Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రైస్ట్చర్చ్ మసీదు మారణహో నుంచి బయటపడిన బంగ్లాదేశ్ క్రికెటర్లు
- కివీస్తో మూడో టెస్టు రద్దు
- నేడు స్వదేశానికి బంగ్లా జట్టు
క్రైస్ట్చర్చ్ :ఒక్క నాలుగు నిమిషాలు, స్వల్ప కాలిక ప్రెస్ కాన్ఫరెన్స్.. క్రైస్ట్చర్చ్ మసీదు మారణహోమం నుంచి బంగ్లాదేశ్ క్రికెటర్లను కాపాడింది!. 2009 లాహోర్లో శ్రీలంక క్రికెటర్ల బస్సుపై దాడి ఘటన ప్రపంచ క్రికెట్ ఇంకా మరువనేలేదు. అంతలోనే బంగ్లాదేశ్ క్రికెటర్లు ప్రార్థనలు చేయాల్సిన మసీదులో ఉగ్రదాడి క్రికెట్ ప్రపంచాన్ని కలవరానికి గురి చేసింది. రైట్ వింగ్ అతివాదులు ముస్లిం మైనారిటీలే లక్ష్యంగా మసీదుల్లో రక్తపుటేరులు పారించారు. క్రికెటర్లు క్షేమంగా బయపడినా.. సుమారు 49 మంది ప్రాణాలు కోల్పోయాడు. 20 మందికిపైగా తీవ్ర గాయాల పాలయ్యారు!.
బంగ్లాదేశ్, న్యూజిలాండ్ మూడో టెస్టుకు సర్వం సిద్ధమైంది. ఇరు జట్ల శిబిరాలు సహా మీడియాలోనూ ఆటగాళ్ల ఫిట్నెస్పై ఆసక్తికర చర్చ నడుస్తోంది. కానె విలియమ్సన్, బిజె వాట్లింగ్ సహా తమీమ్ ఇక్బాల్, ముష్ఫీకర్ రహీంలు మ్యాచ్ ఫిట్నెస్ సాధిస్తారా? టెస్టులో కనిపిస్తారా? అనే ఆసక్తి నెలకొన్న వాతావరణం. యథావిథిగా మ్యాచ్కు ముందు రోజు ప్రాక్టీస్ సెషన్కు బంగ్లాదేశ్ జట్టు ఇక్కడి హాగ్లే ఓవల్ మైదానానికి చేరుకున్నది. వర్షం సైతం మొదలవ్వగా బంగ్లా క్రికెటర్లు సాధన చేసేందుకు వీలు పడలేదు. లింక్లన్ యూనివర్శిటీ ఇండోర్ నెట్స్లో ప్రాక్టీస్ చేయాలనే ప్రతిపాదన వచ్చినా, దూరం దృష్ట్యా వెళ్లటం సాధ్యపడలేదు. శుక్రవారం కావటంతో బంగ్లాదేశ్ జట్టు తొలుత మసీదు వెళ్లి ప్రార్థనలు చేయాలని భావించింది. కానీ కెప్టెన్ మహ్మదుల్లా ప్రెస్ కాన్ఫరెన్స్కు సిద్ధమయ్యాడు. ఓ వైపు బంగ్లాదేశ్ క్రికెటర్లు మసీదుకు వెళ్లటం ఆలస్యం అవుతోందని తొందరపెడుతున్నారు. ఈ హడావుడిలోనే మహ్మదుల్లా కేవలం తొమ్మిది నిమిషాల్లోనే మీడియాతో ముఖాముఖిని ముగించాడు. మహ్మదుల్లా ప్రెస్ కాన్ఫరెన్స్ ముగించగానే బంగ్లాదేశ్ జట్టు మసీదుకు పయనమైంది. కానీ, మహ్మదుల్లా మీడియా సమావేశాన్ని వాయిదా వేసి ముందుగా మసీదు వెళ్లాలనే నిర్ణయం తీసుకుని ఉండి ఉంటే.. నేటి భీతావహ పరిస్థితిని ఊహకందదు!. 2009 లాహోర్ ఉగ్రదాడి క్రికెటర్లను లక్ష్యంగా చేసుకున్నది కాగా, క్రైస్ట్చర్చ్ మసీదు మారణహోమం ముస్లింలను టార్గెట్ చేసిన దాడి. బంగ్లాదేశ్ క్రికెటర్లు కచ్చితంగా మసీదుకు వచ్చి శుక్రవారం ప్రార్థనలు చేస్తారనే సమాచారం ఉగ్రవాదుల వద్ద ఉండి ఉంటే.. కచ్చితంగా క్రికెటర్లు వచ్చిన తర్వాతనే కాల్పులు జరిపేవారు!.
