Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీసీఐకి విరాట్ కోహ్లి వినతి
ముంబయి : విదేశీ పర్యటనల్లో దారుణ పరాజయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది కోహ్లి సారథ్యంలోని భారత జట్టు. ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా పర్యటనలో 1-2, తాజాగా ఇంగ్లాండ్ టూర్లో 1-4తో కోహ్లిసేన టెస్టు సిరీస్లను కోల్పోయింది. వరుస ఓటములతో జట్టు మేనేజ్మెంట్ నుంచి బీసీసీఐ వివరణ కోరినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే, కెప్టెన్ విరాట్ కోహ్లి నుంచి పాలకుల కమిటీకి తాజాగా ఓ వినతి అందినట్టు సమాచారం. విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల భార్యలకు సైతం పూర్తి టూర్ అనుమతి ఇవ్వాలని కోహ్లి కోరాడు. ప్రస్తుతం సతీమణులు పరిమిత అనుమతితోనే విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు. కేవలం రెండు వారాలు మాత్రమే ఆటగాళ్ల భార్యలు విదేశీ పర్యటనల్లో వారితో ఉండేందుకు అనుమతి ఉంది. దీన్ని సవరించి, పూర్తి పర్యటనకు సతీమణులను అనుమతించాలని కోహ్లి లేఖ రాసినట్టు తెలుస్తోంది. నిజానికి, జట్టు మేనేజర్ ఆనంద్ సుబ్రమణియమ్ ఈ విషయాన్ని పాలకుల కమిటీ వద్ద ప్రస్తావించగా, వారు లేఖ రూపంలో అందించాలని కోరారు. అయితే, పాలకుల కమిటీ ప్రస్తుతానికి దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపించటం లేదు. లోధా సిఫారసుల ప్రకారం కొలుదీరనున్న నూతన పాలక మండలి దీనిపై నిర్ణయం తీసుకుంటుందని సీఓఏ చైర్మన్ వినోద్ రారు వ్యాఖ్యానించినట్టు సమాచారం.