Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంజాబ్పై ధోనీసేన విజయం
- ప్లే ఆఫ్స్లో రాజస్థాన్
నవతెలంగాణ-పుణె
ముంబయి, పంజాబ్లు ఆఖరి మ్యాచుల్లో పరాజ యం పాలవటంతో రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్లోకి ప్రవేశించింది. ఏడు విజయాలతో 14 పాయింట్లు సాధించిన రాజస్థాన్ ఎటువంటి సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా ప్లే ఆఫ్స్కు చేరుకు న్నది. పంజాబ్ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని చెన్నై సూపర్ కింగ్స్ 19.1 ఓవర్లలోనే ఛేదించి 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. సురేశ్ రైనా (61 నాటౌట్, 48 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లు), దీపక్ చాహర్ (39, 20 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్లు) రాణించారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ కరుణ్ నాయర్ (54) అర్ధ సెంచరీతో 154 పరుగులు చేసింది. చెన్నై పేసర్ లుంగి ఎంగిడి (4/10) రాణించాడు. హైదరాబాద్, చెన్నై, కోల్కత, రాజస్థాన్లు పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచాయి. ముంబయి, బెంగళూర్, పంజాబ్, ఢిల్లీలు టాప్-4కు చేరుకోలేకపోయాయి.
ఎంగిడి నిప్పులు : తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. లీగ్ దశ ఆఖరి మ్యాచ్లో స్టార్ బ్యాట్స్మన్ కెఎల్ రాహుల్ (7) వైఫల్యం పంజాబ్పై ప్రతికూల ప్రభా వం చూపించింది. ప్రమాదకర ఆటగాడు క్రిస్ గేల్ (0), అరోన్ ఫించ్ (4), కెఎల్ రాహుల్లు వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోయారు. గేల్, రాహుల్ను ఎం గిడి అవుట్ చేయగా ఫించ్ను చాహర్ బలిగొన్నాడు. దీంతో 16/3తో పంజాబ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లు మనోజ్ తివారి (35, 30 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), కరుణ్ నాయర్ (54, 26 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్లు) పంజాబ్ ఇన్నింగ్స్ను గాడిలో పెట్టారు. వీరిద్దరూ నాల్గో వికెట్కు కీలక భాగస్వామ్యం నిర్మించారు. చెన్నై బౌలర్లు మెరుగ్గా బంతులేయటంతో పరుగులు రావటం కష్టమైంది. ఆఖరి ఓవర్ వరకూ క్రీజులో ఉన్న కరుణ్ నాయర్ 25 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. ఇందులో ఐదు సిక్సర్లు, మూడు ఫోర్లు ఉన్నాయి. ఈ సీజన్లో ఓ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ అర్ధ సెంచరీ సాధించటం పంజాబ్కు ఇదే తొలిసారి. లుంగి ఎంగిడి (4/10) నిప్పులు చెరుగగా.. షార్దుల్ ఠాకూర్ (2/33), డ్వేన్ బ్రావో (2/39) చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు.