Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్కు 16 స్వర్ణాలు
- ఆసియా ఎయిర్గన్ చాంపియన్షిప్స్
న్యూఢిల్లీ : భారత షూటర్ల గురి అదిరింది. మరో టోర్నీలో మన షూటర్లు పతకాల పంట పండించారు. టోర్నీ ఆఖరు రోజే ఆరు స్వర్ణాలు సాధించిన వేళ ఆసియా ఎయిర్గన్ చాంపియన్షిప్స్లో భారత్ పాతిక పతకాలు కొల్లగొట్టింది. 16 స్వర్ణాలు, ఐదు రజతాలు, నాలుగు కాంస్య పతకాలతో షూటింగ్ భారత్ తన ఆధిపత్యం నిరూపించుకున్నది. చివరి రోజు పోటీలో యాశ్ వర్ధన్, శ్రేయా అగర్వాల్లు మూడేసి స్వర్ణాలు సాధించారు. మెన్స్ జూనియర్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పోటీలో యాశ్ 249.5 పాయింట్లతో స్వర్ణం సాధించాడు. జట్టు విభాగంలో ప్రజాపతి, తోమర్తో కలిసి యాశ్ మరో స్వర్ణం సాధించాడు. శ్రేయా మహిళల జూనియర్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో పసిడి పతకం సాధించింది. మిక్స్డ్ జట్టు విభాగంలో శ్రేయా, యాశ్లు కలిసి మరో స్వర్ణం కొల్లగొట్టారు. భారత షూటర్లు తదుపరి ఏప్రిల్ 5 నుంచి యుఏఈలో జరుగనున్న ఐఎస్ఎస్ఎఫ్ షాట్గన్ ప్రపంచకప్లో పాల్గొననున్నారు.