Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దిగ్గజ కెప్టెన్ కపిల్దేవ్
ముంబయి : బ్యాట్స్మన్ బౌలర్ మాత్రమే ఆల్రౌండర్ అవుతాడా? ఏ రెండు విభాగాల్లో ప్రావిణ్యం సాధించినా ఆల్రౌండర్ అనే అనాలి అంటున్నాడు దిగ్గజ ఆల్రౌండర్, 1983 వరల్డ్కప్ విజయ సారథి కపిల్ దేవ్. 1983 ప్రపంచకప్ జట్టు సహచరులు క్రిష్ణమాచారి శ్రీకాంత్, సయ్యద్ కిర్మాణి, రోజర్ బిన్నీలతో కలిసి ఓ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ' బ్యాట్స్మన్, బౌలర్ను మాత్రమే ఆల్రౌండర్ అనాలా? ఓ వికెట్ కీపర్ సైతం ఆల్రౌండరే. ఆల్రౌండర్ నిర్వచనం మారిపోయింది. కేవలం పరుగులు చేసి, వికెట్లు తీస్తేనే ఆల్రౌండర్ కాదు. వికెట్ కీపర్ కూడా ఆ జాబితాలో వస్తాడు. ఇందులో ఎం.ఎస్ ధోని ముందుంటాడు. అతడు ఉన్నత ప్రమాణాలను నెలకొల్పాడు. ఏ రెండు విభాగాల్లో మంచిగా రాణించినా, అతడు ఆల్రౌండర్ కిందకే వస్తాడు. ఫీల్డింగ్లో మెరుగైన ప్రదర్శన తీసుకున్నా ఫర్వాలేదు' అని కపిల్ వ్యాఖ్యానించాడు. ఆల్రౌండర్ కొత్త నిర్వచనాన్ని మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణి సమర్థించాడు. ' మా కాలంలో వికెట్ కీపర్ను ఆల్రౌండర్గా ఎవరూ చూసేవారు కాదు. కానీ ధోని వచ్చి, నిరూపించాడు. ఆధునిక క్రికెట్లో వన్డేల వచ్చిన నాటి నుంచే వికెట్ కీపర్ ఆల్రౌండర్ అవ్వాలి. వన్డేల్లో వికెట్ కీపర్, బ్యాట్స్మన్కు ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే ఇప్పుడు వికెట్ కీపర్ను ఆల్రౌండర్ అంటున్నారు' అని కిర్మాణి అభిప్రాయపడ్డాడు. ఇక యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ను ధోనితో పోల్చవద్దని శ్రీకాంత్, కిర్మాణి, కపిల్ అభిప్రాయపడ్డారు. ' ఇంగ్లాండ్పై ఓవల్ టెస్టులో విజయంపై ఎటువంటి ఆశలు లేని స్థితి నుంచి గెలుపు సాధించే స్థితికి తీసుకొచ్చాడు పంత్. అతడికి ఆత్మవిశ్వాసం కల్పించాలి. మా రోజుల్లో కపిల్ దేవ్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు. అదే విధంగా రిషబ్ పంత్ను స్వేచ్ఛగా ఆడనివ్వాలి. కనీసం మూడు మ్యాచులను ఒంటిచేత్తో గెలిపించగల సమర్థుడు పంత్' అని శ్రీకాంత్ అన్నాడు. వికెట్ కీపర్గా ధోని ఉన్నత ప్రమాణాలను నెలకొల్పాడు. రాత్రికి రాత్రి ఆ స్థాయిని అందుకోవటం అసాధ్యం. నిరంతర సాధన, ఎన్నో అవకాశాల లభిస్తే గానీ ఆ స్థాయికి చేరుకోలేం. పంత్ను ధోనితో పోల్చటం సరకాదని కిర్మాణి అన్నాడు.
సంఖ్యలు ఎందుకు? : ప్రపంచకప్లో టీమ్ ఇండియా నాల్గో స్థానంపై విపరీతమైన చర్చ సాగుతోంది. ఐపీఎల్ ప్రతి మ్యాచ్ ముగిసిన తర్వాత ఓ కొత్త పేరు తెరపైకి వస్తోంది. ఈ చర్చకు ముగింపు పలికేలా కపిల్దేవ్ స్పందించాడు. ' అందరూ నం.4 స్థానంపై చర్చిస్తున్నారు. కానీ మ్యాచ్ పరిస్థితులను చూడాలి. స్థిరమైన బ్యాటింగ్ పొజిషన్ను నేను విశ్వసించను, అప్పటి పరిస్థితులే ముఖ్యం. ఆ స్థానంలో ఎం.ఎస్ ధోని సహా ఎవరినైనా పంపవచ్చు. 1-7 స్థానాల్లో ఆటగాళ్లందరూ నాలుగులో ఆడగల సమర్థులే. గందరగోళ పరిస్థితి సృష్టించవద్దు. విజయం ఏ విధంగా సాధించాలని అనుకుంటున్నావో అలానే ఆడాలి, నంబర్లతో కాదు. మ్యాచ్ పరిస్థితులను బట్టి అది ఆధారపడి ఉంటుంది' అని కపిల్ దేవ్ పేర్కొన్నాడు.