Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- షమి, బుమ్రా దెబ్బకు విండీస్ విలవిల
- ప్రపంచకప్లో భారత్కు ఐదో విజయం
- రాణించిన విరాట్ కోహ్లి, ఎం.ఎస్ ధోని
- సెమీస్కు చేరువైన టీమ్ ఇండియా
మాంచెస్టర్: ప్రపంచకప్లో టీమ్ ఇండియా అజేయ రికార్డు కొనసాగుతోంది. కోహ్లిసేన వరుసగా ఐదో విజయంతో సెమీఫైనల్స్కు అడుగు దూరంలో నిలిచింది. అన్ని విభాగాల్లో విండీస్పై తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన కోహ్లిసేన 125 పరుగుల భారీ తేడాతో వెస్టిండీస్పై విజయం సాధించింది. 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' కెప్టెన్ విరాట్ కోహ్లి (72, 82 బంతుల్లో 8 ఫోర్లు), ఎం.ఎస్ ధోని (56 నాటౌట్, 61 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీలతో భారత్ తొలుత 268 పరుగులు చేసింది. ఓపెనర్ కెఎల్ రాహుల్ (48, 64 బంతుల్లో 6 ఫోర్లు) రాణించాడు. భారత పేసర్లు మహ్మద్ షమి (4/16), జశ్ప్రీత్ బుమ్రా (2/9) నిప్పులు చెరిగే బంతులతో విజృంభించగా ఛేదనలో విండీస్ విలవిల్లాడింది. ఆరంభంలో పేస్, మిడిల్లో స్పిన్, ఆఖర్లో పేస్ దెబ్బతో ప్రపంచకప్లో కరీబియన్ల ఖేల్ ఖతమైంది. విండీస్ బ్యాట్స్మెన్ క్రిస్ గేల్ (6), హౌప్ (5), హౌల్డర్ (6), బ్రాత్వేట్ (1) విఫలమయ్యారు. ఐదో ఓటమి చవిచూసిన వెస్టిండీస్ 2019 ప్రపంచకప్ సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది. జూన్ 30న, బర్మింగ్హామ్లో ఆతిథ్య ఇంగ్లాండ్తో భారత్ తర్వాతి మ్యాచ్ ఆడనుంది.
విండీస్ విలవిల : విధ్వంసక హిట్లర్లతో కూడిన వెస్టిండీస్కు 269 పరుగుల లక్ష్యం పెద్దదేమీ కాదు. లోతైన బ్యాటింగ్ లైనప్తో కరీబియన్లు ఎప్పుడూ రేసులోనే ఉంటారు. మాంచెస్టర్లో భారత బౌలర్లు వరుసగా రెండో మ్యాచ్లో చెలరేగారు. మహ్మద్ షమి పవర్ ప్లేలో రెండు కీలక వికెట్లు పడగొట్టి కరీబియన్లను కష్టాల్లోకి నెట్టాడు. తొలి ఓవర్లో మెరుపు బౌండరీ బాదిన క్రిస్ గేల్ (6)ను షమి వదిలి పెట్టలేదు. ఊరించే బంతితో గేల్ను పెవిలియన్కు చేర్చాడు. మూడో స్థానంలో వచ్చిన షారు హౌప్ (5)నూ షమి ఎంతోసేపు ఆడనీయలేదు. మెరుపు బంతితో హౌప్ వికెట్లను గిరాటేశాడు. 16/2తో వెస్టిండీస్ ఒత్తిడిలో పడింది. తొలి పది ఓవర్లలో 29 పరుగులే చేసింది. ఈ దశలో సునీల్ ఆంబ్రిస్ (31, 40 బంతుల్లో 2 ఫోర్లు), నికోలస్ పూరన్ (28, 50 బంతుల్లో 2 ఫోర్లు) వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. రన్రేట్తో సంబంధం లేకుండా ముందుకు సాగారు. దూకుడుగా ఆడే ప్రయత్నం చేసిన సునీల్ను హాప్ కట్టర్తో హార్దిక్ పాండ్య వికెట్ల ముందు దొరకబుచ్చుకోగా..చైనామన్ కుల్దీప్ యాదవ్ మాయలో నికోలస్ పూరన్ పడిపోయడు. 55 పరుగుల భాగస్వామ్యంతో విండీస్ను రేసులో నిలిపిన సునీల్, పూరన్ జోడీ నిష్క్రమణతో విండీస్ తేలిపోయింది. కెప్టెన్ హౌల్డర్ (6) చాహల్పై హిట్టింగ్కు వెళ్లి వికెట్ కోల్పోగా.. బుమ్రా వరుస బంతుల్లో కీలక వికెట్లు పడగొట్టాడు. కార్లోస్ బ్రాత్వేట్ (1), ఫబియన్ ఎలెన్ (0)లను బుమ్రా బలిగొన్నాడు. షమి తన రెండో స్పెల్లో హెట్మయర్ను వెనక్కి పంపగా విండీస్ ఓటమి ఖాయమైంది. 34.2 ఓవర్లలో విండీస్ 143 పరుగులకే కుప్పకూలింది. మహ్మద్ షమి (4/16), జశ్ప్రీత్ బుమ్రా (2/9), చాహల్ (2/39) బంతితో నిప్పులు చెరిగారు.
