Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుబాయ్ : వరుస విజయాలు, అద్భుత సెంచరీలు, కండ్లుచెదిరే బౌలింగ్ వెరసి.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో భారత్ సహా భారత ఆటగాళ్లు అగ్రపథాన నిలిచారు. దక్షిణాఫ్రికాపై 5-1తో వన్డే సిరీస్ సాధించిన రికార్డు సృష్టించిన టీమ్ ఇండియా ర్యాంకింగ్స్లో నెం.1 స్థానానికి చేరుకున్నది. సిరీస్ను నెం.1 ర్యాంక్తో ఆరంభించిన దక్షిణాఫ్రికా మధ్యలోనే కోహ్లిసేన అగ్రపీఠం అప్పగించిన సంగతి తెలిసిందే. ఇక మూడు శతకాలు సహా 558 పరుగులతో ఓ ద్వైపాక్షిక వన్డే సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సాధించిన విరాట్ కోహ్లి బ్యాట్స్మన్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంతో పాటు మరో అరుదైన ఘనత దక్కించుకున్నాడు. 909 రేటింగ్ పాయింట్లు పొందిన కోహ్లి.. ఏకకాలంలో టెస్టులు, వన్డేల్లో 900 పైచిలుకు రేటింగ్ సాధించిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. 909 రేటింగ్ పాయింట్లతో మరే భారత బ్యాట్స్మన్ సాధించని ఘనత వహించాడు. యార్కర్ల హీరో జశ్ప్రీత్ బుమ్రా బౌలర్ల జాబితాలో అగ్రస్థానానికి ఎగబాకాడు. అఫ్ఘాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్తో కలిసి సంయుక్తంగా నం.1 ర్యాంక్ పంచుకున్నాడు. ఐసీసీ మెన్స్ వన్డే ర్యాంకింగ్స్ చరిత్రలోనే పిన్న వయసులోనే అగ్రస్థానంలో నిలిచిన బౌలర్గా రషీద్ ఖాన్ (19 ఏండ్ల 153 రోజులు) నిలిచాడు. వన్డే సిరీస్లో మెరిసిన భారత స్పిన్నర్లు చాహల్, కుల్దీప్లు వరుసగా 8, 15వ స్థానాల్లో నిలిచారు. సఫారీతో వన్డే సిరీస్లో మెరిసిన శిఖర్ ధావన్ నాల్గు స్థానాలు ఎగబాకి టాప్-10లోకి అడుగుపెట్టాడు.