Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీసీఐ ఆగ్రహానికి గురైన ఐసీసీ
న్యూఢిల్లీ : ఏదో అనుకుంటే, మరేదో అయినట్టుంది ఐసీసీ పరిస్థితి. ఫుట్బాల్ వంటి స్పోర్ట్స్ వేగంగా విస్తరిస్తూ ఆదరణ పొందుతున్న తరుణంలో ప్రపంచ క్రికెట్ను భయాందోళనలకు గురిచేస్తోన్న 18 అంశాలను భారత క్రికెట్ బోర్డుతో చర్చించాలని ఐసీసీ తలపించింది. అదే ఉద్దేశంతో గురువారం న్యూఢిల్లీలో బీసీసీఐ ఉన్నతాధికారులతో ఐసీసీ వర్కింగ్ గ్రూప్ భేటీ అయ్యింది. ' నిజంగా గ్లోబల్ స్పోర్ట్ కాదు, భారత్ నుంచి వచ్చే ఆదాయం, భారత అభిమానులపై విపరీతంగా ఆధారపడటం' అని ఐసీసీ వ్యూహ బృందం రూపొందించిన బలహీనతల్లో ఒకటి. దీంతో సమస్య మొదలైంది. బీసీసీఐతో భేటీలో కాస్త పరిష్కారమైనా దొరుకుతుం దని భావించిన ఐసీసీకి.. అనుకోని రీతిలో కొత్త సమస్య ఎదురైంది. భారత్ అభిమానులు, ఆదాయాన్ని ఐసీసీ బలహీనతలుగా చూపించటంపై బీసీసీఐ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐసీసీ భారత మార్కెట్ను బలహీనతగా చూడటం పట్ల సీరియస్ అయిన ఉన్నతాధికారులు హుటాహుటిన 18 మంది ఆఫీస్ బేరర్లతో టెలీ కాన్ఫరెన్స్ సైతం నిర్వహించింది.
ఈ అంశంపై తక్షణమే చర్చించేందుకు సాధారణ సమావేశాన్ని సైతం ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. నష్ట నివారణ చర్యలకు దిగిన ఐసీసీ సీఈవో రిచర్డ్సన్.. భారత మార్కెట్, అభిమానులు ఐసీసీ బలమేనని, దాన్ని మరో కోణంలో చూపించటంతోనే ఈ పరిస్థితి నెలకొన్నదని వివరణ ఇచ్చారు. ఐసీసీ ఆదాయ పంపిణీలో రానున్న ఐదేండ్లలో బీసీసీఐ వాటా తగ్గనుండటంపై బోర్డు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసింది. సింహభాగం వాటా భారత్కు దక్కాల్సిందేనని ఐసీసీ ముందు కుండబద్దలు కొట్టినట్టు తెలుస్తోంది.