Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్కంఠ ఛేదనలో భంగపాటు
- విజరు, కార్తీక్, కృనాల్ పోరాటం వృథా
హామిల్టన్
ముందున్నది 213 పరుగుల భారీ లక్ష్యం. ఆరంభంలో రోహిత్ (38), విజరు శంకర్ (43) మెరుపులతో ఛేదన సాఫీగానే సాగిపోతున్నది!, కానీ వరుస వికెట్లతో ఒత్తిడి భారత్పై పడింది. కానీ దినేశ్ కార్తీక్ (33), కృనాల్ పాండ్య (26) పోరాటం విజయంపై ఆశలు రేకెత్తించింది. చివరి ఓవర్లో అవసరమైన పరుగులు 16. క్రీజులో కార్తీక్ ఉండటంతో నిదహాస్ ట్రోఫీ ఫైనల్స్ ఫలితం పునరావృతం అవుతుందని అనిపించింది. కానీ ఒత్తిడిలో గురి తప్పిన కార్తీక్, కృనాల్లు చివరి ఆరు బంతుల్లో 11 పరుగులే చేశారు. భారీ ఛేదనలో కడవరకూ పోరాడినా, చిన్న కప్పు టీమ్ ఇండియా చేజారింది. 2-1తో టీ20 సిరీస్ న్యూజిలాండ్ వశమైంది.
సక్సెస్ఫుల్ టూర్ను విజయంతో ముగించటంలో టీమ్ ఇండియా విఫలమైంది. ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠ రేపిన 213 పరుగుల ఛేదనలో భారత్ ఒత్తిడిలో పడింది. క్రీజులో హిట్లర్లు ఉన్నా, 208 పరుగులే చేయగల్గింది. చిన్న బౌండరీల మైదానంలో భారత్ను కట్టడి చేసిన ఆతిథ్య న్యూజిలాండ్ 4 పరుగులతో గెలుపొందింది. 2-1తో మూడు మ్యాచుల టీ20 సిరీస్ను గెల్చుకున్నది. కొలిన్ మన్రో (72, 40 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్లు) విధ్వంసక ఇన్నింగ్స్తో చెలరేగగా, టిమ్ సీఫర్ట్ (43) రాణించాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 212 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేదనలో విజరు శంకర్ (43, 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లు), కెప్టెన్ రోహిత్ శర్మ (38, 32 బంతుల్లో 3 ఫోర్లు) సహా దినేశ్ కార్తీక్ (33 నాటౌట్, 16 బంతుల్లో 4 సిక్స్లు) పోరాటం వృథా అయ్యింది. మిచెల్ శాంట్నర్, డార్లీ మిచెల్లు చెరో రెండు వికెట్లతో భారత్ను ఛేదనలో దెబ్బకొట్టారు. కొలిన్ మన్రో 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలువగా, టిమ్ సీఫర్ట్ 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు అందుకున్నాడు.
చెలరేగిన మన్రో : సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్లో టాస్ నెగ్గిన భారత్, ఛేదనకు ఓటేసింది. న్యూజిలాండ్ ఓపెనర్లు ఆ జట్టుకు అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. పవర్ ప్లేలో విరుచుకుపడిన ఓపెనింగ్ జోడీ దండిగా పరుగులు పిండుకున్నది. టిమ్ సీఫర్ట్ (43, 25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లు) ఫామ్ కొనసాగించాడు. వరుసగా విఫలమవుతున్న కొలిన్ మన్రో చివరి మ్యాచ్లో చిచ్చరపిడుగులా విరుచుకుపడ్డాడు. 40 బంతుల్లోనే 72 పరుగులు కొట్టిన మన్రో.. ఐదేసి ఫోర్లు, సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. వరుస వైఫల్యాలతో జట్టులో చోటు కోల్పోయే ప్రమాదంలో పడిన మన్రో.. వీరోచిత ఇన్నింగ్స్తో సత్తా చాటాడు. వీరిద్దరి జోరుతో కివీస్ భారీ స్కోరు దిశగా సాగింది. కుల్దీప్ యాదవ్ వీరిద్దని అవుట్ చేసినా.. కేన్ విలియమ్సన్ (27), కొలిన్ డీ గ్రాండ్హోమె (30) సహా డార్లీ మిచెల్ (19), రాస్ టేలర్ (14)లు చివర్లో మెరవటంతో న్యూజిలాండ్ 212 పరుగులు చేసింది. కుల్దీప్ యాదవ్ (2/26) మినహా మిగతా బౌలర్లందరూ ధారాళంగా పరుగులు ఇచ్చారు.
