Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాణించిన కోహ్లి, డివిలియర్స్
- గేల్స్ అజేయ ఇన్నింగ్స్ వృథా
మొహాలి : హమ్మయ్య ఎట్టకేలకు బెంగళూర్ ఓ విజయం సాధించింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (67, 53 బంతుల్లో 8 ఫోర్లు), ఏబీ డివిలియర్స్ (59 నాటౌట్, 38 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీలతో మెరిశారు. కోహ్లి, ఏబీ జోరుతో 174 పరుగుల ఛేదనలో బెంగళూర్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పార్దీవ్ (19)తో కలిసి శుభారంభం చేసి కోహ్లి.. తర్వాత ఏబీతో కలిసి విజయాన్ని లాంఛనం చేశాడు. స్టార్ బ్యాట్స్మెన్ ఇద్దరూ మెరవటంతో సీజన్ ఏడో మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ తొలి విజయం సాధించింది. మార్కస్ స్టోయినిస్ (28 నాటౌట్, 16 బంతుల్లో 4 ఫోర్లు) రాణించాడు. అంతకుముందు విండీస్ విధ్వంసకారుడు క్రిస్ గేల్ (99 నాటౌట్, 64 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్లు) బెంగళూర్పై కొత్త తరహా ఇన్నింగ్స్ నమోదు చేశాడు. సహచర ఆటగాళ్లలో ఎవరూ రాణించకపోయినా గేల్ ఒంటరి పోరాటం చేశాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్కు 173 పరుగుల పోరాడగలిగే స్కోరు అందించాడు. ముంబయిపై సెంచరీతో చెలరేగిన కెఎల్ రాహుల్ (18) బెంగళూర్పై విఫలమయ్యాడు.
గేల్ ఒక్కడే : కింగ్స్ ఎలెవన్ పంజాబ్కు మంచి ఆరంభం లభించినా, ఆశించిన స్కోరు సాధించలేదు. భారీ స్కోర్ల మొహాలీలో క్రిస్ గేల్ (99) అజేయ ఇన్నింగ్స్తో నిలిచినా 173 పరుగులకే పరిమితమైంది. ఉమేశ్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో గేల్ ఎల్బీగా నిష్క్రమించాల్సింది. కానీ బెంగళూర్ కెప్టెన్ కోహ్లి రివ్యూ కోరలేదు. దీంతో అతడే ఆర్సీబీని వేటాడాడు. గత మ్యాచ్ సెంచరీ హీరో కెఎల్ రాహుల్ (18) రెండు ఫోర్లు, ఓ సిక్సర్తో మెరిసినా త్వరగా వికెట్ కోల్పోయాడు. స్పిన్నర్లు చాహల్ (2/33), అలీ (1/19)లు పంజాబ్ను కట్టడి చేశారు. ఓ ఎండ్లో గేల్ దూకుడుగా ఆడినా.. మరో వైపు సహకారం కొరవడింది. మయాంక్ అగర్వాల్ (15), సర్ఫరాజ్ ఖాన్ (15), శామ్ కరన్ (1)లు విఫలమయ్యారు. మన్దీప్ సింగ్ (18 నాటౌట్, 16 బంతుల్లో 1 ఫోర్) వికెట్ నిలుపుకున్నా, డెత్ ఓవర్లలో అవసరానికి తగినట్టు పరుగులు సాధించలేదు. 19 ఓవర్లకు 90 పరుగులతో నిలిచిన గేల్.. చివరి ఓవర్లో నాలుగు బంతులెదుర్కొన్నా సెంచరీ సాధించలేదు. చివరి బంతికి ఫోర్ కొట్టి 99 పరుగులతో అజేయంగా నిలిచాడు.