Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసీస్ టూర్కు ముందున్న ఏకైక చాన్స్
- హైదరాబాద్ టెస్టులో ముగ్గురు ఓపెనర్లకూ చోటు!
నవతెలంగాణ -హైదరాబాద్: ఆట విండీస్తో, వేట ఆసీస్పై!. స్వదేశంలో కరీబియన్లతో సిరీస్ అసలు ఉద్దేశం ఇదే. కంగారూ గడ్డపై ఈసారి టెస్టు సిరీస్ సాధించటమే లక్ష్యంగా కోహ్లిసేన కనిపిస్తోంది. ఆ దిశగా విండీస్ టెస్టు సిరీస్ జట్టులోనూ భారీ మార్పులు చేసింది. అందులో కీలకమైనది ఓపెనింగ్ జోడీ. విండీస్తో టూర్కు కెఎల్ రాహుల్కు తోడుగా ఇద్దరు కొత్త ముఖాలను జట్టులోకి తీసుకున్నారు. యువ కెరటం పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్లు ఆసీస్ టూర్ ఆశలతో ఉన్నారు. వీరిలో రాజ్కోట్లో పృథ్వీ షాకు అవకాశం చిక్కింది. అతడు అరంగేట్రంలోనే అదరగొట్టే శతకంతో అందరికీ ఆకట్టుకున్నాడు. 99 బంతుల్లోనే 100 పరుగులు చేసి ఔరా అనిపించాడు. విండీస్తో సిరీస్లో మరో టెస్టు మాత్రమే మిగిలింది. చివరి టెస్టు శుక్రవారం నుంచి హైదరాబాద్లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో జరుగనున్నది. కంగారూ పర్యటనకు ముందు మయాంక్కు ఓ అవకాశం ఇవ్వటం తప్పనిసరి. అందుకున్న ఏకైక అవకాశం హైదరాబాదే. దీంతో ఉప్పల్ టెస్టులో ముగ్గురు ఓపెనర్లూ తుది జట్టులో నిలిచే అవకాశం కనిపిస్తోంది. టీమ్ మేనేజ్మెంట్ సైతం ఈ ఆలోచనకు సానుకూలంగా ఉండటం అంచనాలను రెట్టింపు చేస్తోంది!.
ముగ్గురు ఓపెనర్లలో కెఎల్ రాహుల్ ఒక్కడే పూర్తిగా పరీక్షించబడ్డాడు. మయాంక్ అగర్వాల్ కోసం పృథ్వీ షాను పక్కన పెట్టలేని పరిస్థితి. ఎందుకంటే ఒక్క టెస్టు ఇన్నింగ్స్తో ఈ కుర్రాడిపై భారత్ భరోసా పెట్టలేదు. అందుకే అతడికీ నిలకడగా అవకాశాలు అవసరం. కెఎల్ రాహుల్ ఇంగ్లాండ్ పర్యటనలో ఆఖరి ఇన్నింగ్స్లో 149 పరుగులు చేశాడు. కానీ గత టెస్టుల్లో అతడు ఎక్కువగా ఇన్స్వింగర్లకు వికెట్ పారేసుకుంటున్నాడు. ఇంగ్లాండ్లో ఈ బలహీనత అతడిని ముప్పు తిప్పలు పెట్టగా, రాజ్కోట్లో విండీస్ సీమర్ గాబ్రియల్ అదే అస్త్రంతో రాహుల్ను ఇబ్బంది పెట్టాడు. ఇదే సమయంలో టెస్టుల్లో రాహుల్ ఆరంభం సైతం అంత బాగా లేదు. 49 టెస్టు ఇన్నింగ్స్లో ఏకంగా 23 సార్లు కనీసం 25 బంతులైనా ఎదుర్కొకుండానే రాహుల్ పెవిలియన్కు చేరుకున్నాడు. కీలక విదేశీ పర్యటనలో ఆరంభాలు ఎంతో ముఖ్యం. అందుకే, కెఎల్ రాహుల్ను సైతం రెగ్యులర్ ఓపెనర్గా జట్టు మేనేజ్మెంట్ భావించటం లేదు. అందుకే భారత్కు ఇద్దరు పరీక్షించబడిన ఓపెనర్లు అవసరం. మయాంక్కు అవకాశం ఇవ్వటం కోసం కెఎల్ రాహుల్ను బెంచ్కు పరిమితం చేసే పరిస్థితి లేదు. అలాగని అజింక్య రహానె, చతేశ్వర్ పుజారాలలో ఒక్కరికి విశ్రాంతి ఇవ్వలేదు. సుదీర్ఘ సిరీస్ నేపథ్యంలో అవసరమైతే కెప్టెన్ కోహ్లియే విశ్రాంతి తీసుకుని తుది జట్టులో మయాంక్ అగర్వాల్కు మార్గం సుగమం చేస్తాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లేదంటే బౌలింగ్ విభాగంలో మూడో స్పిన్నర్ను పక్కనపెట్టి బ్యాటింగ్ లైనప్లో మయాంక్ను తీసుకునే అవకాశం కనిపిస్తోంది. గత దేశవాళీ సీజన్లో నిలకడగా 1000 ప్లస్ పరుగులు సాధించిన మయాంక్ అగర్వాల్, ఈ సీజన్లోనూ సత్తా చాటాడు. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు మయాంక్ అగర్వాల్కు కచ్చితంగా అవకాశం ఇవ్వాలని కెప్టెన్, కోచ్ ఓ నిర్ణయానికి రావటంతో హైదరాబాద్ టెస్టులో అగర్వాల్ అరంగేట్రం ఖాయంగా తెలుస్తోంది. తొలి టెస్టు మాదిరిగానే ఓ రోజు ముందుగానే 12 మంది జట్టును ప్రకటించనున్నారు. దీంతో అగర్వాల్ అరంగేట్రంపై గురువారమే స్పష్టత రానున్నది.