Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2008 బీజింగ్లో బింద్రా చారిత్రక స్వర్ణం
- భారత ఒలింపిక్ చరిత్రలో ఓ మైలురాయి
న్యూఢిల్లీ : 1983 లార్డ్స్ ఫైనల్లో కపిల్ సేన క్రికెట్ ప్రపంచకప్ ముద్దాడిన వేళ.. భారతావని పులకించింది. భారత క్రికెట్ అత్యున్నత శిఖరాలు అధిరోహించేలా చేసిన చారిత్ర విజయం అది. ఆ విజయం క్రికెట్పై క్రేజ్ను పెంచటంతో భారత్లో క్రికెట్ స్థాయి ఇప్పటికీ శిఖర సమానం!. ఆగస్టు 11, 2008 బీజింగ్ ఒలింపిక్స్. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్లో భారత షూటర్ పసిడి గురి పెట్టాడు. ఒలింపిక్స్లో భారత్కు స్వర్ణం కొత్త కాదు (హాకీలో స్వర్ణాలు సాధించింది). కానీ వ్యక్తిగత విభాగంలో ఓ భారత అథ్లెట్ సాధించిన తొలి పసిడి పతకం అది. అందుకే, ఆ పసిడి శత కోటి భారతావని గర్వపడేలా చేసింది. ఎందరో వర్థమాన క్రీడాకారులకు ప్రేరణగా నిలిచింది. భారత ఒలింపిక్ క్రీడల్లోనే కాదు క్రీడా రంగంలోనే బీజింగ్ స్వర్ణానిది ప్రత్యేక స్థానం. బింద్రా స్వర్ణంతోనే భారత క్రీడా రంగంలో నవ శకం ఆరంభమైందని చెప్పవచ్చు. శనివారంతో బింద్రా ఒలింపిక్ స్వర్ణానికి పదేండ్లు పూర్తయ్యాయి. మరో రెండేండ్లలో టోక్యో 2020 ఒలింపిక్స్ సమీపిస్తున్న తరుణంలో అథ్లెట్లలో స్ఫూర్తి రగిల్చేందుకు అభినవ్ బింద్రా.. తన పసిడి ప్రయాణంపై ట్విట్టర్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. పసిడి ప్రస్థానంలో బింద్రా ఎదుర్కొన్న ఇబ్బందులు, చేసిన త్యాగాలు, అధిగమించిన సవాళ్లు చివరకు స్వర్ణంతో ఎగిరిపోయావని, నిజానికి ఆ పసిడి తానే సాధించినా.. అది భారతీయుల స్వర్ణ పతకమని పలికిన బింద్రా భావోద్వేగానికి గురి చేశాడు. ' నా కోచ్ దగ్గరికి వెళ్లిన తర్వాత గానీ నేను స్వర్ణం సాధించానని అర్థం కాలేదు. పతకం సాధించగల స్కోరు చేశానని నమ్మకంగా ఉన్నాను కానీ అది పసడి అనే స్పష్టత లేదు. నా కోచ్ గాబీని ఆలింగం చేసుకున్న తర్వాతే స్వర్ణం దక్కించుకున్నట్టు తెలిసింది' అని బీజింగ్ పసిడి ప్రదర్శనపై బింద్రా జ్ఞాపకాలను పంచుకున్నాడు.
సంతృప్తి పతకంలో లేదు! : పసిడి పతకం దాని ప్రత్యేకత గురించి చెప్పేదేముంది!, మరి అది ఒలింపిక్స్ స్వర్ణం అయితే దాన్ని గాజు మందిరంలో భద్రపరచాల్సిందే. కానీ భౌతికంగా పసిడిపై తనకెలాంటి మోజు లేదని బింద్రా తెలిపాడు. ' నా వరకైతే, ఆ పసిడి పతకాన్ని నేను వంట గది క్యాబిన్లోనూ పెడతాను. ఆ పసిడి పతకంపై వ్యక్తిగతంగా నాకు ఎటువంటి భావోద్వేగాలు లేవు. నా భావోద్వేగం అంతా ఆ పసిడి కోసం ప్రయత్నించిన 22 ఏండ్ల అహర్నిశల ప్రయాణమే. ఓ సారి వెనక్కి చూసుకుంటే ఆ పసిడి పతకం చూసి నేను గర్వపడను. అందుకోసం నేను పడిన కష్టాన్ని, చెమటోడ్చిన సమయాన్ని చూసి గర్వపడతాను' అని బింద్రా తెలిపాడు.