సాగీ సాగక.. సాగలే : భారీ ఛేదనలో టీమ్ ఇండియా పయనం ఇలాగే సాగింది. ఆరంభంలో లక్ష్యం దిశగా వేగంగా అడుగులు వేసిన రోహిత్సేన, మిడిల్ ఓవర్లలో తడబడింది. చివర్లో మళ్లీ పుంజుకున్నా.. అది వృథా పోరాటమే అయ్యింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (5) విఫలమైనా విజరు శంకర్ (43)తో కలిసి కెప్టెన్ రోహిత్ శర్మ (38) ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లాడు. సహజ శైలికి భిన్నంగా రోహిత్ నెమ్మదిగా ఆడగా.. విజరు శంకర్ ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో చెలరేగాడు. విజరు నిష్క్రమించినా.. రిషబ్ పంత్ (28, 12 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్లు)తో కలిసి రోహిత్ పోరాటం కొనసాగించాడు. 12 బంతుల్లోనే మూడు సిక్సర్లు, ఓ ఫోర్ కొట్టిన పంత్ ప్రమాదకరంగా కనిపించాడు. హార్దిక్ పాండ్య (21, 11 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్లు) సైతం వచ్చీరాగానే బౌండరీలపై విరుచుకుపడ్డాడు. రిషబ్, రోహిత్, హార్దిక్ సహా ప్రమాదకర ధోని (2)లను స్వల్ప విరామంలో అవుట్ చేసిన న్యూజిలాండ్ మ్యాచ్ను చేతుల్లోకి తీసుకున్నది. 145/6తో భారత్ ఛేదన ముగిసిందనే అనిపించింది. ఈ దశలో దినేశ్ కార్తీక్ (33 నాటౌట్), కృనాల్ పాండ్య (26 నాటౌట్) అద్భుతంగా పోరాడారు. కార్తీక్ నాలుగు సిక్సర్లు కొట్టగా, పాండ్య రెండు సిక్సర్లతో మెరిశాడు. చివరి ఓవర్లో 16 పరుగులు సులువుగా కొట్టేస్తారని అనిపించినా, వీరి గురి తప్పింది. 11 పరుగులే ఇచ్చిన న్యూజిలాండ్ టీ20 సిరీస్ను సొంతం చేసుకున్నది.
పొట్టి క్రికెట్లో మహి మరో రికార్డు కొట్టాడు. టీ20ల్లో 300 మ్యాచులు ఆడిన తొలి భారత క్రికెటర్గా నిలిచాడు. 38.57 సగటుతో 24 అర్ధ సెంచరీలు కొట్టిన ధోని 6134 పరుగులు చేశాడు. 298 మ్యాచులతో రోహిత్ శర్మ తర్వాతి స్థానంలో ఉన్నాడు.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ : టిమ్ సీఫర్ట్ (స్టంప్డ్) ధోని (బి) కుల్దీప్ యాదవ్ 43, కొలిన్ మన్రో (సి) హార్దిక్ పాండ్య (బి) కుల్దీప్ యాదవ్ 72, కేన్ విలియమ్సన్ (సి) కుల్దీప్ యాదవ్ (బి) ఖలీల్ అహ్మద్ 27, కొలిన్ డీ గ్రాండ్హోమె (సి) ధోని (బి) భువనేశ్వర్ 30, డార్లీ మిచెల్ నాటౌట్ 19, రాస్ టేలర్ నాటౌట్ 14, ఎక్ట్రాలు : 07, మొత్తం : (20 ఓవర్లలో 4 వికెట్లకు) 212.
వికెట్ల పతనం : 1-80, 2- 135, 3- 150, 4-193.
బౌలింగ్ : భువనేశ్వర్ కుమార్ 4-0-37-1, ఖలీల్ అహ్మద్ 4-0-47-1, హార్దిక్ పాండ్య 4-0-44-0, కృనాల్ పాండ్య 4-0-54-0, కుల్దీప్ యాదవ్ 4-0-26-2.
భారత్ ఇన్నింగ్స్ : శిఖర్ ధావన్ (సి) మిచెల్ (బి) శాంట్నర్ 5, రోహిత్ శర్మ (సి) సీఫర్ట్ (బి) మిచెల్ 38, విజరు శంకర్ (సి) గ్రాండ్హోమె (బి) శాంట్నర్ 43, రిషబ్ పంత్ (సి) విలియమ్సన్ (బి) టిక్నర్ 28, హార్దిక్ పాండ్య (సి) విలియమ్సన్ (బి) స్కాట్ 21, ఎం.ఎస్ ధోని (సి) సౌథీ (బి) మిచెల్ 2, దినేశ్ కార్తీక్ నాటౌట్ 33, కృనాల్ పాండ్య నాటౌట్ 26, ఎక్స్ట్రాలు : 12, మొత్తం : (20 ఓవర్లలో 6 వికెట్లకు) 208.
వికెట్ల పతనం : 16, 2-81, 3-121, 4-141, 5-145, 6-145.
బౌలింగ్ : మిచెల్ శాంట్నర్ 3-0-32-2, టిమ్ సౌథీ 4-0-47-0, స్కాట్ 4-0-37 -1, బ్లేర్ టిక్నర్ 4-0-34-1, ఇశ్ సోధి 2-0-30-0, డార్లీ మిచెల్ 3-0-27-2.