Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెమీస్లో భారత్, కివీస్ ఢ
- హాట్ ఫేవరెట్ కోహ్లిసేన
మాంచెస్టర్ :
ప్రపంచకప్లో అత్యంత నిలకడగా సెమీఫైనల్స్కు చేరిన జట్టు న్యూజిలాండ్. ఎనిమిదోసారి వరల్డ్కప్ సెమీస్లో అడుగుపెట్టిన కివీస్.. తొలిసారి 2015లో ఫైనల్లోకి ప్రవేశించింది.
ఈ దశాబ్ద కాలంలో ప్రపంచ క్రికెట్ను శాసించిన ఏకైక జట్టు భారత్. ఓ ప్రపంచకప్, ఓ చాంపియన్స్ ట్రోఫీ విజయాలతో పాటు మరో ప్రపంచకప్లో సెమీఫైనల్స్, చాంపియన్స్ ట్రోఫీలో రన్నరప్గా నిలిచింది. ప్రపంచకప్ సెమీఫైనల్లోకి చేరటం టీమ్ ఇండియాకు హ్యాట్రిక్. 2011, 2015, 2019లలో వరుసగా సెమీస్ గడప తొక్కింది.
గ్రూప్ దశలో భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ వర్షార్పణం సెమీస్ అంచనాలను మరింత పెంచుతోంది. వరుస పరాజయాలతో న్యూజిలాండ్ ఆత్మవిశ్వాసం తగ్గగా.. టాప్ విజయాలతో కోహ్లిసేన జోరందుకుంది.
మాంచెస్టర్లో మెరిసి వరుసగా రెండోసారి ఫైనల్లోకి ప్రవేశించాలని న్యూజిలాండ్ భావిస్తోంది. తిరుగులేని ప్రదర్శనతో రెడ్ హాట్ ఫామ్లో ఉన్న టీమ్ ఇండియా మరోసారి ఫైనల్స్పై కన్నేసింది. మాంచెస్టర్ సమరంలో నెగ్గి, లార్డ్స్ టైటిల్ పోరుకు చేరేందుకు కోహ్లిసేన ఉత్సుకతతో ఎదురుచూస్తోంది. భారత్, న్యూజిలాండ్ తొలి సెమీఫైనల్ పోరు నేడు.
జులై 14, లార్డ్స్. భారత్, న్యూజిలాండ్ లార్డ్స్పై మనసు పారేసుకున్నాయి. మాంచెస్టర్లో మెరిసి, త్వరగా లార్డ్స్కు చేరుకోవాలని ఆరాటపడుతున్నాయి. కానీ మాంచెస్టర్ నుంచి లార్డ్స్ చేరటం రెండు జట్లకూ అంత సులువు కాదు!. ఓ దశలో ప్రపంచకప్లో అజేయ జట్లుగా నిలిచిన న్యూజిలాండ్, భారత్.. అత్యంత పటిష్టంగా కనిపించాయి. కానీ గ్రూప్ దశ ఆఖరి మ్యాచుల్లో ఇరు జట్ల బలహీనతలు బయటపడ్డాయి. మ్యాచులు నెగ్గాలంటే బలహీనతపై దెబ్బకొడితే సరిపోతుంది. కానీ ప్రపంచకప్ నెగ్గాలంటే ప్రత్యర్థి బలాన్ని కుదించాలి. నేడు సెమీఫైనల్ సమరంలో ఆ పని ఎవరు చేస్తారో వారికే లార్డ్స్ ఆహ్వానం అందుతుందని చెప్పనక్కర్లేదు!.