విరాట్ సూపర్ ఫిఫ్టీ : టాస్ నెగ్గిన టీమ్ ఇండియా మాంచెస్టర్లో మరోసారి తొలుత బ్యాటింగ్కు వచ్చింది. పవర్ ప్లేలో విండీస్ బౌలర్లు నిప్పులు చెరిగారు. తొలి పది ఓవర్లలో భారత్ 47 పరుగులే చేయగల్గింది. ఫామ్లో ఉన్న 'హిట్మ్యాన్' రోహిత్ శర్మ (18) వివాదస్పద డీఆర్ఎస్ నిర్ణయానికి బలయ్యాడు. ఓ సిక్స్, ఫోర్తో లయ అందుకున్న రోహిత్ అనూహ్య నిష్క్రమణతో భారత్ స్కోరు మరీ నెమ్మదించింది. మరో ఓపెనర్ కెఎల్ రాహుల్ (48, 64 బంతుల్లో 6 ఫోర్లు)తో కలిసి కెప్టెన్ విరాట్ కోహ్లి (72) ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. రాహుల్ ఆరు ఫోర్లతో కోహ్లికి చక్కటి సహకారం అందించాడు. రెండో వికెట్కు 69 పరుగులు జోడించిన అనంతరం, రాహుల్ వికెట్ కోల్పోయాడు. నం.4లో విజరు శంకర్ (14), నం.5లో కేదార్ జాదవ్ (7) విఫలమయ్యారు. ఎం.ఎస్ ధోని (56)తో కలిసి కోహ్లి ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. సహచర బ్యాట్స్మెన్ ఇబ్బంది పడుతున్న పిచ్పై విరాట్ అలవోకగా పరుగులు సాధించాడు. విండీస్ బౌలర్లను సౌకర్యవంతంగా ఎదుర్కొన్నాడు. ఆరు ఫోర్లతో 55 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించిన కోహ్లి.. బౌలర్లపై మరింత ఆధిపత్యం చూపించాడు. 82 బంతుల్లో 72 పరుగులు చేసిన కోహ్లి విండీస్ కెప్టెన్ జేసన్ బౌలింగ్లో వికెట్ కోల్పోయాడు. 53వ వన్డే అర్ధ సెంచరీ సాధించిన కోహ్లి అంతర్జాతీయ క్రికెట్లో 20000 పరుగుల మైలురాయిని సైతం అందుకున్నాడు.
మహి మెరిశాడు : అఫ్గాన్పై నెమ్మదిగా ఆడి అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదుర్కొన్న ఎం.ఎస్ ధోని మాంచెస్టర్లో మేనియా చూపించాడు. మూడు ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా 56 పరుగులు చేసి అదరగొట్టాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే వ్యక్తిగత స్కోరు 8 పరుగుల వద్ద స్టంపౌట్ ప్రమాదం నుంచి తప్పించుకున్న ధోని.. ఆ తర్వాత విండీస్కు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. మిడిల్ ఆర్డర్లో విజరు శంకర్, కేదార్ జాదవ్ విఫలమైనా..కోహ్లికి తోడుగా నిలిచాడు. స్ట్రయిక్ రొటేట్ చేస్తూ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. హార్దిక్ పాండ్య (46)తో కలిసి ధోని 70 పరుగులు వేగంగా జోడించాడు. కోహ్లి అవుటైన సమయానికి భారత్ 38.2 ఓవర్లలో 180 పరుగులే చేసింది. ఆఖరి పది ఓవర్లలో పాండ్య, ధోని జోడీ గొప్పగా ఆడింది. పాండ్య ఐదు ఫోర్లతో మెరువగా.. ధోని స్ట్రయిక్ రొటేట్ చేశాడు. పాండ్య నిష్క్రమణ తర్వాత.. షమి (0) అవుటైనా ఆఖరి ఓవర్లో ధోని దుమ్మురేపాడు. రెండు సిక్సర్లు, ఓ ఫోర్తో 16 పరుగులు పిండుకున్నాడు. సహజ శైలిలో ఆరంభంలో నెమ్మదించిన మహి.. చివర్లో వేగంగా పరుగులు పిండుకున్నాడు. కీలక అర్ధ సెంచరీతో జట్టుకు మెరుగైన స్కోరు అందించాడు. ఆరంభంలో రాహుల్, కోహ్లి.. ఆఖర్లో పాండ్య, ధోని మెరువటంతో భారత్ 268/7 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో కీమర్ రోచ్ (3/36), జేసన్ హౌల్డర్ (2/33), షెల్డన్ కాట్రెల్ (2/50) రాణించారు.
