (827), పుజార (814)లు వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు. బౌలర్ల జాబితాలో అండర్సన్, రబాడలు తొలి రెండు స్థానాల్లో నిలువగా జడేజా మూడో స్థానంలో, అశ్విన్ ఐదో స్థానంలో ఉన్నారు.
నవతెలంగాణ-దుబాయ్
కేప్టౌన్, సెంచూరియన్ ఓటములతో అన్ని వైపుల నుంచీ విమర్శలు ఎదుర్కొంటున్న విరాట్ కోహ్లికి ఈ సమయంలో అమితానందాన్ని, ఊరటనిచ్చే కబురు ఐసీసీ నుంచి వెలువడింది. ఐసీసీ వార్షిక అవార్డుల్లో అగ్ర తాంబూలం దక్కించుకున్నాడు భారత కెప్టెన్. సెప్టెంబర్ 21, 2016 నుంచి 2017 ఏడాది ఆఖరు వరకూ గల ప్రదర్శనలను పరిగణనలోకి తీసుకుని ఐసీసీ తాజా అవార్డులను ప్రకటించింది. ఈ సమయంలో బ్యాట్స్మన్గా టన్నుల కొద్ది పరుగులు, నాయకుడిగా అప్రతిహాత విజయాలు సాధించిన విరాట్ కోహ్లి అవార్డుల్లోనూ అదే జోరు చూపించాడు. ప్రతిష్టాత్మక ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్కు ఇచ్చే సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీని కోహ్లి దక్కించుకున్నాడు. ఉత్తమ వన్డే క్రికెటర్ అవార్డునూ సొంతం చేసుకున్న కోహ్లి.. ఐసీసీ వన్డే, టెస్టు జట్ల సారథ్య బాధ్యతలు సైతం కైవసం చేసుకున్నాడు. ఆధునిక క్రికెట్లో పరుగుల పోటీలో కోహ్లితో ఢకొీడుతున్న ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెల్చుకున్నాడు. ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును నిరుడు అశ్విన్ సాధించగా, ఈ ఏడాది కోహ్లి సొంతమైంది. ప్రతిష్టాత్మక ఐసీసీ ఉత్తమ క్రికెటర్ పురస్కారం వరుసగా భారత క్రికెటర్లకు దక్కటం విశేషం. భారత యువ స్పిన్నర్ యుజ్వెంద్ర చాహల్ ఉత్తమ టీ20 ప్రదర్శన అవార్డును దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్తో టీ20లో 25 పరుగులకే ఆరు వికెట్లు కూల్చిన చాహల్ ఐసీసీ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఇక ఐసీసీ వన్డే జట్టులో కోహ్లితో పాటు రోహిత్ శర్మ, బుమ్రాలకు చోటు దక్కగా.. టెస్టు జట్టులో కోహ్లితో పాటు చటేశ్వర్ పుజారా, రవిచంద్రన్ అశ్విన్లు చోటుచేసుకున్నారు.
విరాట్పర్వం: అవార్డుల ప్రకటనకు పరిగణన లోకి తీసుకున్న కాలంలో కోహ్లి ఫామ్ రాకెట్ వేగాన్ని తలపించింది. 77.80 సగటుతో 2203 టెస్టు పరుగులు చేసిన కోహ్లి ఎనిమిది శతకాలూ బాదాడు. వన్డేల్లో 82.63 సగటుతో 1818 పరుగులు బాదాడు, ఇందులో ఏడు సెంచరీలు నమోదయ్యాయి. వన్డేల్లో 32 సెంచరీలు సాధించిన విరాట్ అత్యధిక శతకాల జాబితాలో ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ను దాటేశాడు. వన్డేల్లో వేగంగా 9000 పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచిన కోహ్లి.. కెప్టెన్గా ఓ ఏడాదిలో అత్యధిక సక్సెస్ సాధించిన నాయకుడిగానూ పాంటింగ్ను అధిగమించాడు. సారథిగా వరుసగా ఎనిమిది టెస్టు సిరీస్ విజయాలు, తొమ్మిది ద్వైపాక్షిక వన్డే సిరీస్ విజయాలు విరాట్ సొంతం. దీంతో ఐసీసీ వన్డే, టెస్టు జట్ల సారథ్య పగ్గాలూ కోహ్లిని వరించాయి.
