Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 70 స్థానాల కోసం 346 మంది పోటీ
- ఐపీఎల్ 12 సీజన్ వేలం నేడు
140 కోట్ల రూపాయలు, 8 ప్రాంఛైజీలు, 70 స్థానాలు, 346 మంది ఆటగాళ్లు వెరసి 2019 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆటగాళ వేలానికి రంగం సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికలు, ఐపీఎల్ షెడ్యూల్ మార్పు, వేదిక అనిశ్చితి నేపథ్యంలో తొలిసారి ఐపీఎల్ వేలం ముందుగా జరుగుతోంది. జైపూర్లో జరిగే ఈ వేలంలో కాసుల వర్షం ఎవరిపై కురుస్తుందో ఆసక్తికరం.
జైపూర్ (రాజస్తాన్) : ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి ఒకే ఏడాదిలో రెండు సార్లు వేలం జరుగబోతుంది. ఈ ఏడాది జనవరిలో బెంగళూర్లో మెగా వేళం జరుపుకున్న ఐపీఎల్.. తాజాగా 2019 సీజన్ కోసం డిసెంబర్ 18న జైపూర్లో వన్.. టూ.. త్రీ.. సోల్డ్ అనేందుకు వేలం పాట సిద్ధమైంది. 2019 వన్డే వరల్డ్కప్ సన్నద్ధత కోసం ఆటగాళ్ల ను ఐపీఎల్ పూర్తి సీజన్కు చాలా జట్లు దూరంగా ఉంచు తున్నాయి. న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్ మినహా అన్ని దేశాల బోర్డులు సన్నద్ధత శిబిరాల కోసం ఆటగాళ్లను ఐపీఎల్ మధ్యలోనే తిరిగి వచ్చేయమని ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో మెరుగైన జట్లు ఉన్నప్పటికీ..ఆసీస్, సఫా రీ, ఇంగ్లాండ్ ఆటగాళ్లు జట్టును వీడిన తర్వాత, ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఆటగాళ్లను ఎంచుకునేందుకు ఇది అవకాశం కల్పిస్తోంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ క్యాపి టల్స్లు వేలంలో కీలక ఆటగాళ్లను దక్కించుకునే పనిలో ఉన్నాయి. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ బహుశా ఈ వేలంలో ఎవరినీ ఎంచుకునే అవకాశం లేదనే చెప్పాలి!.
ఓ ఆల్రౌండర్ అవసరం : కొత్త సీజన్ కోసం పేరు మార్చుకున్న ఢిల్లీ డెర్డెవిల్స్ వేలంలో సిసలైన ఆల్రౌండర్ కోసం అన్వేషిస్తోంది. గ్లెన్ మాక్స్వెల్ ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో అతడి స్థానాన్ని భర్తీ చేయగల క్రిస్ వోక్స్, కార్లోస్ బ్రాత్వైట్, కోరే అండర్సన్, శామ్ కుర్రన్లపై ఢిల్లీ క్యాపిటల్స్ కన్నేసింది. శిఖర్ ధావన్ రాకతో బ్యాటింగ్ లైనప్ బలోపేతం సహా సారథ్య సమస్య తీరిపోయినట్టే!. మహ్మద్ షమిని వదులుకున్న ఢిల్లీ.. మళ్లీ అతడిని తీసుకునే అవకాశం లేకపోలేదు. లోకల్ స్పీడ్స్టర్ ఇషాంత్ శర్మను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ ఏడుగురు భారత, ముగ్గురు విదేశీ ఆటగాళ్లను ఎంచుకునే వెసులుబాటు ఉంది.
పేసర్ల కోసం రైడ్ : కోల్కత నైట్రైడర్స్ ఈ వేలంలో 12 మందిని ఎంచుకునే వెసులుబాటు ఉంది. ఏడుగురు భారతీయ, ఐదుగురు విదేశీ ఆటగాళ్ల ఖాళీలు ఉన్నాయి. మిచెల్ స్టార్క్ను వదులుకున్న కోల్కత, అతడి స్థానంలో మరో తురుపు ముక్కను ఎంచుకునే పనిలో పడింది. సఫారీ సీమర్ మోర్నీ మోర్కెల్ను తీసుకునేందుకు కోల్కత మొగ్గుచూపుతోంది. లసిత్ మలింగ, డెల్ స్టెయిన్లనూ పరిశీలిస్తోంది. డాషింగ్ ఓపెనర్ క్రిస్ లిన్ సీజన్ మధ్యలోనే వెళ్లనున్నాడు, అతడి స్థానాన్ని భర్తీచేయగల సమర్ధులను మార్టిన్ గప్టిల్ను ఎంచుకునే వీలుంది. కోల్కత రూ. 15.20 కోట్లు వేలంలో ఖర్చు చేయవచ్చు.
