Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తలకు, చెవికి గాయాలు
న్యూఢిల్లీ : భారత మాజీ పేసర్, డీడీసీఏ (ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ సంఘం) సెలక్షన్ కమిటీ చైర్మన్ అమిత్ భండారిపై సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీకి సిద్ధమవుతోన్న ఢిల్లీ సీనియర్ జట్టు ప్రాక్టీస్ సెషన్కు వచ్చిన అమిత్పై దుండగులు దాడి చేశారు. అండర్-23 జట్టులో చోటు దక్కని ఓ ఆటగాడు, ఈ దాడి చేయించినట్టు తెలుస్తోంది. అండర్-23 ప్రాబబుల్స్లో ఉన్న అనుజ్, జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. నేనంత మంచి వాడిని కాదని, జట్టులోకి ఎంపిక చేయకుంటే వీపరిత పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని గతంలోనే అనుజ్ చీఫ్ సెలక్టర్ను హెచ్చరించినట్టు సమాచారం. మరో ఆటగాడు ఏకంగా రివాల్డర్ గురి పెట్టి జట్టులోకి ఎంపిక చేస్తారా? లేదా అని బెదిరించినట్టు డీడీసీఏ వర్గాలు చెబుతున్నాయి. ఎంపిక కాకపోవటంతో మనస్తాపానికి గురైన అనుజ్ కిరాయి గుండాలతో అమిత్పై దాడి చేయించాడు. గుండాల దాడిలో అమిత్ తలకు, చెవికి బలమైన గాయాలయ్యాయి. అమిత్కు సంత్ పరమానంద్ హాస్పిటల్లో చేర్పించారు. సెయింట్ స్టిఫెన్స్ గ్రౌండ్లో ఈ ఘటన చోటుచేసుకున్నది. ' అమిత్పై దాడి ఘటనను విచారిస్తున్నాం. బాధితుడి వాంగూల్మం తీసుకున్న తర్వాత కేసు నమోదు చేస్తామని' నార్త్ ఢిల్లీ పోలీసు కమిషనర్ నుపుర్ ప్రసాద్ వెల్లడించారు. దాడికి పాల్పడిన వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో వదలబోమని, శిక్ష పడేలా చూస్తామని డీడీసీఏ అధ్యక్షుడు రజత్ శర్మ పేర్కొన్నారు. అమిత్పై దాడిని మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ తీవ్రంగా ఖండించాడు ' ఢిల్లీ నడిబొట్టున ఈ ఘటన జరగటాన్ని జీర్ణించుకోలేక పోతున్నాను. ఈ విషయాన్ని వదిలి పెట్టడానికి వీల్లేదు. దాడికి పాల్పడిన కుర్రాడిపై జీవిత కాల నిషేధం విధించాలి. ఏ స్థాయి క్రికెట్లోనూ ఆడకుండా చేయాలి' అని గంభీర్ ట్విట్టర్లో స్పందించాడు.