Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరు వికెట్ల మాయ అదుర్స్
- ఇంగ్లాండ్ 268 ఆలౌట్
- భారత్తో తొలి వన్డే
చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (6/25) మళ్లీ కుమ్మేశాడు. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ను మాయలో పడేసి నాటింగ్హామ్లో తిప్పేశాడు. కుల్దీప్ మాయాజాలానికి మరోసారి బోల్తాపడిన ఇంగ్లాండ్ శిబిరం తొలి వన్డేలో 268 పరుగులకే కుప్పకూలింది. బెన్ స్టోక్స్, జోశ్ బట్లర్ అర్ధ సెంచరీలతో రాణించినా.. కుల్దీప్ను ఎదుర్కొని నిలబడలేకపోయారు.
నాటింగ్హామ్ (ఇంగ్లాండ్)
భారత యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మాంచెస్టర్ ప్రదర్శనను పునరావృతం చేశాడు. మూడో టీ20లో బరిలోకి దిగని కుల్దీప్.. ట్రెంట్బ్రిడ్జ్లో సత్తా చాటాడు. పది ఓవర్లలో 25 పరుగులకే ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ స్పిన్ మాయాజాలానికి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ మరో బంతి ఉండగానే 268 పరుగులకే కుప్పకూలింది. కుల్దీప్ యాదవ్కు వన్డేల్లో ఇదే తొలి ఐదు వికెట్ల ప్రదర్శన. వన్డేల్లో ఏ లెఫ్టార్మ్ స్పిన్నర్కైనా 6/25 గణాంకాలే అత్యుత్తమం. 2007లో దినేశ్ కార్తీక్ ఆస్ట్రేలియాపై నెలకొల్పిన 6/27 రికార్డును ట్రెంట్బ్రిడ్జ్లో కుల్దీప్ తిరగరాశాడు. కుల్దీప్ యాదవ్ టీ20ల్లో తొలి ఐదు వికెట్ల ప్రదర్శన ఇంగ్లాండ్పైనే చేయటం విశేషం.
కుల్దీప్ మాయ : టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్కు ఓపెనర్లు అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. జేసన్ రారు (38), బెయిరిస్టో (38) వేగంగా పరుగులు సాధించారు. దీంతో ఇంగ్లాండ్ తొలి వికెట్కు 73 పరుగులు జోడించింది. పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఇంగ్లీష్ ఓపెనర్లు భారీ స్కోరుకు బాటలు వేశారు. కానీ 11వ ఓవర్లో స్పిన్నర్ కుల్దీప్ను ప్రయోగించిన కోహ్లి.. ఫలితం రాబట్టాడు. ధాటిగా ఆడుతున్న జేసన్ రారు, బెయిరిస్టోలను కుల్దీప్ పెవిలియన్కు చేర్చాడు. ఆతిథ్య జట్టు స్టార్ బ్యాట్స్మన్ జో రూట్ (3)ను మరోసారి మాయ చేసిన కుల్దీప్.. అతడిని వచ్చీ రాగానే అవుట్ చేశాడు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (19)ను చాహల్ వెనక్కి పంపాడు. వరుస వికెట్లతో ఢలాీ పడిన ఇంగ్లాండ్ను బెన్ స్టోక్స్ (50, 103 బంతుల్లో 2 ఫోర్లు), జోశ్ బట్లర్ (51 బంతుల్లో 5 ఫోర్లు) ఆదుకున్నారు. స్పిన్నర్లను ఆచితూచి ఆడిన ఈ జోడీ ఒక్కో పరుగే జోడించింది. అర్ధ సెంచరీల తర్వాత వీరిద్దరినీ కుల్దీపే సాగనంపాడు. ఆఖర్లో మోయిన్ అలీ (24), ఆదిల్ రషీద్ (22) ఇంగ్లాండ్కు పోరాడగలిగే స్కోరు అందించారు. భారత పేసర్ ఉమేశ్ యాదవ్ రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు. కుల్దీప్ యాదవ్ పది ఓవర్ల స్పెల్లో 38 బంతుల్ని డాట్స్గా వేశాడు, అతడి బౌలింగ్లో ఇంగ్లాండ్ ఒక్క బౌండరీ కూడా కొట్టలేదు.
భారత్ దూకుడు : ఛేదనలో టీమ్ ఇండియా ధాటిగా ఆడుతోంది. ఓపెనర్ శిఖర్ ధావన్ (40, 27 బంతుల్లో 8 ఫోర్లు) ధనాధన్ అనిపించాడు. తొలి ఓవర్లోనే హాట్రిక్ బౌండరీలు సంధించిన ధావన్ దూకుడుగా ఆడాడు. మరో ఎండ్లో రోహిత్ ఆచితూచి ఆడాడు. ధావన్ జోరుతో భారత్ స్కోరు వేగంగా సాగింది. అదే జోరులో భారీ షాట్ ఆడిన ధావన్ క్యాచౌట్గా నిష్క్రమించాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి కెప్టెన్ విరాట్ కోహ్లి భారత్ను లక్ష్యం దిశగా నడిపిస్తున్నాడు. 20 ఓవర్ల ఆట ముగిసే సరికి భారత్ 128/1తో కొనసాగుతోంది. రోహిత్ శర్మ (48), విరాట్ కోహ్లి (38) అజేయంగా ఆడుతున్నారు.