టాప్ సూపర్ : భారత్ అతి పెద్ద బలం టాప్ ఆర్డర్ బ్యాటింగ్ లైనప్. ఓపెనర్లు రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ సహా కెప్టెన్ విరాట్ కోహ్లి భీకర ఫామ్లో ఉన్నారు. ప్రపంచకప్లో జట్టు సాధించిన స్కోరులో 30 శాతం పరుగులు రోహిత్ బ్యాట్ నుంచి వచ్చినవే. రోహిత్ ఐదు సెంచరీలు బాదగా, కోహ్లి ఐదు అర్ధ సెంచరీలు సాధించాడు. రాహుల్ రెండు అర్ధ సెంచరీలు, సెంచరీ నమోదు చేశాడు. నేడు సెమీస్లోనూ భారత్ బ్యాటింగ్ భారం వీరిపైనే ఉంది. వార్మప్ మ్యాచ్లో రోహిత్ శర్మ బలహీనతలను ట్రెంట్ బౌల్ట్ ఎత్తి చూపాడు. మళ్లీ ఈ ఇద్దరి ముఖాముఖి ఆసక్తి రేపుతోంది. బౌల్ట్ను రోహిత్ ఎదుర్కొనే విధానంపై భారత్ ఆరంభం ఆధారపడి ఉంది. లోపం లేని బ్యాటింగ్ శైలి, రిస్క్ ఫ్రీ షాట్లు విరాట్ కోహ్లిని ఆధునిక క్రికెట్ సూపర్స్టార్ను చేసింది. ఎప్పుడు క్రీజులోకి వచ్చినా కోహ్లి వికెట్ కోసం బౌలర్లు శతథా ప్రయత్నం చేయాల్సిందే. క్రీజులో కుదురుకుంటే రాహుల్ను ఆపతరం కాదు. మాంచెస్టర్లో అతడూ మెరిస్తే భారత్ స్కోరు సాధించటం లాంఛనమే.
మిడిల్ ఇప్పుడు ఓకే! : ప్రపంచకప్లో భారత్ ఏకైక, అతిపెద్ద బలహీనత మిడిల్ ఆర్డర్. కెఎల్ రాహుల్ నం.4లో మెప్పించగా.. ఇప్పుడు విధ్వంసక రిషబ్ పంత్ ఆ స్థానంలో ఆడుతున్నాడు. క్లిష్ట పరిస్థితుల్లో గట్టెక్కించగల అనుభవజ్ఞుడు ఎం.ఎస్ ధోని నం.5లో ఉన్నాడు. ప్రమాదకారుడు హార్దిక్ పాండ్య లోయర్ ఆర్డర్లో వస్తున్నాడు. ఈ ముగ్గురి కలయికలో భారత మిడిల్ ఆర్డర్ మెరుగ్గానే కనిపిస్తోంది. టాప్ ఆర్డర్ విఫలమైనా, జట్టును భారీ స్కోరు దిశగా తీసుకెళ్లగలదనే విశ్వాసం కలిగించింది. కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్లలో ఒకరు తుది జట్టులో ఉండనున్నారు.
బంతితో తిరుగులేదు : జశ్ప్రీత్ బుమ్రా బంతితో సూపర్స్టార్. కెప్టెన్ కష్ట సమయంలో బుమ్రా వైపు చూస్తున్నాడు. అతడు వచ్చీ రాగానే వికెట్ తీస్తూ, కెప్టెన్ కండ్లలో ఆనందం నింపుతున్నాడు. ప్రపంచకప్లో ఈ సన్నివేశం ప్రతి మ్యాచ్లోనూ పునరావృతం అవుతూనే ఉంది. కచ్చితమైన యార్కర్లు, తెలివైన షార్ట్ బాల్స్, ఊహించని స్పీడ్ బుమ్రాను బ్యాట్స్మెన్కు సింహస్వప్నం చేస్తున్నాయి. మహ్మద్ షమి, భువనేశ్వర్ కుమార్ సైతం మంచి లయ అందిపుచ్చుకున్నారు. హార్దిక్ పాండ్య పది ఓవర్ల కోటా పూర్తి చేస్తున్నాడు. విలువైన వికెట్లు పడగొడుతున్నాడు. ముగ్గురు పేసర్లతో భారత్ గొప్పగా కనిపిస్తోంది. మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యుజ్వెంద్ర చాహల్ ఆకట్టుకుంటున్నారు. వీరిద్దరిలో ఎవరి స్థానంలోనైనా రవీంద్ర జడేజా ఆడినా.. స్పిన్ ప్రభావశీలమే.
