Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్, ఇంగ్లాండ్ తొలి వన్డే నేడు
- అగ్రస్థానంపై కోహ్లిసేన కన్ను
- ప్రతీకార విజయంపై ఇంగ్లాండ్ గురి
- సా|| 5 నుంచి సోనీసిక్స్లో..
పొట్టి పోరు ముగిసింది. ఇంగ్లాండ్ పర్యటనను కోహ్లిసేన విజయంతో ఆరంభించింది. బ్రిటన్లో టీమ్ ఇండియా ఇప్పుడు రెండో పరీక్షకు సిద్ధమవుతోంది. మూడు మ్యాచుల వన్డే సిరీస్ నేడు మొదలవుతోంది. వన్డే ర్యాంకింగ్స్ల్లో అగ్రస్థానాల్లో కొనసాగుతున్న ఇంగ్లాండ్, భారత్ మధ్య ఆధిపత్య పోరు ఇది!. భారత్ నం.1పై కన్నేయగా.. ప్రతీకార విజయంతో అగ్రపీఠం పదిలం చేసుకునేందుకు ఇంగ్లీష్ టీమ్ పోరాడనున్నది. నాటింగ్హామ్లో తొలి వన్డే నేడు.
నాటింగ్హామ్ (ఇంగ్లాండ్)
సొంతగడ్డపై జరుగబోతున్న వన్డే వరల్డ్కప్ను సాధించాలనే స్వప్నంలో విహరిస్తున్న ఇంగ్లాండ్కు ఇప్పుడు కఠిన పరీక్ష ఎదురు కాబోతుంది. ఆస్ట్రేలియాను చిత్తుగా క్లీన్స్వీప్ చేసినా.. నాణ్యమైన ఆటగాళ్లు లేని కంగారూలపై ప్రతాపం చూపించారనే విమర్శ ఉండనే ఉంది!. అందుకు తగినట్టుగానే టీ20 సిరీస్లో టీమ్ ఇండియా చేతిలో ఓటమి ఇంగ్లాండ్పై విమర్శలు నిజమే అనిపించసాగాయి. దీంతో భారత్తో వన్డే సిరీస్ ఇంగ్లాండ్కు ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా మారింది. 50 ఓవర్ల ఆటలో ఆధిపత్యం చూపించేందుకు మోర్గాన్సేన ఇప్పుడు అన్ని అస్త్రాలు ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు కఠిన పరిస్థితుల నడుమ సాగే బ్రిటన్ పర్యటనకు కంగారుగానే వచ్చిన కోహ్లిసేన.. ఇక్కడ ఆరంభంలోనే అదరగొట్టింది. పొట్టి సిరీస్ విజయంతో ఇప్పుడు వన్డేల్లో ఫేవరేట్గా బరిలోకి దిగుతోంది.
కోహ్లి నాలుగులోనే!
భారత ముగ్గురు స్పెషలిస్ట్ బ్యాట్స్మన్ ఫామ్లో ఉండటంతో విరాట్ కోహ్లి టీ20ల్లో నాలుగో స్థానానికి వెళ్లిపోయాడు. మూడో స్థానంలో వచ్చిన కెఎల్ రాహుల్ సూపర్ సెంచరీతో హిట్ కొట్టాడు. దీంతో కోహ్లి వన్డేల్లోనూ నాలుగులోనే రావాలని జట్టు మేనేజ్మెంట్ కోరుకుంటోంది. విరాట్ సైతం అందుకు సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ ఇంగ్లాండ్పై టీ20ల్లో మెరువకపోయినా.. ఈ పిచ్లపై అతడికి ఉన్న రికార్డు దృష్ట్యా అతడిని కొనసాగించే అవకాశమే కనిపిస్తోంది. మిడిల్ ఆర్డర్లో విరాట్కు తోడు సురేశ్ రైనా బాధ్యతలు పంచుకునే వీలుంది. లోయర్ ఆర్డర్లో ఎం.ఎస్ ధోని మంచి ఫామ్లో ఉన్నాడు. అతడికి జోడీగా హార్దిక్ పాండ్య ఉండనే ఉన్నాడు. స్పిన్ బాధ్యతల కోసం అక్షర్ పటేల్ సైతం పోటీలో ఉన్నా కుల్దీప్, చాహల్ ద్వయమే తుది జట్టులో ఉండనున్నారు. ఉమేశ్ యాదవ్తో కలిసి షార్దుల్ ఠాకూర్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నాడు.