పంజాబ్కు పరీక్ష : మినీ వేలంలో మెగా బడ్జెట్తో వస్తోన్న ప్రాంఛైజీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్. 15 మంది ఆటగాళ్ల కోసం పంజాబ్ వేలంలోకి రానున్నది. రూ. 36.50 కోట్లు అందుబాటులో ఉన్నాయి. వికెట్ కీపర్, ఆల్రౌండర్, పేసర్లు, స్పిన్నర్ కోసం పంజాబ్ అన్వేషిస్తోంది. విండీస్ యువ సంచలనం షిమ్రోన్ హెట్మయర్పై పంజాబ్ కన్నేసింది. ఉనద్కత్, షమి, ఇషాంత్, అరోన్లు సహా వృద్దిమాన్ సాహా కోసం పంజాబ్ వేలంలో పోటీపడనున్నది.
ఓ స్పిన్నర్, ఓ పేసర్ కోసం.. : ముంబయి ఇండియన్స్ తాజా వేలంలో ఓ అనుభవజ్ఞుడైన స్పిన్నర్ సహా ఓ విదేశీ సీమర్ను ఎంచుకోవాలని చూస్తోంది. ముంబయికి ఏడుగురు ఆటగాళ్లను తీసుకునే వెసులు బాటు ఉంది. అందులో ఆరుగురు దేశవాళీ, మరొకరు విదేశీ ఆటగాడు. మార్కండే, రాహుల్ చాహర్లు గత సీజ న్లో రాణించినా..ఓ అనుభవం ఉన్న స్పిన్నర్ ముంబయికి అవసరం. బుమ్రాతో బంతిని పంచుకునే ఓ నాణ్యమైన విదేశీ సీమర్ను తీసుకోవాలని చూస్తోంది.
డెత్ బౌలర్ కావాలి : బ్యాటింగ్ విధ్వంసకుల అడ్డా రాయల్ చాలెంజర్స్ బెంగళూర్. బంతితో బలహీనంగా ఉన్న బెంగళూర్కు నాణ్యమైన డెత్ ఓవర్ నిపుణుడు అవ సరం. డెల్ స్టెయిన్, మోర్నీ మోర్కెల్లపైనా ఆర్సీబీ ఓ కన్నేసింది. మార్కస్ స్టోయినిస్, మోయిన్ అలీ, నాథన్ కౌల్టర్ నైల్లు సీజన్ మధ్యలోనే వెళ్లిపోనున్నారు. అందు కోసం వేలంలో ప్రత్యామ్నాయ ఆటగాళ్ల కోసం బెంగళూర్ చూస్తోంది. ఆర్సీబీ పది మందిని ఎంచుకునే అవకాశం ఉండగా.. ప్రధానంగా బౌలర్లపైనే దృష్టి పెట్టే అవకాశం ఉంది.
ఫాస్ట్ బౌలర్, మిడిల్ బ్యాట్స్మన్ ! : రాజస్తాన్ రాయల్స్ వేలంలో రూ. 20.95 కోట్లతో రానున్నది. తొమ్మిది మందిని ఎంచుకునే స్వేచ్ఛ ఉంది. జైదేవ్ ఉనద్కత్ను వదిలేసి రూ. 11.50 కోట్లు మిగిల్చుకున్న రాజస్తాన్, తాజా వేలంలో అతడినే తక్కువ మొత్తానికి దక్కించుకునే వీలుంది. స్టీవ్ స్మిత్, బెన్ స్టోక్స్, జోశ్ బట్లర్లు సీజన్ మొత్తం అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఈ కోణంలోనూ ఆలోచించి, తెలివిగా వేలంలో ఆటగాళ్లను ఎంచుకోవాలని భావిస్తోంది.
ఓపెనర్, కీపర్ కావలెను : డెవిడ్ వార్నర్ రాక నూతనోత్తేజం నింపగా, శిఖర్ ధావన్ నిష్క్రమణ ఓపెనింగ్ స్థానంపై అనిశ్చితి మిగిల్చింది. వార్నర్ సైతం సీజన్ మధ్యలోనే వెళ్లనున్నాడు. వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహాను సన్రైజర్స్ హైదరాబాద్ వదిలేసుకున్నది. కానీ వేలంలో అతడి కోసం సన్రైజర్స్ ప్రయత్నించే అవకాశం లేకపోలేదు. అఫ్గాన్ ఓపెనర్ మహ్మద్ షెజాద్, కివీస్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ కోసమూ హైదరాబాద్ ప్రయత్నించే వీలుంది. సన్రైజర్స్కు ముగ్గురు దేశవాళీ, ఇద్దరు విదేశీ ఆటగాళ్లను తీసుకునే వెసులుబాటు ఉంది. రూ. 9.7 కోట్లతో ఇద్దరు కీలక ఆటగాళ్లను ఎంచుకోవాల్సి ఉంది.