Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లార్డ్స్ టెస్టు పోరు నేటి నుంచే
- విజయంపై కోహ్లిసేన కన్ను
- జోరు మీదున్న ఇంగ్లాండ్
- మ.3.30 నుంచి సోనీసిక్స్లో...
టెస్టు లడాయి లార్డ్స్కు చేరుకున్నది. ఆతిథ్య ఇంగ్లాండ్ మరో విజయంతో సిరీస్పై పట్టు సాధించాలని చూస్తోంది. కానీ కోహ్లిసేన లార్డ్స్లోనే లెక్క సరి చేయాలని భావిస్తోంది. సమవుజ్జీల సమరంతో లార్డ్స్లో మరో రసవత్తర టెస్టుకు రంగం సిద్ధమైంది. భారత్, ఇంగ్లాండ్ రెండో టెస్టు నేటి నుంచి ఆరంభం.
మెగా సిరీస్లో ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యంలో ఉంది. సొంత అభిమానుల నడుమ రూట్ బృందం లార్డ్స్లోనూ ఫేవరేట్గా బరిలోకి దిగుతోంది. జట్టు సమతుల్యతను పాటిస్తోన్న ఇంగ్లాండ్.. వరుసగా రెండో టెస్టులో కోహ్లిసేనకు ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.
0-1తో రెండో టెస్టులో అడుగుపెట్టడం ఏ జట్టుకైనా కష్టమే. కానీ కోహ్లిసేన తొలి టెస్టు సానుకూలతలతో లార్డ్స్లో ఆడనున్నది. విజయానికి ఎంతో దగ్గరగా ఉన్నామని భావిస్తున్న టీమ్ ఇండియా.. ఇక్కడైనా ఆ అంతరాన్ని అధిగమించి లెక్క సరి చేయాలని ఉవ్విళ్లూరుతోంది. కెప్టెన్ కోహ్లి జోరుమీదున్న వేళ లార్డ్స్లో భారత్కు మరో విజయం దక్కునా?
లండన్
టెస్టు సమరం క్రికెట్ మక్కా లార్డ్స్కు చేరింది. బర్మింగ్హామ్లో విజయం సాధించినా భయపడాల్సిన అంశాలు ఇంగ్లాండ్కు ఉండనే ఉన్నాయి. తొలి టెస్టులో ఓడినా, గెలిచేందుకు అవసరమైన సానుకూలతలు టీమ్ ఇండియా సొంతం. ఈ నేపథ్యంలో జరుగబోతున్న లార్డ్స్ టెస్టు ఆసక్తి రేపుతోంది. రూట్సేన ఫేవరేట్గా బరిలోకి దిగుతున్న రెండో టెస్టులో కోహ్లిసేన విజయంపై కన్నేయటంతో రసవత్తర సమరం ఖాయం!. ఇరు జట్లకూ మరోసారి నాయకుల ప్రదర్శనే కీలకం కానున్నా.. కెప్టెన్కు ఏ జట్టు నుంచి నాణ్యమైన సహకారం లభిస్తే విజయం వారి సొంతమని చెప్పవచ్చు!.
రహానె రాణించేనా? : గత 12 మాసాల్లో అజింక్య రహానె టెస్టు సగటు 10.72. ఉప ఖండంలో స్పిన్ ఎదుర్కొవటంతో మొదలైన రహానె వైఫల్యం.. ఇంగ్లాండ్లోనూ కొనసాగుతోంది. కానీ సఫారీ పర్యటనలో వాండరర్స్ మ్యాచ్లో అజింక్య ప్రదర్శన అసమానం. కీలక ఇన్నింగ్స్లు నమోదు చేశాడు. కానీ పేలవ ఫామ్లో ఉన్న రహానెకు లార్డ్స్లోనూ ఘనమైన రికార్డు ఉంది. 2014 టూర్లో అతడు ఇక్కడ శతకబాదాడు. దీంతో రహానె ఆ స్ఫూర్తితోనైనా ఫామ్లో వస్తాడనే ఆశలు జట్టులో కనిపిస్తున్నాయి. లార్డ్స్ విజయం ముఖ్యుల్లో ఇషాంత్ శర్మ ఫామ్లో ఉండగా.. జడేజా తుది జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నాడు. మిడిల్ ఆర్డర్లో అజింక్య రహానె ఫామ్ సాధిస్తే టీమ్ ఇండియా కష్టాలు తీరినట్టే భావించవచ్చు. కెప్టెన్ విరాట్ కోహ్లి చుట్టూనే బ్యాటింగ్ లైనప్ ఆధారపడినా.. శిఖర్ ధావన్, మురళీ విజరు, కెఎల్ రాహుల్లు భారీ ఇన్నింగ్స్పై కన్నేశారు. ఆల్రౌండర్గా న్యాయం చేయలేకపోతున్న హార్దిక్ పాండ్య.. లార్డ్స్లోనైనా మెరుస్తాడో చూడాలి. బౌలర్లలో మహ్మద్ షమి, ఇషాంత్ శర్మలకు తోడుగా మూడో సీమరా లేక ఇద్దరు స్పిన్నర్లా? అనేది నేడు ఉదయం తేలనున్నది. అశ్విన్కు తోడుగా కుల్దీప్ను ఆడించాలనే డిమాండ్ వినిపిస్తున్నా, జడేజా అవకాశాలు తోసిపుచ్చలేం. అదనపు బ్యాట్స్మన్, అదనపు బౌలర్ ఎవరు జట్టులోకి వచ్చినా.. ఉమేశ్ యాదవ్పై వేటు పడే అవకాశం లేకపోలేదు.
