Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫైనల్లో అక్సెల్సన్ చేతిలో ఓటమి
- ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్
న్యూఢిల్లీ : ఏడాదిన్నర తర్వాత ఓ టోర్నీ టైటిల్ పోరుకు చేరుకున్న తెలుగు తేజం, భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ టైటిల్ నెగ్గటంలో విజయం సాధించలేదు. వరల్డ్ నం.1, డెన్మార్క్ స్టార్ విక్టర్ అక్సెల్సన్కు అలవోకగా టైటిల్ను కోల్పోయాడు. 7-21, 20-22తో వరుస గేముల్లోనే శ్రీకాంత్ టైటిల్ ఆశలు ఆవిరయ్యాయి. ఈ విజయంతో విక్టర్ అక్సెల్సన్ 5-3తో శ్రీకాంత్తో ముఖాముఖిలో ఆధిపత్యం సాధించాడు. అత్యంత ఏకపక్షంగా సాగిన తొలి గేమ్ను విక్టర్ కేవలం 12 నిమిషాల్లోనే గెల్చుకున్నాడు. కానీ రెండో గేమ్లో శ్రీకాంత్ గొప్పగా పుంజుకున్నాడు. విరామ సమయానికి 9-11తో విక్టర్ ముందంజలో నిలిచినా.. 20-18తో స్కోరు సమం చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. ఈ సమయంలో వరుసగా నాలుగు పాయింట్లు కొల్లగొట్టిన విక్టర్ 22-20తో రెండో గేమ్ను, ఇండియా ఓపెన్లో రెండో టైటిల్ను ఎగరేసుకుపోయాడు. ' తొలి గేమ్లో దాడి చేసేందుకు ప్రత్యర్థికి ఎక్కువ అవకాశాలు ఇచ్చాను. రెండో గేమ్లో ఆ తప్పిదాన్ని గణనీయంగా తగ్గించాను. ఒత్తిడిలో విక్టర్ నా కంటే ధైర్యంగా ఆడాడు' అని మ్యాచ్ అనంతరం శ్రీకాంత్ పేర్కొన్నాడు. రెండో గేమ్ గెలుపు ముంగిట శ్రీకాంత్ చేసిన అనవసర తప్పిదాలతో విక్టర్ అలవోక విజయం సాధించాడు. మహిళల సింగిల్స్ ఫైనల్లో 21-15, 21-14తో హీ బింగ్జియావ్ (చైనా)పై రచనోక్ ఇంటనాన్ (థాయ్లాండ్) విజయం సాధించింది.