Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విండీస్తో చివరి టెస్టు నేటి నుంచి
- మయాంక్, విహారిలకు నో చాన్స్
- పోరాడేందుకు కరీబియన్ల కసరత్తు
- ఉదయం 9.30 నుంచి స్టార్స్పోర్ట్స్లో..
వరల్డ్ నం.1 మరో క్లీన్స్వీప్పై కన్నేసింది. హైదరాబాద్లో మరోసారి తిరుగులేని విజయం లాంఛనం చేసుకున్న కోహ్లిసేన నేటి నుంచి కరీబియన్లతో సమరానికి సిద్ధమవుతోంది. అన్ని రంగాల్లో భీకర ఫామ్లో జోరుమీదున్న టీమ్ ఇండియాకు ఉప్పల్లోనైనా గట్టి పోటీ ఇవ్వాలని కరీబియన్లు భావిస్తున్నారు. సీమర్ కీమర్ రోచ్, జేసన్ హౌల్డర్లు జట్టులోకి రావటం విండీస్ బలాన్ని పెంచుతోంది. మయాంక్ అగర్వాల్, హనుమ విహారిలకు అవకాశం లేదని తేలటంతో రాజ్కోట్ జట్టుతోనే ఉప్పల్లోనూ కోహ్లిసేన బరిలోకి దిగుతోంది. మరి ఉప్పల్లోనైనా ఐదు రోజుల ఆట సాగుతుందా? మనోళ్లు మూడు రోజుల్లోపే ముగిస్తారా? ఆసక్తికరం.
నవతెలంగాణ-హైదరాబాద్ : ఇంగ్లాండ్తో ఎడ్జ్బాస్టన్లో చిత్తు. కానీ హీడింగ్లేలో రూట్సేనకు గట్టి పోటీ. పాకిస్థాన్తో అబుదాబిలో దారుణ ఓటమి. కానీ షార్జాలో ఆకట్టుకునే ప్రదర్శన. ఇదే రీతిలో కోహ్లిసేనతో పోటీలోనూ పుంజుకుంటామని కరీబియన్లు ఆశలు పెట్టుకున్నారు. రాజ్కోట్లో చిత్తు చిత్తుగా ఓడిన వెస్టిండీస్.. నేటి నుంచి ఉప్పల్ టెస్టులో మెరుగైన ప్రదర్శన చేయాలని ఆశిస్తున్నారు. కెప్టెన్ జేసన్ హౌల్డర్, సీమర్ కీమర్ రోచ్లు తిరిగి జట్టులోకి రావటంతో విండీస్ బౌలింగ్ విభాగం బలోపేతమైంది. మరోవైపు కోహ్లిసేన ఉప్పల్లో మరో భారీ విజయంపై కన్నేసి బరిలోకి దిగుతోంది. లోకల్ హీరోలు మహ్మద్ సిరాజ్, హనుమ విహరిలు లేకుండానే టీమ్ ఇండియా ఉప్పల్ టెస్టుకు సిద్ధమైంది. రెండు మ్యాచుల టెస్టు సిరీస్ను 2-0తో సొంతం చేసుకొని క్లీన్స్వీప్ చేయాలని కోహ్లిసేన భావిస్తోంది. ఉప్పల్లో నేటి నుంచి విండీస్, భారత్ రెండో టెస్టు మొదలు.
రహానె రాణిస్తాడా? : ఈ ఏడాది ఆరంభంలో స్వదేశీ టెస్టుల్లో రహానె పరుగులు చేయలేదు. తాజా ఫామ్ ఆధారంగా రహానెను దక్షిణాఫ్రికాతో టెస్టుకు దూరం పెట్టారు. తాజాగా మళ్లీ స్వదేశంలో రహానె ఫామ్ సాధించలేదు. డిసెంబర్లో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్కు ముందు భారత్ ఆడనున్న చివరి టెస్టు ఇదే. దీంతో ఆసీస్ సిరీస్కు తాజా ఫామ్తో పాటు, ఆత్మవిశ్వాసం సాధించాలంటే రహానె హైదరాబాద్ టెస్టులో భారీ ఇన్నింగ్స్తో రాణించాలి. కెఎల్ రాహుల్ సైతం ఓ భారీ ఇన్నింగ్స్ బాకీ పడ్డాడు. పృథ్వీ షా రాజ్కోట్ శతకంతో ఆసీస్ టూర్ ఖాయం చేసుకున్నాడు. విరాట్ కోహ్లి గతంలో ఇక్కడ డబుల్ సెంచరీ చేశాడు. తాజా టెస్టులోనూ కోహ్లి నుంచి అభిమానులు భారీ ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు. లోయర్ ఆర్డర్లో రవీంద్ర జడేజా రాజ్కోట్ శతకంతో ఆల్రౌండర్ స్థానాన్ని పదిలం చేసుకునే పనిలో పడ్డాడు. అశ్విన్, కుల్దీప్ యాదవ్లతో కలిసి జడేజా స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నాడు. రిషబ్ పంత్ సైతం ఫామ్ కొనసాగించాలని ఆశిస్తున్నాడు.
విండీస్ పుంజుకునేనా? : రాజ్కోట్లో వెస్టిండీస్ కనీసం మూడు రోజులైనా పోటీనివ్వలేదు. భారత్ స్పిన్ మాయలో పడి విలవిల్లాడింది. అయితే, ఉప్పల్లో మెరుగైన ప్రదర్శన చేయాలని ఆ జట్టు తపిస్తోంది. బ్రాత్వైట్, సునీల్ అంబ్రిస్, రోస్టన్ ఛేజ్, కీరన్ పావెల్లపై కరీబియన్లు ఆశలు పెట్టుకున్నారు. బంతితో హౌల్డర్, కీమర్ రోచ్లు వ్యత్యాసం చూపిస్తారని విండీస్ ఆశిస్తోంది. గతంలోనూ ఆరంభంలో దారుణ ఓటములు చవిచూసినా, తర్వాతి టెస్టుల్లో గట్టి పోటీనిచ్చిన రికార్డు కరీబియన్ల సొంతం. తాజాగా ఉప్పల్లోనూ అదే ప్రదర్శన పునరావృతం చేయగలమని హౌల్డర్ బృందం నమ్మకంగా కనిపిస్తోంది.
పిచ్ రిపోర్టు : హైదరాబాద్ వికెట్ సైతం ఇంచుమించు రాజ్కోట్ మాదిరిగానే ఉండనున్నది. మూడో రోజు నుంచి స్పిన్కు గొప్ప సహకారం లభించనున్నది. ఉష్ణోగ్రతలు 30-35 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్యనే ఉండటం ఆటగాళ్లకు ఊరటనిచ్చే అంశం. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపనున్నది. తొలి రెండు రోజులు పిచ్ బ్యాటింగ్ను అనుకూలించే అవకాశం ఉంది.
తుది జట్లు (అంచనా) :
భారత్ : కెఎల్ రాహుల్, పృథ్వీ షా, చతేశ్వర్ పుజార, విరాట్ కోహ్లి, అజింక్య రహానె, రిషబ్ పంత్, అశ్విన్, జడేజా, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమి, కుల్దీప్ యాదవ్.
వెస్టిండీస్ : క్రెగ్ బ్రాత్వైట్, కీరన్ పావెల్, షారు హౌప్, సునీల్ అంబ్రిస్, సిమ్రోన్ హెట్మయర్, రోస్టన్ ఛేజ్, షేన్ డావ్రిచ్, జేసన్ హౌల్డర్, కీమర్ రోచ్, దేవెంద్ర బిషు, షనాన్ గాబ్రియల్.