Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డ్రెస్సింగ్ రూమ్ అద్దాలు బద్దలు
- షకిబ్, నురుల్ మ్యాచ్ ఫీజులో కోత
కొలంబో : ఇటీవల మైదానంలో బంగ్లాదేశ్ ఆటగాళ్ల ప్రవర్తనలో విచిత్రమైన మార్పు వచ్చింది. పొరుగు దేశాలతో ఆడుతున్నప్పుడు ఆ దేశ ఆటగాళ్లు విపరీత భావోద్వేగాలకు లోనవుతున్నారు. భారత్తో మ్యాచ్ల్లోనూ ఇది స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా శ్రీలంకతో టీ20 మ్యాచ్లో అది శృతిమించింది. కెప్టెన్ షకిబ్ అల్ హసన్ అంపైర్ నిర్ణయం పట్ల అసంతృప్తితో ఆటగాళ్లను బయటకు వచ్చేయమని ఆదేశించగా, అదనపు ఆటగాడు నురుల్ హొసెస్ లంక సారథితో గొడవ పెట్టుకున్నాడు. దీనికి తోడు ఉత్కంఠ విజయానంతరం బంగ్లాదేశ్ డ్రెస్సింగ్రూమ్ అద్దాలు పగులగొట్టారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది బంగ్లాదేశ్ ఆటగాడొకరు అద్దాలు బద్దలు కొట్టాడని మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేశారు. దీనిపై సీసీటీవీ ఫుటేజీ ఆధారాలు చూసిన తర్వాత చర్యలు తీసుకోనున్నారు. ఇక మైదానంలో వికృత ప్రవర్తనకు బంగ్లా ఆటగాళ్లకు మ్యాచ్ రిఫరీ మ్యాచ్ ఫీజులో కోత విధించారు. అంపైర్ నిర్ణయం పట్ల అసంతృప్తికి షకిబ్కు 25 శాతం, లంక సారథితో గొడవకు నురుల్కు 25 శాతం మ్యాచ్ ఫీజు కోత విధించారు. ఈ ఘటనలపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. ' ఏ స్థాయి క్రికెట్లోనైనా ఇటువంటి ఘటనలు అంగీకారం కాదు. దురదృష్టశావత్తు జరిగిన ఘటనలకు పశ్చాతాపం వ్యక్తం చేస్తున్నాం. క్రీడా స్ఫూర్తి ప్రదర్శించటంలో బంగ్లా క్రికెటర్ల బాధ్యతలో ఎటువంటి మార్పు లేదు. శుక్రవారం నాటి సంఘటనలు బాధాకారం. ఉత్కంఠ మ్యాచ్లో ఒత్తిడితో ఆటగాళ్లు అలా ప్రవర్తించారని అర్థం చేసుకున్నాం. మళ్లీ పునరావృతం కాబోవు' అని బంగ్లా బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.