Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్షం అంతరాయంతో సాగని సెమీస్ పోరు
- న్యూజిలాండ్ 211/5 (46.1)
- నేడు కొనసాగనున్న సెమీస్ సమరం
- మ. 3 నుంచి స్టార్స్పోర్ట్స్లో ప్రసారం..
మాంచెస్టర్ (ఇంగ్లాండ్)
ప్రపంచకప్ సెమీఫైనల్లో ప్రవేశం కోసం టీమ్ ఇండియా మరో రోజు ఎదురుచూడక తప్పదు. వర్షం అంతరాయంతో న్యూజిలాండ్తో సెమీఫైనల్స్ పోరు మంగళవారం ముందుకు సాగలేదు. దీంతో సెమీస్ సమరం రిజర్వ్ డే (నేడు) కొనసాగుతోంది. నేడు 3 గంటలకు సెమీఫైనల్స్ సమరం మొదలవుతుంది.
ప్రపంచకప్లో టీమ్ ఇండియా ఫైనల్స్ ప్రవేశాన్ని వరుణుడు ఆలస్యం చేశాడు!. బౌలర్ల సమష్టి ప్రదర్శనతో న్యూజిలాండ్ను స్వల్ప స్కోరుకే పరిమితం చేసిన భారత్.. వర్షం అంతరాయంతో విజయం కోసం నేటి వరకూ నిరీక్షించాల్సి వస్తుంది!. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ 46.1 ఓవర్లలో 211 పరుగులు చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (67, 95 బంతుల్లో 6 ఫోర్లు), రాస్ టేలర్ (67 నాటౌట్, 85 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. భారత సీమర్లు జశ్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ నిప్పులు చెరిగారు. నేడు రిజర్వ్ డేలో సెమీఫైనల్స్ పోరు తిరిగి మొదలవనుంది. ముందుగా న్యూజిలాండ్ తమ ఇన్నింగ్స్లో మిగిలిన 23 బంతులను ఎదుర్కొనుంది. భారత్ 50 ఓవర్ల ఛేదనలో బరిలోకి దిగనుంది.
నిప్పులు చెరిగిన బౌలర్లు : టాస్ నెగ్గిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. మాంచెస్టర్ పిచ్పై పరుగుల వరద పారుతుందని అంచనా వేశారు. కానీ అది జరుగలేదు. భారత బౌలర్లు అద్భుతంగా బంతులేశారు. సరైన లెంగ్త్లో బంతులు సంధించటం, క్రమశిక్షణ పాటించటం సహా పిచ్ నుంచి సహకారం లభించింది. దీంతో బ్యాట్స్మెన్ పరుగుల కోసం చెమటోడ్చాల్సి వచ్చింది. పవర్ప్లేలో సీమర్లు బుమ్రా, భువనేశ్వర్ నిప్పులు చెరిగారు. 14 బంతుల్లో ఒక్క పరుగే చేసిన సీనియర్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ను బుమ్రా బోల్తా కొట్టించాడు. ఆఫ్ స్టంప్పై విసిరిన బంతి మార్టిన్ బ్యాట్ను ముద్దాడుతూ స్లిప్స్లో కోహ్లి చేతుల్లో పడింది. చూడచక్కని క్యాచ్ అందుకున్న కోహ్లి కివీస్ను తొలి దెబ్బ కొట్టాడు. అప్పటికి 3.3 ఓవర్లలో న్యూజిలాండ్ 1/1తో నిలిచింది. తొలి పది ఓవర్లలో ఓ వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్ కేవలం 27 పరుగులు చేయగల్గింది.
ఆదుకున్న కేన్, టేలర్ : బుమ్రా, భువనేశ్వర్ సృష్టించిన ఒత్తిడిని స్పిన్నర్లు సద్వినియోగం చేసుకున్నారు. హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా బ్యాట్స్మెన్పై ఒత్తిడి కొనసాగించారు. స్టార్ బ్యాట్స్మన్, కెప్టెన్ కేన్ విలియమ్సన్ (67)తో కలిసి ఓపెనర్ హెన్రీ నికోల్స్ (28, 51 బంతుల్లో 2 ఫోర్లు) రెండో వికెట్కు 68 పరుగులు జోడించాడు. పరుగుల రావటం గగనమైనా, క్లిష్ట పరిస్థితుల్లో వికెట్ కాపాడుకోవటమే న్యూజిలాండ్కు గొప్పగా అనిపించింది. జడేజా చురుకైన టర్న్తో నికోల్స్ వికెట్ గిరాటేశాడు. రాస్ టేలర్తో కలిసి విలియమ్సన్ మరో కీలక భాగస్వామ్యం నమోదు చేశాడు. నాలుగు ఫోర్లతో 79 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించిన విలియమ్సన్ న్యూజిలాండ్ ఇన్నింగ్స్కు వెన్నుముకలా నిలిచాడు. మరో ఎండ్లో రాస్ టేలర్ (67) సైతం పరిస్థితులకు తగినట్టు ఆడాడు. రెండు ఫోర్లు, ఓ సిక్సర్తో 73 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. విలియమ్సన్తో కలిసి 65 పరుగుల భాగస్వామ్యం నిర్మించాడు. క్రీజులో కుదురుకున్న విలియమ్సన్ను చాహల్ వెనక్కి పంపాడు. పాయింట్లో క్యాచ్ అందుకున్న జడేజా కీలక బ్యాట్స్మన్ను పెవిలియన్కు చేర్చాడు. అప్పటికి న్యూజిలాండ్ స్కోరు 134/3. జేమ్స్ నీషమ్ (12), గ్రాండ్హౌమె 916)తో కలిసి రాస్ టేలర్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. వర్షం అంతరాయంతో ఆట నిలిచే సమయానికి టామ్ లాథమ్ (3)తో కలిసి టేలర్ అజేయంగా క్రీజులో నిలిచాడు. 46.1 ఓవర్లలో 4.57 రన్రేట్తో న్యూజిలాండ్ 211/5 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బుమ్రా, భువనేశ్వర్, పాండ్య, చాహల్, జడేజాలు తలా ఓ వికెట్ పడగొట్టారు. చాహల్ పది ఓవర్లలో 63 పరుగులు ఇచ్చుకోగా, పాండ్య పది ఓవర్లలో 55 పరుగులు ఇచ్చాడు.
స్కోరు వివరాలు
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ : మార్టిన్ గప్టిల్ (సి) కోహ్లి (బి) బుమ్రా 1, హెన్రీ నికోల్స్ (బి) రవీంద్ర జడేజా 28, కేన్ విలియమ్సన్ (సి) రవీంద్ర జడేజా (బి) చాహల్ 67, రాస్ టేలర్ నాటౌట్ 67, జేమ్స్ నీషమ్ (సి) దినేశ్ కార్తీక్ (బి) హార్దిక్ పాండ్య 12, కొలిన్ డీ గ్రాండ్హౌమె (సి) ధోని (బి) భువనేశ్వర్ కుమార్ 16, టామ్ లాథమ్ నాటౌట్ 3, ఎక్స్ట్రాలు : 17, మొత్తం : (46.1 ఓవర్లలో 5 వికెట్లకు) 211.
వికెట్ల పతనం : 1-1, 2-69, 3-134, 4-162, 5-200.
బౌలింగ్ : భువనేశ్వర్ కుమార్ 8.1-1-30-1, జశ్ప్రీత్ బుమ్రా 8-1-25-1, హార్దిక్ పాండ్య 10-0-55-1, రవీంద్ర జడేజా 10-0-34-1, యుజ్వెంద్ర చాహల్ 10-0-63-1.