భారత్ ఇన్నింగ్స్ : కెఎల్ రాహుల్ (బి) హౌల్డర్ 48, రోహిత్ శర్మ (సి) హౌప్ (బి) రోచ్ 18, విరాట్ కోహ్లి (సి) బ్రావో (బి)హౌల్డర్ 72, విజరు శంకర్ (సి) హౌప్ (బి) రోచ్ 14, కేదార్ జాదవ్ (సి) హౌప్ (బి) రోచ్ 7, ఎం.ఎస్ ధోని నాటౌట్ 56, హార్దిక్ పాండ్య (సి) ఫబియన్ (బి) కాట్రెల్ 46, మహ్మద్ షమి (సి) హౌప్ (బి) కాట్రెల్ 0, కుల్దీప్ యాదవ్ నాటౌట్ 0, ఎక్స్ట్రాలు : 07,
మొత్తం : (50 ఓవర్లలో 7 వికెట్లకు) 268.
వికెట్ల పతనం : 1-29, 2-98, 3-126, 4-140, 5-180, 6-250, 7-252.
బౌలింగ్ : షెల్డన్ కాట్రెల్ 10-0-50-2, కీమర్ రోచ్ 10-0-36-3, ఒసేన్ థామస్ 7-0-63-0, ఫబియన్ ఎలెన్ 10-0-52-0, జేసన్ హౌల్డర్ 10-2-33-2, కార్లోస్ బ్రాత్వేట్ 3-0-33-0.
వెస్టిండీస్ ఇన్నింగ్స్ : క్రిస్ గేల్ (సి) కేదార్ జాదవ్ (బి) షమి 6, సునీల్ ఆంబ్రిస్ (ఎల్బీ) హార్దిక్ పాండ్య 31, షారు హౌప్ (బి) షమి 5, నికోలస్ పూరన్ (సి) షమి (బి) కుల్దీప్ యాదవ్ 28, షిమ్రోన్ హెట్మయర్ (సి) రాహుల్ (బి) కుల్దీప్ యాదవ్ 18, జేసన్ హౌల్డర్ (సి) కేదార్ జాదవ్ (బి) చాహల్ 6, కార్లోస్ బ్రాత్వేట్ (సి) ధోని (బి) బుమ్రా 1, ఫబియన్ ఎలెన్ (ఎల్బీ) బుమ్రా 0, కీమర్ రోచ్ నాటౌట్ 14, షెల్డన్ కాట్రెల్ (ఎల్బీ) చాహల్ 10, ఓసేన్ థామస్ (సి)రోహిత్ (బి) షమి 6 ఎక్స్ట్రాలు : 18, మొత్తం : ( 34.2 ఓవర్లలో ఆలౌట్) 143.
వికెట్ల పతనం : 1-10, 2-16, 3-71, 4-80, 5-98, 6-107, 7-107, 8-112, 9-124, 10-143.
బౌలింగ్ : మహ్మద్ షమి 6.2-0-16-4, జశ్ప్రీత్ బుమ్రా 6-1-9-2, హార్దిక్ పాండ్య 5-0-28-1, కుల్దీప్ యాదవ్ 9-1-35-1, కేదార్ జాదవ్ 1-0-4-0, యుజ్వెంద్ర చాహల్ 7-0-39-2.
