Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్త ఏడాది, కొత్త సిరీస్.. కొత్తగా ఆరంభం
- భారత మహిళల వన్డే జట్టు కెప్టెన్ మిథాలీరాజ్
ముంబయి : 2018 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్స్ తుది జట్టు ఎంపిక వివాదం నుంచి నేను, హర్మన్ప్రీత్ కౌర్ ముందుకెళ్లామనే భావిస్తున్నానని దిగ్గజ క్రికెటర్ మిథాలీరాజ్ తెలిపింది. సీవోఏ సభ్యురాలు డయాన ఎదుల్జీ డైరెక్షన్లో చీఫ్ కోచ్గా రమేశ్ పొవార్ తన కెరీర్ నాశనానికి కుట్ర చేస్తున్నాడని మిథాలీరాజ్ ఆవేదన భరిత లేఖ రాయటం క్రికెట్ వర్గాల్లో సంచలనం రేపింది. ఇంగ్లాండ్తో సెమీఫైనల్స్కు మిథాలీని పక్కనపెట్టడంపై పెద్ద యెత్తున విమర్శలు రేగాయి. కొత్త కోచ్ ఎంపికలోనూ మిథాలీరాజ్ ఓవైపు, హర్మన్ప్రీత్ మరో వైపు నిలువటంతో మహిళల క్రికెట్ పయనంపై ఆందోళన నెలకొన్నది. కానీ కొత్త ఏడాదిని కొత్తగా ఆరంభిస్తామని, ఆ వివాదాన్ని దాటేసి ముందుకొచ్చామని మిథాలీరాజ్ పేర్కొన్నది. న్యూజిలాండ్తో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ కోసం భారత జట్టు ఆదివారం ముంబయి నుంచి క్రైస్ట్చర్చ్కు బయల్దేరింది. అంతకముందు వన్డే కెప్టెన్ మిథాలీరాజ్, కోచ్ డబ్లూ,వీ రామన్లు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ' ఓ ఆటను వివాదాలు ఏ విధంగా ప్రభావితం చేస్తాయో నాకు తెలుసు. ప్రదర్శనలతోనే స్పోర్ట్స్ ప్రోఫైల్ ఉంటుందని అనుకునే దాన్ని. ప్రపంచకప్ సెమీస్ వివాదం మహిళల క్రికెట్లో దుమారం రేపింది. ఎక్కువగా క్రికెటేతర అంశాలు మాట్లాడుకోవటం ఆటకు అంత మంచిది కాదు. న్యూజిలాండ్ పర్యటనలో మా ప్రదర్శనలతో అందరి దృష్టిని మళ్లీ జట్టుపైకి మళ్లించే అవకాశం లభించింది. అది మాత్రమే స్పోర్ట్స్ ప్రొఫైల్ను మెరుగుపర్చుతుంది' అని మిథాలీ తెలిపింది. ఇది కొత్త ఆరంభం. కొత్త ఏడాదిలో నూతన సిరీస్. ఆ వివాదం నుంచి నేను, హర్మన్ప్రీత్ దూరం వచ్చేశాం. ఇప్పుడు మా దృష్టి న్యూజిలాండ్ పర్యటనపైనే. జట్టుగా ఐసీసీ మహిళల చాంపియన్షిప్ పాయింట్ల విధానం ప్రాధాన్యత మాకు తెలుసు. 2021 ప్రపంచకప్కు ఈ పాయింట్లు అత్యంత కీలకం. వన్డే కెప్టెన్గా జట్టును ఏకతాటిపై ఉంచటం , సమష్టిగా రాణించటం ముఖ్యం. వ్యక్తిగత ప్రదర్శనలతో మ్యాచులు నెగ్గవచ్చు కానీ సిరీస్లు సాధించలేం. సిరీస్ గెలవాలంటే జట్టులోని అందరూ తమ వంతు పాత్ర పోషించాలి. అదే ఫార్ములా నేను నమ్ముతాను. ఇక కోచ్ డబ్లూ. వీ రామన్ వద్ద నేనెప్పుడూ శిక్షణ పొందలేదు. కానీ అతడితో పలుమార్లు మాట్లాడాను. భిన్న స్థాయిల్లో, వివిధ జట్లకు కోచింగ్ ఇచ్చిన అనుభవం ఆయన సొంతం. రామన్ కోచ్గా మహిళల క్రికెట్కు సానుకూల ఫలితాలు ఉంటాయనే ఆశిస్తున్నాను అని మిథాలీ రాజ్ తెలిపింది.