Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : భారత క్రికెట్ దిగ్గజం, అండర్-19, ఏ జట్ల చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కొత్త బాధ్యతలు స్వీకరించనున్నాడు. దేశవాళీ క్రికెట్లో కొత్త మార్పులు తీసుకొచ్చేందుకు సంకల్పించిన బీసీసీఐ, రాహుల్ ద్రవిడ్ను జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) బాధ్యుడిగా నియమించింది. ఈ పదవిని భారత దేశవాళీ క్రికెట్ చీఫ్గా పరిగణించవచ్చని బోర్డు వర్గాలు తెలిపాయి. వర్థమాన క్రికెటర్లను తీర్చిదిద్దటం, జోనల్ క్రికెట్ కోచ్లను ఎంపిక చేయటం, జూనియర్ మహిళా క్రికెటర్లనూ తయారు చేయటం సహా ఎన్సీఏకు వచ్చిన సీనియర్ క్రికెటర్ల రిహాబిలేషన్ ప్రక్రియను ద్రవిడ్ పర్యవేక్షించనున్నారు. బెంగళూర్లో జులై 1 నుంచి ద్రవిడ్ కొత్త బాధ్యతలు స్వీకరిస్తారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. భారత్-ఏ, అండర్-19 కోచ్గా ఇక నుంచి ద్రవిడ్ విదేశీ పర్యటనలకు వెళ్లే అవకాశాలు తక్కువ. ఎక్కువగా ఎన్సీఏ బాధ్యతలపైనే ద్రవిడ్ దృష్టి సారించే అవకాశం ఉంది. కీలక పర్యటనలకు మినహా విదేశీ సిరీస్లకు జట్టుతో అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఇక విరుద్ధ ప్రయోజనాల అంశంలో అంబుడ్స్మన్ జస్టిస్ డికె జైన్ ఆదేశాల అమలుపై పాలకుల కమిటీ నిర్ణయాన్ని వాయిదా వేసింది. బీసీసీఐ న్యాయ నిపుణులతో సంప్రదింపుల అనంతరం దీనిపై ఓ నిర్ణయానికి రానున్నట్టు సమాచారం. శనివారం న్యూఢిల్లీలో పాలకుల కమిటీ సమావేశమైంది.