Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అండర్డాగ్ భారత్ ప్రపంచకప్ కైవసం
- ప్రపంచకప్ మరో 13 రోజుల్లో
నవతెలంగాణ క్రీడా ప్రతినిధి
1975 ప్రపంచకప్లో ఒక విజయాన్నే నమోదు చేసిన భారత్... 1979లో ఒక్క గెలుపు కూడా సాధించక... గ్రూప్-బిలో అట్టడుగు స్థానంలో నిలిచింది. చివరికి పొరుగుదేశం శ్రీలంక చేతిలోనూ భారత్ ఓడింది. ఈ రెండు ప్రపంచకప్లలో లీగ్ దశలోనే వెనుదిరిగిన భారత్... 1983 కపిల్ దేవ్ సారథ్యంలో ప్రపంచకప్ను ఎగరేసుకుపోవడం గమనార్హం. అండర్డాగ్గా టోర్నీ బరిలోకి దిగిన భారత్ డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్ను ఫైనల్లో ఓడించి టైటిల్ను గెలిచి క్రీడా జగత్తు ఒక్కసారిగా తనవైపుకు తిప్పుకుంది.
1983 ఫ్రుడెన్షియల్ ప్రపంచకప్కు ఇంగ్లాండ్, వేల్స్ ఆతిథ్యమిచ్చాయి. డబుల్ రౌండ్ రాబిన్, నాకౌట్ పద్ధతిలో జూన్9 నుంచి 25 వరకు ఈ టోర్నీ జరిగింది. రెండు ప్రపంచకప్లలో లీగ్ దశలో ఒక దేశం మరో దేశంతో ఒక్కసారి మాత్రమే తలపడగా... ఈసారి ఆయా గ్రూపుల్లో ఉన్న జట్లు రెండేసిసార్లు ప్రత్యర్ధి జట్లతో తలపడేలా ఐసిసి కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. గ్రూప్-ఏలో ఇంగ్లాండ్, పాకిస్తాన్, న్యూజిలాండ్, శ్రీలంక జట్లు... గ్రూప్-బిలో వెస్టిండీస్, భారత్, ఆస్ట్రేలియా, జింబాబ్లే జట్లు ఉన్నాయి.
లీగ్ దశలో భారత్ 6 మ్యాచ్లు ఆడి నాలుగు విజయాలను నమోదు చేసుకొని మరో రెండు మ్యాచ్లలో పరాజయాన్ని చవిచూసి రెండోస్థానంలో నిలిచింది. జూన్ 9న డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్పై 34 పరుగుల తేడాతో గెలిచి భారత్ టైటిల్ రేసును ప్రారంభించింది. ఆ మ్యాచ్లో తొలిగా బ్యాటింగ్ చేసి భారత్ 60 ఓవర్లలో 8 వికెట్లు చేజార్చుకొని 262 పరుగులు చేయగా... ఆ లక్ష్యాన్ని ఛేదించలేక విండీస్ 54.1 ఓవర్లలో 228 పరుగులకే కుప్పకూలింది. జూన్ 11న జింబాబ్వేపై 5 వికెట్ల తేడాతో గెలిచి భారత్... జూన్ 13న ఆసీస్ చేతిలో 162 పరుగుల భారీ తేడాతో ఓడడం గమనార్హం. ఆ తర్వాత జూన్ 15న విండీస్ చేతిలో 66 పరుగులతో ఓడిన భారత్... జింబాబ్వేపై 31 పరుగుల తేడాతో గెల్చింది. ఆఖరి మ్యాచ్లో ఆస్ట్రేలియాపై 118 పరుగుల తేడాతో గెలిచి అనూహ్యంగా గ్రూప్-బి నుంచి భారత్ సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. రెండోసారి జింబాబ్వేతో మ్యాచ్ సందర్భంగా భారత్ 17 పరుగులకే 5 వికెట్లు చేజార్చుకొని కష్టాల్లో ఉన్న దశలో కపిల్ దేవ్ బ్యాటింగ్కు దిగి అజేయంగా 175 పరుగులు చేసి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.
గ్రూప్-ఏ నుంచి ఇంగ్లాండ్, పాకిస్తాన్ జట్లు... గ్రూప్-బి నుంచి వెస్టిండీస్, భారతజట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. జూన్ 22న జరిగిన తొలి సెమీస్లో ఆతిథ్య ఇంగ్లాండ్ తొలిగా బ్యాటింగ్కు దిగి 213 పరుగులకే ఆలౌట్ కాగా భారత్ కేవలం 4 వికెట్లు మాత్రమే చేజార్చుకొని లక్ష్యాన్ని ఛేదించింది. రెండో సెమీస్లో వెస్టిండీస్ జట్టు పాకిస్తాన్ జట్టుపై 8 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్లోకి దూసుకెళ్ళాయి.
జూన్ 25న లార్డ్స్లో జరిగిన ఫైనల్లో రాబర్ట్, మార్షల్, హోల్డింగ్ల దెబ్బకు భారత్ కేవలం 183 పరుగులకే కుప్పకూలింది. కృష్ణమాచారి శ్రీకాంత్(38), అమర్నాథ్(26) మాత్రమే రాణించారు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్టిండీస్ జట్టు అమర్నాథ్, మదన్లాల్ చెలరేగడంతో 52 ఓవర్లలో కేవలం 140 పరుగులకే కుప్పకూలింది. వీరిద్దరూ మూడేసి వికెట్లు పడగొట్టి విండీస్ నడ్డి విరిచారు. ఈ మ్యాచ్లో వెస్టిండీస్ విధ్వంస బ్యాట్స్మన్ వివ్ రిచర్డ్స్ కొట్టిన బంతిని కపిల్ దేవ్ 18 మీటర్లు వెనక్కి పరుగెత్తి అద్భుత క్యాచ్ అందుకొని మ్యాచ్ స్వరూపాన్ని ఒక్కసారిగా మార్చేయడం విశేషం. ఫైనల్లో మూడు వికెట్లు చేజిక్కించుకోవడంతోపాటు 12 పరుగులు చేసిన అమర్నాథ్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ ప్రపంచకప్ టోర్నీలో ఇంగ్లాండ్కు చెందిన డేవిడ్ గోవర్ 7 మ్యాచుల్లో 384 పరుగులు, వివ్ రిచర్డ్ 8 మ్యాచుల్లో 367 పరుగులు చేయగా... భారత్కు చెందిన రోజర్ బిన్నీ 8 మ్యాచుల్లో 18 వికెట్లు... అశాంత(శ్రీలంక), మదన్లాల్(భారత్)లు 17 వికెట్లతో రెండోస్థానంలో నిలిచారు.