Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకే ప్రపంచకప్లో ఐదు సెంచరీలతో
రోహిత్ వరల్డ్ రికార్డు
- శతకబాదిన కెఎల్ రాహుల్
- శ్రీలంకపై భారత్ ఘన విజయం
హిట్మ్యాన్ శతకాల మోతకు మరో రికార్డు సలాం కొట్టింది. ప్రపంచకప్లో హ్యాట్రిక్ సెంచరీలు బాదిన రోహిత్ శర్మ ఒకే వరల్డ్కప్లో ఐదు సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. శ్రీలంకపై 92 బంతుల్లో రెండు సిక్సర్లు, 14 ఫోర్లు బాదిన రోహిత్ శర్మ హ్యాట్రిక్ సెంచరీ కొట్టాడు. మరో ఓపెనర్ కెఎల్ రాహుల్ (111, 118 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్) సైతం శతకంతో చెలరేగగా.. 265 పరుగుల ఛేదనను భారత్ 43.3 ఓవర్లలోనే ఊదేసింది. ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.గ్రూప్ దశలో ఏడో విజయంతో ప్రపంచకప్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. సీనియర్ బ్యాట్స్మన్ ఎంజెలో మాథ్యూస్ (113, 128 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీకి తోడు లహిరు తిరిమానె (53, 68 బంతుల్లో 4 ఫోర్లు) రాణించటంతో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 264/7 పరుగులు చేసింది.
ఓపెనర్లు ఉతికేశారు : 264 శ్రీలంక నిర్దేశించిన లక్ష్యం. వన్డేల్లో శ్రీలంకపై రోహిత్ బాదిన అత్యధిక స్కోరుతో సమానం. ఊరించే ఛేదనలో ఓపెనర్లు వేట భిన్నంగా మొదలైంది. గత మ్యాచుల్లో నెమ్మదిగా ఆడిన ఓపెనర్లు.. లీడ్స్లో దూకుడుగా మొదలెట్టారు. పవర్ ప్లేలో రోహిత్ శర్మ (103, 94 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్లు) రెచ్చిపోయాడు. శ్రీలంక బౌలర్లు రజిత, మలింగ, ఉదానలు తమ ఓవర్లలో కనీసం రెండు బౌండరీలు ఇచ్చుకున్నారు. మంచి బంతుల్ని గౌరవించిన ఓపెనర్లు.. క్రమం తప్పకుండా బౌండరీలు సాధించారు. ధనంజయ వేసిన 17వ ఓవర్లో రోహిత్ రెండు భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 8 ఫోర్లు, ఓ సిక్సర్తో రోహిత్ 48 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించగా.. ఐదు ఫోర్ల సాయంతో రాహుల్ 67 బంతుల్లో ఫిఫ్టీ అందుకున్నాడు. మరో 44 బంతుల్లోనే, బౌండరీతో సెంచరీ సాధించిన రోహిత్ శర్మ ప్రపంచకప్లో హ్యాట్రిక్ శతకం బాదాడు. వరుసగా ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, శ్రీలంకపై శతకాలు నమోదు చేశాడు. సెంచరీ తర్వాత రోహిత్ సులువుగా వికెట్ కోల్పోయాడు. కానీ కెఎల్ రాహుల్ ఎదురుదాడితో స్కోరు బోర్డు వేగం తగ్గలేదు. 9 ఫోర్లు, ఓ సిక్సర్తో రాహుల్ వరల్డ్కప్లో తొలి సెంచరీ కొట్టాడు. మలింగ షార్ట్ బాల్ అంచనా వేయటంలో పొరబడిన రాహుల్.. వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికి భారత్ స్కోరు 244/2. కెప్టెన్ విరాట్ కోహ్లి (34 నాటౌట్, 41 బంతుల్లో 3 ఫోర్లు), హార్దిక్ పాండ్య (7 నాటౌట్, 4 బంతుల్లో 1 ఫోర్) లాంఛనం ముగించారు. రిషబ్ పంత్ (4) దూకుడుగా ఆడబోయి ఎల్బీగా అవుటయ్యాడు. ప్రపంచకప్లో చివరి మ్యాచ్లో లసిత మలింగ ఓ వికెట్ తీసుకుని 82 పరుగులు ఇచ్చాడు.
మాథ్యూస్ సెంచరీ : టాస్ నెగ్గిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. పవర్ ప్లేలో యార్కర్ల హీరో జశ్ప్రీత్ బుమ్రా చెలరేగాడు. స్వల్ప స్కోరుకే శ్రీలంక వికెట్లు కోల్పోయింది. భువీ ఓవర్లో వరుస ఫోర్లు బాదిన కెప్టెన్ కరుణరత్నె (10)ను బుమ్రా వికెట్ల వెనకాల క్యాచ్తో వెనక్కి పంపాడు. మరో ఓపెనర్ కుశల్ పెరీరా (18) దూకుడుకూ బుమ్రా ముకుతాడు వేశాడు. ధోని క్యాచ్తో అతడూ పెవిలియన్కు చేరుకున్నాడు. ధోని స్టంపింగ్ మ్యాజిక్తో కుశల్ మెండిస్ (3) జడేజా ఓవర్లో వెనుదిరిగగా.. అవిష్క ఫెర్నాండో (20) వెనక్కి వెళ్లాడు. ఈ దశలో సీనియర్ బ్యాట్స్మన్ ఎంజెలో మాథ్యూస్ (113), లహిరు తిరిమానె (53) ఆరో వికెట్కు శతక భాగస్వామ్యం నిర్మించారు. బౌలర్ల మెరుపులతో నెమ్మదిగానే పరుగులు చేసినా.. వికెట్ల పతనం నిలువరించారు. ఇక్కడ ఇంగ్లాండ్పై అజేయ 85 ఇన్నింగ్స్తో మెరిసిన మాథ్యూస్.. భారత్పై జోరు కొనసాగించాడు. లోయర్ ఆర్డర్లో ధనంజయ డిసిల్వ (29) రాణించటంతో శ్రీలంక 264 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బుమ్రా (3/37) మెరువగా.. భువనేశ్వర్, హార్దిక్ పాండ్య, జడేజా, కుల్దీప్ తలా ఓ వికెట్ తీసుకున్నారు. భువనేశ్వర్ పది ఓవర్లలో 73 పరుగులిచ్చాడు.
సంక్షిప్త స్కోరు వివరాలు :
శ్రీలంక ఇన్నింగ్స్ : 264/7 (మాథ్యూస్ 113, తిరిమానె 53, బుమ్రా 3/37, జడేజా 1/40)
భారత్ ఇన్నింగ్స్ : 265/3 (కెఎల్ రాహుల్ 111, రోహిత్ శర్మ 103, విరాట్ కోహ్లి 34, మలింగ 1/82, ఉదాన 1/50)