Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధావన్ అర్ధ సెంచరీ, భువి ఐదు వికెట్ల జోరు
- తొలి టీ20లో 28 పరుగులతో ఘన విజయం
- పొట్టి సిరీస్లో 1-0తో ఆధిక్యం సొంతం
నవతెలంగాణ-జొహనెస్బర్గ్
ఫార్మాట్ మారింది, కానీ మనోళ్ల ప్రదర్శన ఏమాత్రం తగ్గలేదు.
మరింత దర్జాగా, మరింత దూకుడుగా చెలరేగారు.
శిఖర్ ధావన్ (72) అర్ధ సెంచరీతో చెలరేగిన వేళ
టీమ్ ఇండియా 203 పరుగుల భారీ స్కోరు చేసింది. బంతితో భువనేశ్వర్ (5/24) మెరుపు ప్రదర్శనతో విజృంభించటంతో సఫారీలు 175 పరుగులకే పరిమితమయ్యారు. తొలి టీ20లో ఏకపక్ష విజయం సాధించిన కోహ్లిసేన సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించింది.
సఫారీ గడ్డపై మరో సిరీస్ విజయం దిశగా కోహ్లిసేన తొలి అడుగు వేసింది. దక్షిణాఫ్రికాతో తొలి టీ20లో ఏకపక్ష విజయం సాధించిన టీమ్ ఇండియా పొట్టి సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (72, 39 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్లు) మెరుపు అర్ధ సెంచరీతో చెలరేగటంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఐదు వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. కెప్టెన్ కోహ్లి (26), రోహిత్ శర్మ (21) క్రీజులో ఉన్నంతసేపు ఆకట్టుకున్నారు. భారీ ఛేదనలో స్వింగ్స్టర్ భువనేశ్వర్ (5/24) దెబ్బకు సఫారీలు విలవిల్లాడారు. ఐదు వికెట్ల ప్రదర్శనతో రెచ్చిపోయిన భువి.. ప్రత్యర్థిని 175 పరుగులకే పరిమితం చేశాడు. సఫారీ ఓపెనర్ హెండ్రిక్స్ (70, 50 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) మెరిసినా ప్రయోజనం దక్కలేదు. సిరీస్లో రెండో టీ20 బుధవారం జరుగుతుంది.
ఆహా భువి : భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఆరంభంలోనే ఓపెనర్ను కోల్పోయింది. మూడు బౌండరీలతో జోరందుకున్న జొన్ జొన్ స్మట్స్ (14)ను భువనేశ్వర్ వెనక్కి సాగనంపాడు. తర్వాత వచ్చిన కెప్టెన్ డుమిని (3)ని చూడచక్కని క్యాచ్తో రైనా అవుట్ చేశాడు. ప్రమాదకర డెవిడ్ మిల్లర్ (9)నూ మనోళ్లు ఎంతోసేపు క్రీజులో నిలువనీయలేదు. కానీ యువ సంచలనం రీజా హెండ్రిక్స్ (70, 50 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడి సఫారీని రేసులో నిలిపాడు. ఐదు ఫోర్లు, ఓ సిక్సర్తో 37 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించిన హెండ్రిక్స్.. బెహార్డిన్ (39, 27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లు) తోడుగా రెచ్చిపోయాడు. వీరిద్దరి మెరుపులతో దక్షిణాఫ్రికా మిడిల్ ఓవర్లలో మ్యాచ్పై పట్టు సాధించింది. పాండ్య, చాహల్ ఓవర్లలో ధారాళంగా పరుగులు రాబట్టుకున్నారు. బెహార్డిన్ బెడద తప్పినా.. హెండ్రిక్స్ జోరు తగ్గలేదు. ఇతడికి క్లాసెన్ (16) కాసేపు సహకారం అందించాడు. ఆఖర్లో సాధించాల్సిన రన్రేట్ భారీగా పెరిగినా.. భువనేశ్వర్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో దక్షిణాఫ్రికా ఏకంగా నాల్గు వికెట్లు కోల్పోయింది. హెండ్రిక్స్, క్లాసెన్, మోరీస్ (0) సహా పాటర్సన్ (1)లు వికెట్లు కోల్పోయారు. దీంతో మరో రెండు ఓవర్లు ఉండగానే సఫారీ కథ లాంఛనంగా ముగిసింది.
