Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు ఆస్ట్రేలియాతో చివరి వన్డే ొఉదయం 7.50 ని.ల నుంచి స్టార్ సిక్స్లో ప్రసారం
మెల్బోర్న్ : ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్ 2-1తో చేజిక్కించుకొని నయా చరిత్ర సృష్టించిన టీమిండియా ఇప్పుడు మరో రికార్డుపై కన్నేసింది. ఆసీస్తో మూడు వన్డేల సిరీస్లో భాగంగా చివరి వన్డేలో టీమిండియా గెలిస్తే కొత్త అధ్యాయాన్ని లిఖించనుంది. ఇప్పటివరకూ ఆస్ట్రేలియా గడ్డపై ఒక్క ద్వైపాక్షిక వన్డే సిరీస్నూ టీమిండియా గెలిచిన సందర్భం లేదు. గతంలో రెండుసార్లు ఆస్ట్రేలియాపై వన్డే ఫార్మాట్లో సిరీస్లు సాధించినప్పటికీ అవి ద్వైపాక్షిక వన్డే సిరీస్లు కావు. ఒకటి 1985లో జరిగిన వరల్డ్ చాంపియన్ షిప్ ఆఫ్ క్రికెట్ టైటిల్ కాగా, రెండోది మూడు దేశాలు పాల్గొన్న సీబీ సిరీస్.
దాంతో ఒక ద్వైపాక్షిక వన్డే సిరీస్లో తొలిసారి ఆసీస్ను వారి దేశంలో ఓడించే అవకాశం టీమిండియా ముంగిట ఉంది. ఈ మేరకు కసరత్తులు చేస్తున్న కోహ్లీ సేన ఆసీస్ పర్యటనకు ఘనమైన ముగింపు ఇచ్చే యోచనలో ఉంది. శుక్రవారం మెల్బోర్న్ వేదికగా ఇరుజట్ల మధ్య సిరీస్ నిర్ణయాత్మక ఆఖరివన్డే జరుగనుంది. భారత్-ఆసీస్లు తలో వన్డే గెలిచి సమంగా నిలవడంతో మూడో వన్డేకు ప్రాధాన్యత సంతరించుకుంది. తొలి వన్డేలో ఆసీస్ 34 పరుగుల తేడాతో గెలవగా, రెండో వన్డేలో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఆసీస్ను ఓడించింది. నేటిమ్యాచ్లో భారత్ గెలిచిన పక్షంలో ఆస్ట్రేలియా పర్యటనలో సిరీస్ను కోల్పోకుండా ముగించినట్లు అవుతుంది. మూడు టీ20ల సిరీస్ 1-1తో సమం కాగా, నాలుగు టెస్టుల సిరీస్ను 2-1తో టీమిండియా గెలుచుకున్న విషయం తెలిసిందే.
వరల్డ్కప్కు రిషభ్ ఎంపిక భారమే : సచిన్
వచ్చే వరల్డ్కప్లో భారత క్రికెట్ జట్టులో యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్కు అవకాశం దక్కే అవకాశాలు సంక్లిష్టమని సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ మాట్లాడుతూ రిషభ్ పంత్ తమ వరల్డ్ కప్ ప్రణాళికల్లో ఉన్నాడంటూ చెప్పుకొచ్చాడు. అయితే దీనిపై సచిన్ మాత్రం పెదవి విరిచాడు. రాబోయే వరల్డ్కప్లో రిషభ్ పంత్కు చోటిస్తే మాత్రం అది జట్టు కూర్పుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్నాడు. ఇప్పటికే ఇద్దరు స్పెషలిస్టు వికెట్ కీపర్లు ఎంఎస్ ధోని, దినేశ్ కార్తీక్లు వన్డే జట్టులో ఉండగా, మరొక స్పెషలిస్టు వికెట్ కీపరైన పంత్కు చోటు కల్పించడం జట్టుకు భారంగా మారుతుందన్నాడు. ధోనీ గాడిలోపడితే అతను ఏమి చేయాలనుకున్నాడో అది ఖచ్చితంగా చేసి చూపెడతాడన్నాడు. గేమ్ను ఫినిషింగ్ చేసే విధానంలో ధోని దిట్ట. ఇక దినేశ్ కార్తీక్ కూడా మంచి బ్యాట్స్మన్. మ్యాచ్పై ఒత్తిడిని తగ్గిస్తూ స్టైక్ రొటేట్ చేయడంలో కార్తీక్కు మంచి అనుభవం ఉంది. ఈ తరుణంలో రిషభ్ వరల్డ్కప్ ఎంపిక అనేది సరైనది కాకపోవచ్చని' సచిన్ పేర్కొన్నాడు.
భారతజట్టు : విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, అంబటి రాయుడు, దినేష్ కార్తీక్, ఎంఎస్ ధోనీ(వికెట్ కీపర్), కుల్దీప్ యాదవ్/చాహల్, రవీంద్ర జడేజా/కేదర్ జాదవ్, భువనేశ్వర్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ షమి, సిరాజ్/విజరు శంకర్.
ఆస్ట్రేలియాజట్టు : అరోన్ ఫించ్(కెప్టెన్), బెహ్రెన్డోర్ఫ్, క్యారీ(వికెట్కీపర్), హ్యాండ్స్కోంబ్, ఉస్మాన్ ఖావాజా, లియాన్, మిఛెల్ మార్ష్/షాన్ మార్ష్, మ్యాక్స్వేల్, రిచర్డ్సన్, సిడెల్/టర్నెర్, స్టాన్లేక్/స్టోనిస్, ఆడమ్ జంపా.