Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేసులో మనీశ్, అయ్యర్, రాహుల్
- ఆసీస్ సిరీస్కు జట్టు ఎంపిక నేడు
నవతెలంగాణ-హైదరాబాద్ : ఇప్పుడేమీ ప్రపంచకప్ జట్టును ప్రకటించటం లేదు. కానీ, ప్రపంచకప్ ఉత్కంఠ అప్పుడే మొదలైంది. 2019 వరల్డ్కప్కు ముందు, టీమ్ ఇండియా ఆడబోతున్న చివరి సిరీస్ కావటంతో ప్రపంచ సైన్యం ఎలా ఉంటుందో సెలక్షన్ కమిటీ చూపించబోతున్నది!. మిడిల్ ఆర్డర్లో మ్యాచ్ ఫినిషర్, టాప్ ఆర్డర్లో మూడో ఓపెనర్ స్థానాలపై పెద్ద చర్చే నడుస్తోంది. ఓపెనర్లలో ఎవరైనా గాయపడినా, చివర్లో ముగించే వాడు లేకపోయినా.. కోహ్లిసేన ప్రపంచకప్ కల సాకారం కష్టమని విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచకప్లో ప్రభావం చూపగల, ప్రతిభావంతులైన యువ క్రికెటర్లను జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆస్ట్రేలియాతో టీ20, వన్డే సిరీస్కు భారత జట్టును సీనియర్ సెలక్షన్ కమిటీ నేడు ముంబయిలో సమావేశమై ఎంపిక చేయనున్నది. క్రికెట్ వర్గాల కండ్లన్నీ ఇప్పుడు ఎమ్మెస్కే బృందం ఎంపికపైనే నెలకొన్నాయి.
పంత్ కోసం నెహ్రా! : 2011 ప్రపంచకప్ జట్టులో కీలక సభ్యుడు, యువ క్రికెటర్ రిషబ్ పంత్ ఆటను చిన్న నాటి నుంచి పరిశీలించిన వెటరన్ సీమర్ ఆశీష్ నెహ్రా. ప్రపంచకప్ జట్టులో రిషబ్ పంత్ కచ్చితంగా ఉండాలని అభిప్రాయపడిన నెహ్రా, అందుకు ఐదు కారణాలను వివరించాడు. ' జట్టు ఆటలో అందరి పాత్ర ఉంటుంది. కానీ ప్రపంచకప్ వంటి మెగా టోర్నీల్లో జట్టుకు ఎక్స్ ఫ్యాక్టర్ అవసరం. రిషబ్ పంత్ సాధారణ పాత్రధారి కాదు, అతడు ప్రపంచకప్లో ఉండాల్సిన స్వచ్ఛమైన మ్యాచ్ విన్నర్. భారత బ్యాటింగ్ లైనప్ను పరిశీలిస్తే ఓపెనర్ శిఖర్ ధావన్ మినహా ఎడం చేతి వాటం బ్యాట్స్మెన్ లేరు. పెద్ద టోర్నీలో కుడి, ఎడమల కాంబినేషన్ ఎంతో కీలకం. రిషబ్ పంత్తో ఆ వైవిధ్యత వస్తుంది. రిషబ్ పంత్ 1-7 స్థానాల్లో ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలడు. ఓపెనర్గా, టాప్ ఆర్డర్ బ్యాట్స్మన్గా, మిడిల్ ఆర్డర్లో, ముగింపులోనూ రాణించగలడు. అవసరం మేరకు ఎక్కడైనా వాడుకోవచ్చు. ఇది జట్టుకు పెద్ద బలం. సిక్సర్లు బాదే విషయంలో రోహిత్ శర్మ తర్వాత స్థానంలో రిషబ్ పంత్ ఉంటాడు. అలవోకగా సిక్సర్లు బాదగలిగే ఆటగాళ్లు ప్రపంచకప్లో ఎంతో అవసరం. ఇక జట్టులో ముగ్గురు మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. కోహ్లి, రోహిత్, బుమ్రా తర్వాత రిషబ్ పంత్ జట్టుకు నాల్గో మ్యాచ్ విన్నర్ అవగలడు. అంబటి రాయుడు, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్ ఆకట్టుకునే క్రికెటర్లు. కానీ వీరంత ఒకే కోవకు చెందిన వారు. వీరికి పంత్ తోడైతేనే వైవిధ్యత వస్తుంది, ఎక్స్ ఫ్యాక్టర్గా ఉంటాడు' అని నెహ్రా పేర్కొన్నాడు. జట్టులో ముగ్గురు వికెట్ కీపర్లు (ధోని, కార్తీక్, పంత్) మంచిది కాదని అంటున్నారు. కానీ ధోని ఉండగా.. కార్తీక్, పంత్లను వికెట్ కీపర్లుగా ఎందుకు చూడాలి. మనీశ్ పాండే, శ్రేయాష్ అయ్యర్ల స్థానంలో వచ్చిన వారిని స్పెషలిస్ట్ బ్యాట్స్మన్గా చూడాలని నెహ్రా అభిప్రాయపడ్డాడు.
ఆశల పల్లకిలో.. : ఆస్ట్రేలియా సిరీస్కు నేడు జట్టును ఎంపిక చేయనుండటం క్రికెటర్లలో ఉత్కంఠ రేపుతోంది. ఏడాది క్రితం వరకూ మిడిల్ ఆర్డర్లో కీలకంగా ఉన్న అజింక్య రహానె, మనీశ్ పాండేలు ఇప్పుడు కనిపించటం లేదు. విరాట్ కోహ్లి స్థానంలో మూడో స్థానంలో వచ్చిన శ్రేయాష్ అయ్యర్ ప్రస్తావనే లేదు. దీనికి తోడు అత్యుత్తమ ఫీల్డర్ ట్యాగ్తో రవీంద్ర జడేజా ప్రపంచకప్ రేసులో ఉన్నాడు. ధనాదన్ ఆటతో ప్రత్యర్థి నుంచి మ్యాచ్ను లాగేసుకునే కెఎల్ రాహుల్ అసలు ప్రపంచకప్ ప్రణాళికలో ఉన్నాడో లేదో తెలియటం లేదు. ఆస్ట్రేలియాతో సిరీస్ ఆడబోయే జట్టు ప్రపంచకప్ నకలు!. ఈ సిరీస్లో చోటు దక్కితే, లండన్ విమానానికి టికెట్ దొరికినట్టే. దీంతో అజింక్య రహానె, మనీశ్ పాండే, శ్రేయాష్ అయ్యర్, కెఎల్ రాహుల్లు ఆశల పల్లకిలో విహరిస్తున్నారు. వీరికి తోడు టెస్టుల్లో ప్రతిభ కనబరిచిన రిషబ్ పంత్ పరిణిత చెందిన క్రికెటర్గా ప్రపంచకప్ రేసులో దూసుకొస్తున్నాడు. బౌలింగ్ విభాగంలో కుల్దీప్ యాదవ్, యుజ్వెంద్ర చాహల్లు ఖాయమైనా.. స్పిన్ ఆల్రౌండర్ కోటాలో కేదార్ జాదవ్తో జడేజా పోటీపడుతున్నాడు. బుమ్రా, భువి, మహ్మద్ షమిలతో తోడుగా బంతులేసేందుకు ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్ రేసులో ఉన్నారు. మూడో ఓపెనర్, స్పిన్ ఆల్రౌండర్, నాల్గో పేసర్, ఓ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్పై ప్రస్తుతం పీఠముడి కొనసాగు తోంది. నేడు ఎమ్మెస్కే బృందం ఈ స్థానాలపై స్పష్టతతో పాటు, ప్రపంచకప్ జట్టు బ్లూ ప్రింట్ను ప్రకటించనున్నది!.