Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చేజారిన ప్లే ఆఫ్స్ బెర్త్
నవతెలంగాణ-న్యూఢిల్లీ
ఒక్క మ్యాచ్, ఒక్క విజయం. గెలిస్తే నేరుగా ప్లే ఆఫ్స్ అవకాశం. ఎదురున్న లక్ష్యం 175 పరుగులు. మంచి హిట్టర్లున్న ముంబయి మరోమారు ఆఖర్లో అద్భుతం చేసేలా కనిపించింది. ఉత్కంఠ ఛేదనలో బెన్ కట్టింగ్ (37, 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లు) వీరోచితం ముంబయి ఆశలు చిగురించేలా చేసినా, ఆఖరుకు విలాపం తప్పలేదు. ఆఖరి ఓవర్లో 18 పరుగులు చేయాల్సి ఉండగా.. తొలి బంతినే సిక్సర్గా మలిచిన కట్టింగ్ సమీకరణాన్ని 5 బంతుల్లో 12 పరుగులకు తీసుకొచ్చాడు. ఈ సమయంలో ముంబయి మెరుగ్గా ఉన్నా.. యువ పేసర్ హర్షల్ పటేల్ ఆకట్టుకునే బంతులేశాడు. దీంతో ముంబయి మరో మూడు బంతులుండగానే ఆలౌట్ అయ్యింది. ఓపెనర్ ఎవిన్ లెవిస్ (48), హార్దిక్ పాండ్య (27)లు రాణించారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ డెర్డెవిల్స్ 174 పరుగులు చేసింది. రిషబ్ పంత్ (64, 44 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లు), విజరు శంకర్ (43 నాటౌట్, 30 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. ఢిల్లీ స్పిన్నర్ అమిత్ మిశ్రా (3/19) ' మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.
ఆఖర్లో బోల్తా : ఛేదనలో ముంబయి మెరుగ్గానే కనిపించింది. కానీ ఢిల్లీ స్పిన్నర్లు ముంబయిని దెబ్బకొట్టారు. ఓపెనర్ సూర్యకుమార్ యాదవ్ (12) స్వల్ప స్కోరుకే నిష్క్రమించినా, మరో ఓపెనర్ ఎవిన్ లెవిస్ (48, 31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లు) పరుగులు రాబట్టాడు. ఇషాన్ కిషన్ (5), కీరన్ పొలార్డ్ (7), రోహిత్ శర్మ (13), కృనాల్ పాండ్య (4)లు స్వల్ప విరామంలో వికెట్ పారేసుకోగా.. 121/6తో ముంబయి కష్టాల్లో పడింది. హార్దిక్ పాండ్య (27) నిష్క్రమణతో ముంబయి ఆశలు అడుగంటాయి. కానీ ఫ్లంకెట్ వేసిన 18వ ఓవర్లో ఓ సిక్స్, రెండు ఫోర్లు బాదిన కట్టింగ్.. సమీకరణాన్ని 12 బంతుల్లో 24కు తీసుకొచ్చాడు. కానీ బౌల్ట్, హర్షల్ గొప్పగా రాణించి, ముంబయి ఆశలను ఆవిరి చేశారు. మూడు వికెట్లు కూల్చిన అమిత్ మిశ్రా ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
పంత్ మరో ఫిఫ్టీ : తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ యువ ఆటగాడు రిషబ్ పంత్ (64, 44 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధ శతకంతో భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు పృథ్వీ షా (12), గ్లెన్ మాక్స్వెల్ (22)లు తొలి వికెట్కు 30 పరుగులు జోడించారు. మూడో స్థానంలో వచ్చిన కెప్టెన్ శ్రేయాష్ అయ్యర్ (6) మార్కండే మాయలో పడిపోయాడు. కానీ రిషబ్ పంత్, విజరు శంకర్ జోడీ ముంబయిపై దండెత్తింది. దూకుడుగా ఆడిన ఈ జోడీ బౌండరీలపై విరుచుకుపడింది. పంత్ సీజన్లో మరో అర్ధ సెంచరీతో ఫామ్ కొనసాగించాడు. అభిషేక్ శర్మ (15) ఫర్వాలేదనిపించాడు.