Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇరానీ కప్ విదర్భ సొంతం
నాగ్పూర్ : విదర్భ డబుల్ ధమాకా. వరుసగా రెండో ఏడాది విదర్భ రంజీ ట్రోఫీతో పాటు ఇరానీ కప్ను నిలుపుకున్నది. స్టార్స్తో కూడిన రెస్టాఫ్ ఇండియాపై పైచేయి సాధించిన విదర్భ జైత్రయాత్ర కొనసాగించింది. ముంబయి, కర్ణాటక తర్వాత రంజీ ట్రోఫీ, ఇరానీ కప్లను వరుసగా రెండు సార్లు నెగ్గిన మూడో జట్టుగా విదర్భ చరిత్ర సృష్టించింది. 280 పరుగుల లక్ష్య ఛేదనలో 37/1తో చివరి రోజు బ్యాటింగ్ మొదలెట్టిన విదర్భ 269/5తో విజయానికి కేవలం 11 పరుగుల దూరంలో నిలిచింది. ఈ సమయంలో ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు. దీంతో 95 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన విదర్భ ఇరానీ కప్ విజేతగా నిలిచింది. సంజరు రామస్వామి (42), అతర్వ తైడె (72)లు రెండో వికెట్కు 115 పరుగులు జోడించారు. సీనియర్ బ్యాట్స్మన్ గణేష్ సతీశ్ (87, 168 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్), మోహిత్ కాలె (37) సైతం రాణించారు. వికెట్ కీపర్ అక్షరు వాడ్కర్ (10) అజేయంగా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్లో 102 పరుగుల ఇన్నింగ్స్తో విదర్భకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం అందించిన అక్షరు కర్నెవర్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. తెలుగు తేజం హనుమ విహారి రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలతో చెలరేగినా, రెస్టాఫ్ ఇండియాను విజయానికి చేరువ చేయలేకపోయాడు. రెస్టాఫ్ ఇండియా వరుసగా 300, 374/4 పరుగులు చేయగా.. విదర్భ 425, 269/5తో పైచేయి సాధించింది.
అమరుల కోసం : పుల్వామా ఉగ్రదాడిని నిరసిస్తూ ఆటగాళ్లందరూ నాల్గో రోజు నల్ల బ్యాడ్జీలతో మైదానంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. విజేతగా నిలిచిన విదర్భ మరో అడుగు ముందుకేసింది. ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఫ్ జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు తమకు వచ్చిన ప్రైజ్ మనీని ప్రకటించింది. విదర్భ క్రికెట్ అసోసియేషన్, విదర్భ ఆటగాళ్ల తరఫున ఈ చిరు సాయం చేయాలని నిర్ణయించామని కెప్టెన్ ఫయజ్ ఫజల్ పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా ముంబయిలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ) రెస్టారెంట్లో పాకిస్థాన్ ప్రధాని, మాజీ క్రికెట్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఫోటోపై సీసీఐ ముసుగు వేసింది. ఉగ్రదాడికి నిరసనగా ఇమ్రాన్ ఖాన్ ఫోటోకు ముసుగు వేశామని తెలిపింది.