ప్రతీకార జ్వాల :
1-2తో టీ20 సిరీస్ కోల్పోయిన బాధలో ఉన్న ఇంగ్లాండ్ ఎలాగైనా వన్డే సిరీస్ను సొంతం చేసుకోవాలని చూస్తోంది. ఆ జట్టు స్టార్ బ్యాట్స్మన్ జో రూట్ పొట్టి ఫార్మాట్లో రాణించలేదు. స్పిన్ వలలో చిక్కిన రూట్ స్వల్ప స్కోర్లకే పరిమితమయ్యాడు. వన్డేల్లో జో రూట్ రాణిస్తాడని ఇంగ్లాండ్ గంపెడు ఆశలు పెట్టుకున్నది. అతడు రాణిస్తే మిడిల్ ఆర్డర్లో ఆతిథ్య జట్టుకు వచ్చిన బెంగేమీ లేదు. జోశ్ బట్లర్ జోరు మీదున్నాడు. అతడు విధ్వంసక విన్యాసాలు కొనసాగాలని ఇంగ్లాండ్ ఆశిస్తుండగా.. అడ్డుకట్ట వేసేందుకు కోహ్లిసేన వ్యూహం పన్నుతోంది. స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ జట్టులోకి వస్తున్నా.. అతడు ప్రభావం ఏ మేరకు ఉంటుందనే చెప్పలేం. ఇయాన్ మోర్గాన్, అలెక్స్ హేల్స్, జేసన్ రారు సహా మోయిన్ అలీలు ఇంగ్లాండ్కు కీలక ఆటగాళ్లు. స్పిన్నర్ ఆదిల్ రషీద్తో కలిసి జేక్ బాల్, ఫ్లంకెట్ బౌలింగ్ విభాగంలో సత్తా చాటేందుకు ఎదురుచూస్తున్నారు.
స్పిన్ ఫ్యాక్టర్
ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్కు స్పిన్ బలహీనత అని తెలిసిన సంగతే. అదే విషయం టీ20ల్లో ప్రస్ఫుటంగా వెల్లడైంది. దీంతో వన్డేల్లోనూ ఇంగ్లాండ్ను స్పిన్తోనే కొట్టాలని మనోళ్లు భావిస్తున్నారు. ప్రత్యేకించి మిడిల్ ఓవర్లలో ఆతిథ్య జట్టు లయ దెబ్బకొట్టేందుకు చాహల్, కుల్దీప్ అస్త్రాలను ప్రయోగించనున్నారు. టీ20ల్లో విజయవంతంగా ఇంగ్లాండ్ను నిలువరించిన జోడీపై కోహ్లి గట్టి నమ్మకమే ఉంచాడు. ఇంగ్లాండ్లో బట్లర్ మినహా ఎవ్వరూ స్పిన్ను సమర్థవంతంగా ఆడలేరు. కానీ స్పిన్పై ఆచితూచి ధోరణితో ఇంగ్లాండ్ కనిపిస్తే.. కనీసం రన్రేట్ను తగ్గించేందుకైనా అది భారత్కు ఉపయుక్తంగానే ఉంటుంది.
తుది జట్లు (అంచనా)
భారత్ : శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సురేశ్ రైనా, ఎం.ఎస్ ధోని, హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, యుజ్వెంద్ర చాహల్, ఉమేశ్ యాదవ్, షార్దుల్ ఠాకూర్.
ఇంగ్లాండ్ : జోశ్ బట్లర్, జేసన్ రారు, అలెక్స్ హేల్స్, జో రూట్, ఇయాన్ మోర్గాన్, మోయిన్ అలీ, బెన్ స్టోక్స్, డెవిడ్ విల్లే, లియాం ఫ్లంకెట్, జేక్ బాల్, ఆదిల్ రషిద్.