శిఖర్ చెడుగుడు : టాస్ నెగ్గిన దక్షిణాఫ్రికా తొలుత భారత్కు బ్యాటింగ్ అప్పగించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (21, 9 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లు), శిఖర్ ధావన్ (72, 39 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్లు) శుభారంభాన్ని అందించారు. తొలి ఓవర్లో రెచ్చిపోయిన రోహిత్ శర్మ ఓ సిక్సర్, రెండు ఫోర్లు బాదాడు. తర్వాత వచ్చిన డాలానూ స్టాండ్స్లోకి పంపించి ధనాధన్ అనిపించాడు. కానీ అతడి ఓవర్లోనే వికెట్ కోల్పోయి వెనుదిరిగాడు. అయినా భారత్ జోరు ఏమాత్రం తగ్గలేదు. కమ్బ్యాక్ హీరో సురేశ్ రైనా (15, 7 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) వస్తూనే సిక్సర్తో అలరించాడు. మరో రెండు ఫోర్లు కొట్టి ఊపుమీద కనిపించినా.. బంతిని గాల్లోకి లేపి వికెట్ కోల్పోయాడు. కెప్టెన్ కోహ్లి (26, 20 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), ధావన్లు మూడో వికెట్కు అర్ధ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశారు. స్పిన్నర్ షంషి బౌలింగ్లో బౌండరీ లైన్ వద్ద బెహార్డిన్ క్యాచ్ వదిలేయటంతో బతికిపోయిన కోహ్లి.. అదే ఓవర్లో అద్భుత సిక్సర్ సంధించాడు. నెమ్మదిగా దూకుడు పెంచిన ధావన్ ధాటిగా పరుగులు తీశాడు. ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 27 బంతుల్లో శిఖర్ ఫిఫ్టీ మార్క్ చేరుకున్నాడు. కుదురుకున్నట్టే కనిపించిన కోహ్లి ఎల్బీగా వెనుదిరిగాడు. పవర్ ప్లే ముగిసేసరికి 78/2తో ఉన్న భారత్, 8.2 ఓవర్లలోనే వంద పరుగులు దాటేసింది. అర్ధ సెంచరీ తర్వాత ధావన్ మరింత దూకుడుగా ఆడినా.. వికెట్ల వెనకాల అలవోక క్యాచ్తో వెనుదిరిగాడు. దీంతో భారత్ స్కోరు వేగం నెమ్మదించింది. మనీశ్ పాండే (27 బంతుల్లో 29 రన్స్), ఎం.ఎస్ ధోని (11 బంతుల్లో 16 పరుగులు) ఆశించిన మేరకు మెరువలేదు. ఆఖర్లో సఫారీ బౌలర్లు సైతం కట్టుదిట్టంగా బంతులేశారు. దీంతో పరుగులు అంత సులువుగా రాలేదు. ఆఖర్లో పాండ్య (13) రెండు ఫోర్లతో ధనాధన్ ముగింపునిచ్చినా.. మరో 20 పరుగులు తక్కువ చేశామనే భావన భారత్లో కనిపించింది. పాండే, పాండ్య అజేయంగా నిలువగా భారత్ 203 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో డాలా రెండు వికెట్లు తీసుకోగా.. మోరీస్, ఫెలుక్వాయో, షంషిలు తలా ఓ వికెట్ కూల్చారు.
భారత్ ఇన్నింగ్స్ : రోహిత్ శర్మ (సి) క్లాసెన్ (బి) డాలా 21, శిఖర్ ధావన్ (సి) క్లాసెన్ (బి) ఫెలుక్వాయో 72, సురేశ్ రైనా (సి,బి) డాలా 15, విరాట్ కోహ్లి (ఎల్బీ) షంషి 26, మనీశ్ పాండే నాటౌట్ 29, ఎం.ఎస్ ధోని (బి) మోరీస్ 16, హార్దిక్ పాండ్య నాటౌట్ 13, ఎక్స్ట్రాలు : 11, మొత్తం : (20 ఓవర్లలో 5 వికెట్లకు) 203.
వికెట్ల పతనం : 1-23, 2-49, 3-108, 4-155, 5-183.
బౌలింగ్ : పాటర్సన్ 4-0-48-0, జూనియర్ డాలా 4-0-47-2, క్రిస్ మోరీస్ 4-0-39-1, షంషి 4-0-37-1, ఫెలుక్వాయో 2-0-16-1.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ : జొన్ జొన్ స్మట్స్ (సి) ధావన్ (బి) భువనేశ్వర్ 14, హెండ్రిక్స్ (సి) ధోని (బి) భువనేశ్వర్ 70, డుమిని (సి) రైనా (బి) భువనేశ్వర్ 3, డెవిడ్ మిల్లర్ (సి) ధావన్ (బి) పాండ్య 9, బెహార్డిన్ (సి) పాండే (బి) చాహల్ 39, క్లాసెన్ (సి) రైనా (బి) భువనేశ్వర్ 16, ఫెలుక్వాయో (సి) చాహల్ (బి) ఉనద్కత్ 13, క్రిస్ మోరీస్ (సి) రైనా (బి) భువనేశ్వర్ 0, పాటర్సన్ రనౌట్ (ధోని/పాండ్య) 1, డాలా నాటౌట్ 2, షంషి నాటౌట్ 0, ఎక్స్ట్రాలు : 08, మొత్తం : (20 ఓవర్లలో 9 వికెట్లకు) 175.
వికెట్ల పతనం : 1-29, 2-38, 3-48, 4-129, 5-154, 6-158, 7-158, 8-159, 9-175.
బౌలింగ్ : భువనేశ్వర్ కుమార్ 4-0-24-5, జైదేవ్ ఉనద్కత్ 4-0-33-1, బుమ్రా 4-0-32-0, హార్దిక్ పాండ్య 4-0-45-1, చాహల్ 4-0-39-1.