Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అథ్లెట్లతో క్రీడా మంత్రి రాథోర్
- ఆసియాడ్కు జంబో బృందం
న్యూఢిల్లీ : 2018 ఆసియా గేమ్స్లో భారత్ నుంచి జంబో బృందం బరిలోకి దిగుతోంది. 800 మందికి పైగా భారత బృందం ఆసియాడ్కు వెళ్లనున్నది. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) పంపిన జాబితాను క్రీడా శాఖ ఆమోదం తెలిపింది. ఈ బృందంలో 572 మంది అథ్లెట్లు కాగా, మిగిలిన వారు కోచ్లు, ఫిజియోలు, డాక్టర్లు సహా అధికారులు ఉన్నారు. ఆసియా గేమ్స్లో పాల్గొనబోయే బృందానికి శుక్రవారం ఐఓఏ వీడ్కోలు సభ ఏర్పాటు చేసింది. దీనికి క్రీడా శాఖ మంత్రి, ఒలింపిక్ రజత పతక విజేత రాజ్యవర్థన్ సింగ్ రాథోర్ హాజరయ్యారు. ఆసియా గేమ్స్లో పాల్గొనబోయే అథ్లెట్లు బాధ్యతతో ప్రవర్తించాలని రాథోర్ అథ్లెట్లకు సూచించారు. ' ఆసియా గేమ్స్లో భారత్ నుంచి ప్రాతినిథ్యం వహించటం ఓ గౌరవం. ఆ గౌరవాన్ని మీరు పొందారు. ఆటల్లో పాల్గొనేటప్పుడు, క్రీడా గ్రామంలో నివసించినప్పుడు మీరు (అథ్లెట్లు, అధికారులు) వ్యక్తిగత గుర్తింపు కోల్పోతారు, మీకు ఉండే ఏకైక గుర్తింపు భారత్. ఆన్ ఫీల్డ్, ఆఫ్ ఫీల్డ్ ఎక్కడైనా మీరు వంద కోట్ల ప్రజల ప్రతినిధులుగా అనే విషయం గుర్తుంచుకోవాలి. బాధ్యతతో ప్రవర్తించాలి, బాధ్యతతో మెలగాలి. అథ్లెట్, అధికారి, ఎవరైనా ఇదే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి' అని రాథోర్ పేర్కొన్నారు. ఆసియా గేమ్స్కు కఠోరంగా సాధన చేసిన తర్వాత పతకాలపై ఆశలు పెంచుకోవటం సహజమే, కానీ ఫలితాల గురించి ఎక్కువగా ఆలోచన వద్దు. అత్యుత్తమ ప్రదర్శన చేయండి, ఫలితం మీ వెంట నడుస్తుందని మంత్రి తెలిపారు. గతంతో పోల్చితే భారత జట్లు ఎంతో మెరుగ్గా ఉండటమే కాదు ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాయని రాథోర్ అభిప్రాయపడ్డారు. సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 2 వరకు ఇండోనేషియాలోని జకర్తాలో జరుగనున్న ఆసియా గేమ్స్లో భారత్ 32 క్రీడాంశాల్లో పోటీపడుతోంది. ఆసియా క్రీడల్లో పాల్గొనే ప్రతి అథ్లెట్కు రూ. 50 లక్షల బీమాను ప్రధాన స్పాన్సర్ ఎడిల్వీస్ కల్పించింది. గతంలో ఇది గుర్తింపు పొందిన క్రీడా సమాఖ్యల అథ్లెట్లకు మాత్రమే ఉండేది. కానీ తాజాగా దీన్ని ఆసియా గేమ్స్లో పాల్గొనే అథ్లెట్కు వర్తించేలా చేశారు. భారత్లో క్రీడల అభివృద్దికి క్రీడా మంత్రిత్వ శాఖ, స్పోర్ట్స్ ఇండియా (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా), భారత ఒలింపిక్ సంఘంలు కలిసి పని చేయాల్సి ఉందని రాథోర్ అన్నారు.
పతాకధారి నీరజ్ చోప్రా
ఆసియా గేమ్స్ ఆరంభోత్సవంలో త్రివర్ణ పతాకంతో భారత బృందాన్ని నడిపించే అరుదైన గౌరవం ఓ యువ అథ్లెట్కు దక్కింది. జూనియర్ ప్రపంచకప్లో పసిడి పతకంతో అందరి దృష్టిని ఆకర్షించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా జకర్తా గేమ్స్లో భారత పతాకధారిగా నిలువనున్నాడు. ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘం శుక్రవారం వెల్లడించింది. 20 ఏండ్ల నీరజ్ చోప్రా కామన్వెల్త్ చాంపియన్. ఇటీవల సావో గేమ్స్లోనూ స్వర్ణం సాధించిన అపార ప్రతిభావంతుడు. 2014 ఆసియా గేమ్స్లో హాకీ దిగ్గజం సర్దార్ సింగ్ పతాకధారిగా నిలిచాడు. ఇప్పుడీ ఈ అవకాశం 20 ఏండ్ల నీరజ్ను వరించింది.