సూపర్ స్మిత్ : ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్కు సైతం ఐసీసీ అవార్డుల్లో సముచిత గౌరవం దక్కింది. గత నాలుగేండ్లుగా ఏడాదికి వెయ్యికి తగ్గకుండా పరుగులు పిండుకున్న స్మిత్.. ఈ ఏడాది యాషెస్ సిరీస్లో సూపర్ ఫామ్ కొనసాగించాడు. ఐసీసీ టెస్టు బ్యాట్స్మన్గా ఆల్టైమ్ దిగ్గజం బ్రాడ్మన్ తరువాతి స్థానంలో కొనసాగుతున్న స్మిత్ సగటులో అతడికి సరితూగు తున్నాడు! ఈ ఏడాది 16 టెస్టుల్లో 78.12 సగటుతో 1875 పరుగులు చేసిన స్మిత్, ఎనిమిది సెంచరీలు, ఐదు అర్ధ శతకాలు నమోదు చేశాడు. కండ్లుచెదిరే ప్రదర్శనకు గానూ స్మిత్ ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకున్నాడు. ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ తర్వాత అత్యంత ప్రాధాన్యం కల్గిన అవార్డు ఇదే.
ఐసీసీ 2017 వార్షిక అవార్డులు
* ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్
(సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ) - విరాట్ కోహ్లి
* ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్
- స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)
* వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ - విరాట్ కోహ్లి
* వర్థమాన క్రికెటర్ ఆఫ్ ది ఇయర్
- హసన్ అలీ (పాకిస్థాన్)
* అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్
- రషీద్ ఖాన్ (అఫ్ఘనిస్థాన్)
* ఈ ఏడాది టీ20 ఉత్తమ ప్రదర్శన
- యుజ్వెంద్ర చాహల్ (ఇంగ్లాండ్పై 6/25)
* అంపైర్ ఆఫ్ ది ఇయర్ - మరియస్ ఎరాస్మస్
* ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్
- అన్యా శ్రుబశోలె (ఇంగ్లాండ్)
ఐసీసీ టెస్టు జట్టు ఆఫ్ ది ఇయర్ డీన్ ఎల్గార్ (దక్షిణాఫ్రికా), డెవిడ్ వార్నర్ (ఆసీస్), విరాట్ కోహ్లి (కెప్టెన్), స్మీవ్ స్మిత్ (ఆసీస్), చటేశ్వర్ పుజారా, బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్), క్వింటన్ డికాక్ (దక్షిణాఫ్రికా), రవిచంద్రన్ అశ్విన్, మిచెల్ స్టార్క్ (ఆసీస్), కగిసో రబాడ (దక్షిణాఫ్రికా), జేమ్స్ అండర్సన్ (ఇంగ్లాండ్).ఐసీసీ వన్డే జట్టు ఆఫ్ ది ఇయర్ డెవిడ్ వార్నర్ (ఆసీస్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి (కెప్టెన్), బాబర్ ఆజాం (పాకిస్థాన్), ఏబీ డివిలియర్స్ (దక్షిణాఫ్రికా), క్వింటన్ డికాక్ (దక్షిణాఫ్రికా), బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్), ట్రెంట్ బౌల్ట్ (కివీస్), హసన్ అలీ (పాకిస్థాన్), రషీద్ ఖాన్ (అఫ్ఘనిస్థాన్), జశ్ప్రీత్ బుమ్రా.
ప్రపంచ క్రికెట్లో నాకు తెలిసి
ఇదే అతిపెద్ద పురస్కారం. ఇద్దరు భారతీయులు వరుసగా దీన్ని సాధించటం మరింత ప్రత్యేకం.
నిరుడు అశ్విన్ సాధించాడు, ఇప్పుడు నా వంతు. క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా నిలువటం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. నా కఠోర శ్రమను గుర్తించినందుకు ఐసీసీకి ధన్యవాదాలు. మిగతా విజేతలకు నా అభినందనలు'
- విరాట్ కోహ్లి