వివాదాస్పద డీఆర్ఎస్
డీఆర్ఎస్ మరోసారి చర్చనీయాంశమైంది. రోహిత్ శర్మపై వెస్టిండీస్ సమీక్ష కోరగా.. టీవీ అంపైర్ (థర్డ్ అంపైర్) హడావిడిగా నిర్ణయాన్ని ప్రకటించాడు. కీమర్ రోచ్ వేసిన ఇన్నింగ్స్ 5.6 బంతి రోహిత్ శర్మ బ్యాట్, ప్యాడ్ మధ్య నుంచి వికెట్ కీపర్ హౌప్ చేతుల్లోకి వెళ్లింది. విండీస్ అప్పీల్ను అంపైర్ తిరస్కరించగా, హౌల్డర్ సమీక్ష కోరాడు. రీప్లేలో స్నీకో మీటర్పై ఎడ్జ్ కనిపించింది. కానీ బంతి బ్యాట్కు తగిలిందా లేక ప్యాడ్కు తగిలిందా అనేది స్పష్టంగా తెలియలేదు. బంతికి, బ్యాట్కు మధ్య గ్యాప్ కనిపించినా టీవీ అంపైర్ మరిన్ని కోణాల్లో పరిశీలించకుండానే అవుట్గా నిర్ణయాన్ని ప్రకటించాడు. రోహిత్ శర్మ అసంతృప్తిగానే క్రీజు వదిలాడు. ఈ నిర్ణయంపై భారత అభిమానులు సోషల్ మీడియాలో విమర్శలు చేశారు.
ధోని బతికిపోయాడు
సుదీర్ఘ కెరీర్లో స్టంపౌట్లు చేయటంలో రాటుదేలిన ఎం.ఎస్ ధోని.. స్టంపౌట్ అవకుండా ఉండటంలోనూ మాస్టర్గా నిలిచాడు. చాలా కాలం తర్వాత జూన్ 22న అఫ్గనిస్థాన్తో మ్యాచ్లో రషీద్ ఖాన్ బౌలింగ్లో స్టంపౌట్ అయ్యాడు. విండీస్ వికెట్ కీపర్ హౌప్ తీవ్ర తప్పిదంతో ధోని వరుసగా రెండోసారి స్టంపౌట్ అయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఇన్నింగ్స్ 33.1 ఓవర్లో ఫబియన్ ఎలెన్ సంధించిన బంతి కోసం ధోని క్రీజు వదలి ముందుకొచ్చాడు. బంతి బీట్ కావటంతో ధోని స్టంపౌట్ లాంఛనమే అనిపించింది. బంతిని అందుకోలేకపోయిన హౌప్.. వేగంగా స్టంప్స్ గిరాటేయలేదు. ధోని క్రీజు వదిలి మరీ ముందుకు వెళ్లాడు. దీంతో హౌప్ మరోసారి స్టంపౌట్కు ప్రయత్నించాడు. కానీ ఇప్పుడూ హౌప్ సఫలం కాలేదు. దీంతో ధోని ఒకే బంతికి రెండు సార్లు స్టంపౌట్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు.
టీమ్ ఇండియా వరల్డ్ నం. 1
ప్రపంచకప్లో అజేయ రికార్డు కొనసాగిస్తున్న టీమ్ ఇండియా ప్రపంచ ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరుకుంది. వరల్డ్ నం.1 ర్యాంక్తో టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగిన ఆతిథ్య ఇంగ్లాండ్ ముచ్చటగా మూడు ఓటములతో ర్యాంకింగ్స్లో ఓ స్థానం దిగజారింది. ఆరు మ్యాచుల్లో ఐదు విజయాలు సాధించిన కోహ్లిసేన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో నం.1గా నిలిచింది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ జాబితాలో భారత్ ప్రస్తుతం వరల్డ్ నం.1గా కొనసాగుతోంది. 123 పాయింట్ల కోహ్లిసేన ముందంజలో నిలువగా.. 122 పాయింట్లతో ఇంగ్లాండ్ ద్వితీయ స్థానంలో కొనసాగుతోంది. ప్రపంచకప్లో నిలకడగా విజయాలు సాధించిన మరో జట్టు న్యూజిలాండ్ 114 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. భారత్తో మ్యాచ్ మినహా మిగిలిన ఆరు మ్యాచుల్లో విజయాలు అందుకున్న డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా 112 పాయింట్లతో నాల్గో స్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, వెస్టిండీస్, అఫ్గనిస్థాన్ వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వరల్డ్ నం.1, నం.2 భారత్, ఇంగ్లాండ్లు ఈ ఆదివారం బర్మింగ్హామ్లో ప్రపంచకప్ సమరంలో తలపడనున్న సంగతి తెలిసిందే. కెప్టెన్ విరాట్ కోహ్లి వరల్డ్ నం.1 బ్యాట్స్మన్గా, జశ్ప్రీత్ బుమ్రా వరల్డ్ నం.1 బౌలర్గా అగ్రస్థానాలు నిలుపుకున్నారు.