Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్మిత్-అజింక్యా రికార్డ్ భాగస్వామ్యం
- రాజస్థాన్ 191/6
కెప్టెన్సీ చేజారాక అజింక్యా రహానే స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్ ఆడాడు. సోమవారం ఢిల్లీపై కేవలం 58 బంతుల్లో సెంచరీని పూర్తి చేయడంతోపాటు ఐపీఎల్లో రెండో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. చివరిబంతి వరకూ క్రీజ్లో నిలిచి అజేయంగా 105 పరుగులు చేసి కెరీర్ బెస్ట్ స్కోర్ను రహానే నమోదు చేయడం విశేషం. రహానే-స్టీవ్ స్మిత్ల జోడీ రెండో వికెట్కు 75 బంతుల్లో 130 పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలో రికార్డు భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో రాజస్థాన్ భారీస్కోర్ను నమోదు చేయగల్గింది.
జైపూర్ : ఇక్కడి సవారు మాన్సింగ్ స్టేడియంలో ఢిల్లీ కేపిటల్స్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో రాజస్థాన్ భారీ స్కోరును నమోదు చేసింది. రహానే-స్మిత్ల జోడీ రెండో వికెట్కు 130 రికార్డ్ భాగస్వామ్యాన్ని నిర్మించింది. అంతకుముందు షా-రహానేల జోడీ 2012లో 121 భాగస్వామ్యాన్ని నేడు బ్రేక్ చేశారు. రహానే(105 నాటౌట్), స్టీవ్ స్మిత్(50) రాణించడంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ సంజు శాంసన్ డకౌట్ అయ్యాడు. జట్టు స్కోర్ 5 పరుగుల వద్దే రాజస్థాన్ తొలి వికెట్ను చేజార్చుకున్నది. దీంతో రహానే-స్మిత్ల జోడీ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ రెండో వికెట్కు 75 బంతుల్లో 130 పరుగులు భారీ భాగస్వామ్యాన్ని నిర్మించారు. అయితే, మరో ఓపెనర్ అజింక్య రహానే, కెప్టెన్ స్టీవ్ స్మిత్ కలిసి సంయమనంతో ఆడుతూ 32 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో ఐపీఎల్లో 8వ అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ బౌలింగ్లో క్రిస్ మోరిస్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరోవైపు క్రీజులో పాతుకుపోయిన రహానే ఐపీఎల్లో రెండో సెంచరీ నమోదు చేశాడు. కెప్టెన్సీ బాధ్యతలు లేకపోవడంతో బ్యాట్తో యథేచ్ఛగా విరుచుకుపడ్డాడు. స్వేచ్ఛగా షాట్లు కొడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మొత్తంగా 63 బంతులు ఎదుర్కొన్న రహానే 11 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 105 పరుగులు చేసి చివరి వరకూ అజేయంగా నిలిచాడు. చివర్లో స్టువర్ట్ బిన్నీ 19 పరుగులు చేయడంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 191 పరుగుల భారీస్కోర్ను నమోదు చేయగల్గింది. ఢిల్లీ బౌలర్లలో రబడాకు రెండు వికెట్లు, ఇషాంత్ శర్మ, అక్షర్ పటేల్, క్రిస్ మోరిస్ చెరో వికెట్ తీసుకున్నారు.
స్వదేశానికి బట్లర్.. మరో ఇద్దరు కూడా..
రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు డాషింగ్ ఓపెనర్ జోస్ బట్లర్ జట్టుకు దూరం కానున్నాడు. జట్టులో కీలక బ్యాట్స్మన్గా ఉన్న బట్లర్ స్వదేశానికి పయనం కానున్నాడు. బట్లర్ భార్య లౌసీ పండంటి మగబిడ్డకు జన్మనివ్వడంతో వారిద్దరినీ చూసుకునేందుకు ఇంగ్లాండ్కు పయనమయ్యాడు. ఈ కారణంతోనే ముంబయి ఇండియన్స్తో మ్యాచ్లో ఆడలేదు. నిజానికి బట్లర్ ఈ నెల మొత్తం జట్టుతోనే ఉండాల్సి ఉంది. అయితే, బట్లర్తో పాటు ఏప్రిల్ 23న మరో ఇద్దరు కీలక ఆటగాళ్లు కూడా జట్టును వీడనున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగే మ్యాచ్ తర్వాత బెన్ స్టోక్స్, జోఫ్రా అర్చర్ కూడా స్వదేశం పయనం కావాల్సి ఉంది. జట్టులో కీలక ఆటగాళ్లుగా ఉన్న ఈ ముగ్గురూ జట్టును వీడనుండటం ఆ జట్టును కలవరపెడుతోంది.
స్కోర్బోర్డు...
రాజస్థాన్ ఇన్నింగ్స్ : రహానే (నాటౌట్) 105, శాంసన్ (రనౌట్) రబడా 0, స్టీవ్ స్మిత్ (సి) మోరీస్ (బి) అక్షర్ 50, స్టోక్స్ (సి) అయ్యర్ (బి) మోరీస్ 8, టర్నర్ (సి) రూథర్ఫోర్డు (బి) ఇషాంత్ 0, బిన్నీ (బి) రబడా 19, పరాగ్ (బి) రబడా 4, అదనం 5. (20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు)
వికెట్ల పతనం: 1/5, 2/135, 3/157, 4/164, 5/187, 6/191
బౌలింగ్: ఇషాంత్ 4-0-29-1, రబడా 4-0-37-2, అక్షర్ 4-0-39-1, మిశ్రా 3-0-28-0, మోరీస్ 4-0-41-1, రూథర్ఫోర్డు 1-0-16-0.