Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2-3తో మలేషియా చేతిలో ఓటమి
- నేడు చైనాతో చావోరేవో
- సుధీర్మన్ కప్ బ్యాడ్మింటన్
నాన్నింగ్ (చైనా) : సింగిల్స్ షట్లరు సూపర్ ఫామ్లో ఉన్నారు. డబుల్స్ ప్లేయర్స్ సైతం ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. దిగ్గజ క్రీడాకారుడు లీ చోంగ్ వీ లేని మలేషియాపై భారత్కు అలవోక విజయం లాంఛనమే అనుకున్నారు. కానీ, కామన్వెల్త్ క్రీడల ఫైనల్స్ పరాజయానికి మలేషియా ప్రతీకారం తీర్చుకున్నది. మహిళల సింగిల్స్లో పి.వి సింధు, మిక్స్డ్ డబుల్స్లో సాత్విక్రాంకీ రెడ్డి, అశ్విని పొన్నప్పలు గెలుపొందినా.. మిగతా మూడు మ్యాచుల్లో మనోళ్లు పరాజయం పాలయ్యారు. ఐదు మ్యాచుల జట్టు పోటీలో భారత్ 2-3తో మలేషియా ముందు తలొంచింది. తొలుత మిక్స్డ్ డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి, అశ్విని పొన్నప్ప జంట మూడు గేముల్లో గెలుపొందారు. 16-21, 21-17, 24-22తో సూన్, జెమీలపై నెగ్గారు. తొలి గేమ్లో ఓడినా.. చివరి రెండు గేముల్లో ఈ జోడీ గొప్ప ప్రదర్శన చేసింది. మెన్స్ సింగిల్స్లో ఫామ్లో ఉన్న షట్లర్ సమీర్ వర్మ నిరాశపరిచాడు. 13-21, 15-21తో లీ జీ జియ చేతిలో వరుస గేముల్లో ఓడిపోయాడు. దీంతో స్కోరు 1-1తో సమం అయ్యింది. కీలక మహిళల సింగిల్స్లో నెగ్గిన పి.వి సింధు భారత్ను 2-1తో ఆధిక్యంలో నిలిపింది. 21-12, 21-8తో జిన్ వీపై ఏకపక్ష విజయం నమోదు చేసిన సింధు.. భారత్ను గెలుపు ముంగిట నిలిపింది. చివరి రెండు మ్యాచుల్లో ఒక విజయం సాధించినా.. భారత్ పైచేయి సాధించేది. కానీ మెన్స్ డబుల్స్లో మను అత్రి, సుమీత్ రెడ్డి 20-22, 19-21తో, మహిళల డబుల్స్లో అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి 11-21, 19-21తో నిరాశపరిచారు. 1-2 నుంచి పుంజుకున్న మలేషియా 3-2తో సుదీర్మన్ కప్ క్వార్టర్ఫైనల్స్ చోటు ఖాయం చేసుకున్నది!. నేడు చివరి గ్రూప్ మ్యాచ్లో ఆతిథ్య చైనాతో భారత్ తలపడనున్నది. మలేషియాను 5-0తో చిత్తుగా ఓడించిన చైనా గ్రూప్లో అగ్రస్థానంపై కన్నేసింది. నేడు చైనా చేతిలో ఓడితే.. మరోసారి పతకం లేకుండానే భారత్ పోటీ నుంచి నిష్క్రమించనుంది.