మరో కుర్రాడొచ్చాడు : భారత్ సీనియర్లపై ఆధారపడితే, ఇంగ్లాండ్ మాత్రం టెస్టుకో కుర్రాడిని పరిచయం చేస్తోంది. భయమెరుగని స్వభావం కుర్రాళ్ల సొంతం. అదే శామ్ కర్రన్ బర్మింగ్హామ్లో నిరూపించాడు. బ్యాట్తో, బంతితో నాణ్యమైన ప్రదర్శనతో ఆతిథ్య జట్టుకు విజయాన్ని అందించాడు. నేడు మరో 20 ఏండ్ల కుర్రాడు ఒలీ పొప్ అరంగేట్రం చేయనున్నాడు. బ్యాటింగ్ తడబాటు, స్లిప్స్లో క్యాచుల నేలపాలు కారణంగా డెవిడ్ మలన్కు ఉద్వాసన తప్పలేదు. కెప్టెన్ జో రూట్ జోరుమీదున్నాడు. బెయిర్స్టో, జెన్నింగ్స్లు ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. సీనియర్ బ్యాట్స్మన్ అలస్టెర్ కుక్ నుంచి ఇంగ్లాండ్ మెరుగైన ప్రదర్శన ఆశిస్తోంది. కానీ అశ్విన్ ఫోబియోను దాటి కుక్ రాణించటం కష్టమే!. బంతితో అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్లు ఇక్కడ మరింత ప్రభావం చూపించగలరు. ఆదిల్ రషీద్కు జట్టులో చోటు మళ్లీ ఖాయం. పేసరా? స్పిన్నరా? అనేది తేల్చుకోని క్రిస్ వోక్స్, మోయిన్ అలీలో ఒకరిని రూట్ ఎంచుకోనున్నాడు. ఇద్దరు సత్తా ఉన్న ఆల్రౌండర్లే కావటం ఆతిథ్య జట్టు సానుకూలత.
స్పిన్ సంకేతాలు! : లార్డ్స్ పిచ్ పచ్చికతో కనిపిస్తోంది. శీతల వాతావరణం ఉన్నప్పటికీ.. మూడో రోజు నుంచి పిచ్ పొడిగా మారుతుంది. ఎడ్జ్బాస్టన్లో ఇదే జరిగింది. పిచ్ స్పిన్కు, స్వింగ్కు సమాన స్థాయిలో సహకరించనున్నది. పిచ్ పరిశీలించిన కెప్టెన్ కోహ్లి, బౌలింగ్ కోచ్ అరుణ్లు ఇద్దరు స్పిన్నర్లతో ఆడేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.
కోహ్లికి కూర్పు సమస్య : కెప్టెన్ కోహ్లి ఇప్పటివరకూ ఏ రెండు టెస్టులకు ఒకే జట్టుతో బరిలోకి దిగలేదు. దీంతో లార్డ్స్ టెస్టులో తుది జట్టు కూర్పు మారబోతుందని చెప్పవచ్చు. అదనపు బ్యాట్స్మన్, లేదా అదనపు బౌలర్ అనే విషయం తేల్చుకోవాల్సి ఉంది. బ్యాట్స్మన్నే తీసుకుంటే హార్దిక్ పాండ్యపై వేటు పడొచ్చు. చతేశ్వర్ పుజారా, కరుణ్ నాయర్లలో ఒకరు జట్టులోకి వస్తారు. బౌలర్ కోసం వెళ్తే.. జడేజా, కుల్దీప్ యాదవ్లలో ఒకరు ఆడనున్నారు. ఉమేశ్ యాదవ్, హార్దిక్ పాండ్యలలో ఒకరికి మొండిచేయి తప్పదు.
తుది జట్లు (అంచనా)
భారత్ : మురళీ విజరు, శిఖర్ ధావన్/చతేశ్వర్ పుజారా, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, అజింక్య రహానె, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), అశ్విన్, హార్దిక్ పాండ్య, జడేజా/ఉమేశ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమి.
ఇంగ్లాండ్ : అలస్టెర్ కుక్, కీటన్ జెన్నింగ్స్, జో రూట్, ఒలీ పోప్, బెయిర్స్టో (వికెట్ కీపర్), జోశ్ బట్లర్, క్రిస్ వోక్స్/మోయిన్ అలీ, ఆదిల్ రషీద్, శామ్ కర్రన్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్.
నేలపాలు.. కష్టాల పాలు : క్రికెట్లో పరుగులు, వికెట్లతో పాటు క్యాచ్లకు అంతే ప్రాధాన్యం ఉంది. ఓ ఆటగాడి క్యాచ్ జారవిడిస్తే ఎంతటి పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తోందో తొలి టెస్టులోనే చూశాం. ఎడ్జ్బాస్టన్లో ఇంగ్లాండ్, భారత్లు చెరో నాలుగు క్యాచులు నేల పాలు చేశాయి. దీంతో ఇంగ్లాండ్ అదనంగా 154 పరుగులు చేయగా, భారత్ 86 పరుగులు సాధించింది. అంతిమంగా ఇంగ్లాండ్కే లబ్ది చేకూరింది. క్యాచ్ నేల పాలు అయితే భాగస్వామ్యాలు నమోదు కావటం, జట్టు లయ దెబ్బతినటం, బౌలర్లు అలసిపోవటం.. ఇలా ఎన్నో ప్రతికూలతలు చవిచూడాల్సి ఉంటుంది. మరి కోహ్లిసేన లార్డ్స్లోనైనా క్యాచ్లు ఒడిసిపడుతుందేమో చూద్దాం.