ఆ ఇద్దరు కీలకం : న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ భారత్కు పూర్తి విరుద్ధం. టాప్ ఆర్డర్ చప్పగా ఆడుతున్నా , మిడిల్ ఆర్డర్ మెరుపులతో ఆ జట్టు నిలకడగా విజయాలు సాధిస్తోంది. సీనియర్ బ్యాట్స్మన్ మార్టిన్ గప్టిల్, కొలిన్ మన్రో విఫలమవుతున్నారు. గత నాలుగేండ్లలో కేన్ విలియమ్సన్ ఏకంగా 44 సార్లు ఐదు ఓవర్లలోపే క్రీజులోకి వచ్చాడు. విలియమ్సన్ హీరోయిక్స్తోనే న్యూజిలాండ్ మంచి స్కోర్లు సాధిస్తోంది. బంతిపై నియంత్రణ సాధించటంలో విరాట్తో సమవుజ్జీగా నిలిచాడు విలియమ్సన్. బౌలర్లు అతడి వికెట్ కోసం కష్టపడేలా చేయటం కేన్ అలవాటుగా మార్చుకున్నాడు. మిడిల్ ఆర్డర్లో రాస్ టేలర్ అత్యంత ప్రమాదకారి. టేలర్ మెరిస్తే కివీస్ అలవోకగా భారీ స్కోర్లు సాధిస్తుంది. వికెట్ కీపర్ టామ్ లాథమ్ ఫామ్లో లేకపోయినా.. ఆల్రౌండర్లు జిమ్మీ నీషమ్, కొలిన్ డీ గ్రాండ్హౌమె ఫామ్లో ఉన్నారు. కేన్ విలియమ్సన్, రాస్ టేలర్ ప్రదర్శనపైనే న్యూజిలాండ్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
బౌల్ట్ సవాల్ : బంతితో ట్రెంట్ బౌల్ట్ భారత్కు ప్రమాదకరంగా కనిపిస్తున్నాడు. టాప్ ఆర్డర్ను బౌల్ట్ భయపెట్టగలడు. వర్షం ప్రభావిత మ్యాచుల్లో బౌల్ట్ మరింత ప్రభావం చూపగలడు. మాట్ హెన్రీ, లాకీ ఫెర్గుసన్ వికెట్ల వేటలో ముందుంటున్నారు. బౌల్ట్ సృష్టించిన ఒత్తిడిని ఉపయోగించుకుని వికెట్లు పడగొడుతున్నారు. నేడూ ఇదే ప్రదర్శనను న్యూజిలాండ్ ఆశిస్తోంది. స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ స్పిన్నర్గా తుది జట్టులో ఉండనున్నాడు. భీకర ఫామ్లో ఉన్న భారత బ్యాటింగ్ లైనప్ను నిలువరించటం న్యూజిలాండ్కు కష్టమైన పనే!.
పిచ్ రిపోర్టు : మాంచెస్టర్లో నేడు ఫ్లాట్ పిచ్ ఎదురుచూస్తోంది. భారత్ ఇక్కడ రెండు మ్యాచుల్లో ఓడింది. రెండింటా గెలుపొందింది. 300 ప్లస్ స్కోర్లు బాదిన్ వేదికపై మరోసారి భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఆరంభంలో సీమర్లకు అనుకూలత లభించినా.. స్పిన్నర్లు పరుగుల నియంత్రణలో కీలక భూమిక వహించే ఆస్కారం కనిపిస్తోంది. టాస్ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకునేందుకు మొగ్గుచూపవచ్చు.
తుది జట్లు (అంచనా) :
భారత్ : రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, ఎం.ఎస్ ధోని, దినేశ్ కార్తీక్/కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్/మహ్మద్ షమి, కుల్దీప్ యాదవ్, యుజ్వెంద్ర చాహల్, జశ్ప్రీత్ బుమ్రా.
న్యూజిలాండ్ : మార్టిన్ గప్టిల్, కొలిన్ మన్రో, కేన్ విలియమ్సన్, రాస్ టేలర్, టామ్ లాథమ్, జిమ్మీ నీషమ్, కొలిన్ డీ గ్రాండ్హౌమె, మిచెల్ శాంట్నర్, మాట్ హెన్రీ, ట్రెంట్ బౌల్ట్, లాకీ ఫెర్గుసన్.