Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బెయిర్స్ట్రో మరో శతకం
- కీలక పోరులో తడబడిన న్యూజిలాండ్
- భర్తీకాని సెమీస్ నాల్గోబెర్త్
- కివీస్ చూపు పాక్-బంగ్లా మ్యాచ్పైనే
చెస్టర్ లీ స్ట్రీట్ : ఆతిథ్య జట్టు అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. లీగ్ దశలోనే నిష్క్రమించాల్సిన దశనుండి ఆ జట్టు సెమీస్ బెర్త్ ఖాయం చేసుకున్న తీరు అమోఘం. ఇండియా, న్యూజిలాండ్లపై గెలిస్తేనే సెమీస్ బెర్త్ ఖాయమన్న క్రమంలో ఆతిథ్య జట్టు చూపిన పోరాట పటిమ భేష్. దీంతో ప్రపంచకప్ టోర్నీ సెమీస్కు ఆస్ట్రేలియా, ఇండియా, ఇంగ్లండ్లు ప్రవేశించగా... నాల్గో స్థానంకోసం పాకిస్తాన్, న్యూజిలాండ్ల మధ్య పోటీ నెలకొంది.
తాడో పేడో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో ఇంగ్లండ్ బ్యాట్స్మన్లు మరోసారి మెరిసారు. ముఖ్యంగా ఆ జట్టు ఓపెనర్ బెయిర్ స్టో(106) విధ్వంసానికి తోడు జేసన్ రారు(60) అర్ధసెంచరీతో కదం తొక్కాడు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్కు సెంచరీ భాగస్వామ్యాన్ని మరోసారి నెలకొల్పారు. దీంతో ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది. సారథి ఇయాన్ మోర్గాన్(42) కాస్త ఫర్వాలేదనిపించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో బౌల్ట్, నీషమ్, హెన్రీలు తలో రెండు వికెట్లు, సౌథీ, సాంట్నర్లు చెరో వికెట్ దక్కించుకున్నారు. ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ జట్టు 45 ఓవర్లలో 186 పరుగులకే కుప్పకూలింది. లాథమ్(57) అర్ధశతకం మినహా మిగతా బ్యాట్స్మన్లు ఘోరంగా విఫలమయ్యారు. వుడ్కు మూడు, ఆర్చర్, ఫ్లంకెట్, రషీద్, వోక్స్, స్టోక్స్లకు తలా ఒక వికెట్ దక్కాయి.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్కు ఓపెనర్లు మరోసారి శుభారంభాన్ని అందించారు. ప్రారంభం నుంచే దూకుడుగా ఆడుతూ స్కోర్బోర్డును పరిగెత్తించారు. వీరిద్దరి జోరుకు ఇంగ్లండ్ 15 ఓవర్లకే వంద పరుగులు సాధించింది. ఈ క్రమంలో వీర్దిదరూ అర్దసెంచరీలు పూర్తి చేసుకున్నారు. అర్ధ సెంచరీ అనంతరం రారును నీషమ్ ఔట్ చేసి కివీస్కు బ్రేక్ ఇచ్చాడు. దీంతో తొలి వికెట్కు 123 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. టీమిండియాపై కూడా వీరే 160 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం బెయిర్ స్టో మరింత రెచ్చిపోయి ఆడుతూ టిమ్ సౌథీ బౌలింగ్లో ఫోర్ కొట్టి సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ టోర్నీలో అతడికి రెండో సెంచరీ కావడం విశేషం. అనంతరం మ్యాట్ హెన్రీ బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అవుతాడు. అనంతరం కట్టుదిట్టమైన బౌలింగ్తో కివీస్ ఇంగ్లండ్పై ఒత్తిడి పెంచింది. దీంతో బ్యాట్స్మెన్ పరుగులు తీయడానికి ఇబ్బందులు పడ్డారు. రూట్(24), బట్లర్(11), స్టోక్స్(11), వోక్స్(4)లు త్వరగా ఔటయ్యారు. చివర్లో రషీద్(16), ఫ్లంకెట్(15 నాటౌట్) ధాటిగా ఆడే ప్రయత్నం చేయడంతో ఇంగ్లండ్ 300 పరుగులు దాటింది.
ఇంగ్లండ్ దూకుడుకు కళ్లెం...
నిర్ణయాత్మక మ్యాచ్లో ఇంగ్లండ్కు అదిరే ఆరంభం లభించింది. జేసన్ రారు, బెయిర్స్టోలు కలిసి తొలి వికెట్కు సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. వీరిద్దరూ అర్ధసెంచరీ, సెంచరీలు పూర్తిచేసుకున్నారు. వీరిద్దరి జోరుకు తోడు ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మన్లు కూడా కదం తొక్కడంతో ఇంగ్లండ్ 30 ఓవర్లకే 200 పరుగులను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ 350కు పైగా పరుగులు చేస్తుందని భావించినా... 31వ ఓవర్ నుంచి వరుస ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రూట్(24), బెయిర్స్టో(106), బట్లర్(11) ఒకరి తర్వాత ఒకరు ఔట్ అయ్యారు. తొలుత సౌథీ, సాంట్నర్లు ధారాళంగా పరుగులు సమర్పించినా... నీషమ్ బంతి అందుకోవడంతో మ్యాచ్ స్వరూపం మారిపోయింది. నీషమ్ 10 ఓవర్లలో 41 పరుగులు మాత్రమే ఇచ్చి వోక్స్, రారులను ఔట్ చేశాడు. చివర్లో మోర్గాన్, రషీద్, ఫ్లంకెట్లు కాస్త ఫర్వాలేదనిపించడంతో ఇంగ్లండ్ 300 పరుగుల స్కోర్ను నమోదు చేయగల్గింది.
భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడింది. కివీస్ తొలి ఓవర్లోనే హెర్నీ నికోలస్(0) డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత ఆరో ఓవర్లో గుప్తిల్(8) కూడా నిరాశపరిచాడు. ఆ తర్వాత విలియమ్సన్, టేలర్ నిలదొక్కుకున్నా వీరిద్దరూ రనౌట్ కావడంతో కివీస్ జట్టు ఒక్కసారిగా కష్టాల్లో పడిపోయింది. ఆ జట్టు స్కోర్ 123 పరుగులకు చేరేసరికి ఐదు వికెట్లను కోల్పోయింది. వికెట్ కీపర్ లాథమ్(57), విలియమ్సన్(27), టేలర్(28) మినహా మిగతా బ్యాట్స్మన్లు ఘోరంగా విఫలమయ్యారు. ఆతిథ్యజట్టు బౌలర్లు సమిష్టిగా చెలరేగడంతో న్యూజిలాండ్ జట్టు 186 పరుగులకే కుప్పకూలింది.