Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐపీఎల్ మ్యాచ్లపై గవాస్కర్
- స్లో ఓవర్ రేటుపై ఆందోళన
ముంబయి : ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన సీజన్గా నిలిచిన 2019, కొన్ని విషయాల్లో మాత్రం చెత్త ఉదహారణలకు వేదికగా నిలిచింది. సీజన్ ఆరంభ మ్యాచ్లో చెన్నై, బెంగళూర్లు చెపాక్లో స్వల్ప స్కోర్ల నమోదు చేయటంతో పిచ్పై విమర్శలు వచ్చాయి. కానీ ఆ తర్వాత సీజన్ గొప్పగా పుంజుకున్నది. మధ్యలో అంపైరింగ్ వివాదాలు తలెత్తినా.. మెజార్టీ మ్యాచులు ఆఖరు ఓవర్ ఉత్కంఠకు దారితీశాయి. చివరకు ఆదివారం జరిగిన ఫైనల్స్ సైతం చివరి బంతి వరకూ ఉత్కంఠ రేపింది. అయితే, స్లో ఓవర్ రేట్ విషయంలో ఐపీఎల్ వేగం పెంచాలని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ' ఐపీఎల్ 12 అత్యంత సక్సెస్ఫుల్ సీజన్. అధిక శాతం మ్యాచుల ఫలితాలు 39వ ఓవర్లోనే తేలాయి. అభిమానులను ఎంతో థ్రిల్కు గురి చేసిన సీజన్ ఇది. టైటిల్ పోరు సైతం అదే రీతిలో ముగిసింది. ఇద్దరు అత్యుత్తమ భారత కెప్టెన్లు తలపడిన ఫైనల్లో రోహిత్ శర్మ నాల్గోసారి ముంబయిని విజేతగా నిలిపాడు. సీజనల్లో అందోళనకు గురి చేసిన అంశం మ్యాచ్ ముగిసే సమయం. టీ20 మ్యాచ్ 190 నిమిషాల్లో ముగియాలి. పది నిమిషాల టై అవుట్లతో కలుపుకుని 200 నిమిషాలకు మించకూడదు. వికెట్ పడినప్పుడు బౌలింగ్ జట్టు, తర్వాతి బంతి వేసేందుకు 120 సెకండ్లు తీసుకుంటోంది. దీన్ని 45 సెకండ్లకు కుదించవచ్చు. స్లో ఓవర్ రేట్తో కోహ్లి, రోహిత్, అశ్విన్లపై మ్యాచ్ ఫీజు కోత విధించారు. ఆర్థిక జరిమానాతో పాటు క్రికెటింగ్ శిక్షలు అమలు చేయాలి. అప్పుడు ఓవర్ రేట్ విషయంలో జట్లు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తాయి. నిర్వాహకులు తర్వాతి సీజన్ నుంచి మ్యాచ్ల వేగం పెంచటంపై నిర్మాణాత్మక చర్యలు తీసుకుంటారని అనుకుంటున్నా' అని లిటిల్ మాస్టర్ గవాస్కర్ పేర్కొన్నాడు. ఐపీఎల్12 ఫైనల్స్ సైతం ఆలస్యంగా ముగిసిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం టైటిల్ పోరు 11 గంటలకు ముగియాలి. కానీ రెండు జట్లూ డెత్ ఓవర్లలో ఫీల్డింగ్ మార్పులకు అధిక సమయం తీసుకున్నాయి. దీంతో మ్యాచ్ 40 నిమిషాల ఆలస్యమైంది.