కండ్లముందే రక్తపుటేరులు : లిటన్ దాస్ సహా మరో ఇద్దరు జట్టు హోటల్ గదిలోనే ఉండగా బంగ్లాదేశ్ జట్టులోని 17 మంది టీమ్ బస్సులో మసీదుకు బయల్దేరారు. మసీదుకు మరో 50 అడుగుల దూరంలో ఉండగా.. బస్సు ముందుకు వెళ్లోదనే అరుపులు. ముందుగా ఉన్న కారులో రక్తపు మరకలతో ఉన్న ఓ మహిళా అటుగా వెళ్లోద్దని చెబుతోంటే.. అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఎదురుగా ఎగిసి పడుతున్న శవాలను చూసి క్రికెటర్లు భయాందోళనలకు గురయ్యారు. మసీదులో మారణహోమం కండ్లెదుట కనిపిస్తుంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బస్సులోనే బిక్కుబిక్కుమని ఉండిపోయారు. ముస్లింలను లక్ష్యంగా చేసిన దాడులు కావటంతో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మొత్తం ఒకే బస్సులో ఉన్నారనే సమాచారం తెలిస్తే..పెను ప్రమాదమని భావించిన ఆటగాళ్లు సమీపంలోని పార్క్లోకి గుంపుగా వెళ్లిపోయారు. అక్కడి నుంచి స్థానికుల సహాయంతో స్టేడియంలోని డ్రెస్సింగ్రూమ్కు వచ్చారు. క్రికెటర్లతో పాటే బంగ్లాదేశ్ పాత్రికేయులు సైతం ఉన్నారు.
మూడో టెస్టు రద్దు : న్యూజిలాండ్ చరిత్రలో కనీవినీ ఎరుగని ఉగ్రదాడితో బంగ్లాదేశ్, న్యూజిలాండ్ మూడో టెస్టును రద్దు చేశారు. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులు ఐసీసీతో సంప్రదింపులు జరిపి ఈ నిర్ణయం తీసుకున్నారు. బంగ్లాదేశ్ క్రికెటర్లు నేడు మధ్యాహ్నం క్రైస్ట్చర్చ్ నుంచి బయల్దేరి, సాయంత్రానికి ఢాకా చేరతారు.
నాలుగు నిమిషాల ముందు చేరి ఉంటే! : ' మా కండ్ల ముందే పడిపోయి ఓ నిండు ప్రాణం పోయింది. ఇంత క్రూరంగా ఎలా చంపగల్గుతారు?' అని బంగ్లాదేశ్ సీనియర్ క్రికెటర్ ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ మసీదుకు బయల్దేరినా, మీడియా సమావేశం ముందుగా ముగించి ఓ నాలుగైదు నిమిషాల ముందుగా అక్కడికి చేరినా పరిస్థితి మరోలా ఉండేది. ' ఐదు నిమిషాల ముందుగా మేం మసీదులోకి ప్రవేశించి ఉంటే, బంగ్లాదేశ్ క్రికెటర్లు అందరూ ప్రాణాలు కోల్పోయేవారు' అని బంగ్లాదేశ్ జట్టు మేనేజర్ ఖలీల్ మసూద్ అన్నాడు.